* కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షల వాయిదాకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ వికారాబాద్కు చెందిన ఆర్.అశోక్.., మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ ఏడేళ్ల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. టీచర్ల అర్హత పరీక్షలు ఏటా నిర్వహిస్తుండగా.. డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి సుదీర్ఘకాలం పడుతోందన్నారు. అందువల్ల అందరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ 2.45 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని.. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక 6 వారాల కంటే ఎక్కువ సమయం ఉందన్నారు. కేవలం 10 మంది అభ్యర్థుల కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టరాదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ ప్రక్రియ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలివ్వాలని కోరగా.. అదనపు అడ్వొకేట్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు డీఎస్సీకి దరఖాస్తు చేశారా అంటూ వారి హాల్టికెట్ల వివరాలపై ఆరా తీశారు. పిటిషనర్లందరూ కోర్టుకు హాల్టికెట్లు సమర్పించకపోవడంతో విచారణను 28కి వాయిదా వేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.