రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సుబ్బారావుకు చదువంటే చాలా ఆసక్తి. పాఠ్యపుస్తకాలు, నోట్సు కష్టపడి సేకరించి, జాగ్రత్తగా క్రోడీకరించి చదువుతూ ఉంటాడు. పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ తాను చదవాలనుకుంటున్నంత వేగంగా చదవలేకపోతున్నానని అతడికి అనిపించసాగింది.
చదివినప్పుడు బుర్రకెక్కినట్లుగా అనిపించిన పాఠాలు ఆ తర్వాత మర్చిపోవడం, ఒకటి గుర్తురావాల్సిన సమయంలో మరోటి గుర్తురావడం, ఎక్కువ సేపు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం ఎక్కువయ్యాయి. సంకోచించకుండా తన సమస్యను ఈ రంగంలో అనుభవం ఉన్న నారాయణ మాస్టారుకు చెప్పుకున్నాడు. ఆయన అతడి సమస్యను పరిశీలించేందుకు సుబ్బారావు ఇంటికి వచ్చాడు. సుబ్బారావు చదివే ప్రదేశం చూడగానే ఆయనకు సమస్య ఎక్కడుందో తెలిసిపోయింది. సుబ్బారావు అలవాటుగా చదువుకొనే ప్రదేశంలో అతడి ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు చాలా కనిపించాయి.
\'చదవడం అనేది కేవలం మానసికమైన పని' అనుకోవడం పొరపాటు. ఏకాగ్రత జ్ఞాపకశక్తి మొదలైన మానసిక అంశాలను భౌతికంగా ఉండే పరిసరాలు అంటే గాలి, వెలుతురు వంటి సౌకర్యాలు ప్రభావితం చేయగలవు. అందుకే చదువుకునే ప్రదేశానికి కొన్ని కనీస లక్షణాలు ఉండాలి. అలా ఉండేలా ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదువుకోవడం మంచిపద్ధతి. చదువు కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిదే కానీ అలా సాధ్యం కానంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన పనిలేదు. అవసరమైతే నిద్రపోయే గదినే చదువుకు కేటాయించండి. కానీ, పడుకుని చదవకండి. దీనికంటే చదువుకోవడానికి ప్రత్యేకమైన గదిని, ప్రదేశాన్ని కేటాయించుకోవడం మంచిది. గదిలోనో, బయటో ఏదో ఒకచోటును ఎంచుకొని ఎప్పుడు చదివినా అక్కడే కూర్చుని చదవడం మంచిపద్ధతి. ఒకసారి మనకు అనుకూలమైన ప్రదేశాన్ని సిద్ధం చేసుకోగలిగితే ఆ ప్రదేశంలోకి రాగానే చదువు మీదికి దృష్టి తనంత తానుగా పోతుంది. కంచం చూస్తే ఆకలివేసినట్లు, పూజగదిలోకి వెళ్లగానే భక్తి పొంగినట్లు చదువుకునే చోటుకు వెళ్లగానే మనసు చదువుకు సన్నద్ధం అవుతుంది.