• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా

ఐడీఆర్‌బీటీ ప్రకటన విడుదల

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ) కోర్సులో ప్రవేశానికి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ), హైదరాబాద్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సంస్థను ఆర్‌బీఐ ఆధ్వర్యంలో నెలకొల్పారు. కోర్సులో చేరినవారు బ్యాంకులూ, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై మేటి శిక్షణను సొంతం చేసుకోవచ్చు. కోర్సు చివరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాన్నీ అందుకోవచ్చు. 

అన్ని రంగాలూ సాంకేతికత వినియోగం ఆధారంగానే నడుస్తున్నాయి. బ్యాంకింగ్‌పై ఆ ప్రభావం మరీ ఎక్కువ.  బ్యాంకుల, ఆర్థిక సంస్థల సమర్థ నిర్వహణలో టెక్నాలజీ అవసరాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. ఇందుకోసం 1996లో ఐడీఆర్‌బీటీని హైదరాబాద్‌లో మాసాబ్‌ ట్యాంకు ఎన్‌ఎండీసీ సమీపంలో నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన టెక్నాలజీని అందించడంతోపాటు ఆ రంగాలకు అవసరమైన సాంకేతికాంశాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, అవి లాభదాయకంగా మారడానికి టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో సమర్థ మానవ వనరులు కీలకం. ఆ దిశగా ఆవిర్భవించిందే బ్యాంకింగ్‌ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సు. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు. ప్రస్తుతం అయిదో బ్యాచ్‌లో చేరడానికి ప్రకటన వెలువడింది.

ముఖ్యమైన అంశాలు

మొత్తం సీట్లు: 40. వీటిలో 10 స్పాన్సర్డ్‌. వీటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు. 

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్ట్‌లో ఫస్ట్‌ క్లాస్‌తో పీజీ. అయితే వీరు 10+2+4 విధానంలో చదివుండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్, క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, సీమ్యాట్, గ్జాట్, మ్యాట్, ఆత్మా వీటిలో ఏదో ఒక స్కోరు తప్పనిసరి. 

ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. 

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in//index.html

ఏడాది కోర్సు

కోర్సును ఫుల్‌ టైం విధానంలో ఏడాది వ్యవధితో అందిస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలుపుతారు. ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా రూపొందిస్తారు. భారతీయ బ్యాంకింగ్, ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా అవసరమైన తర్ఫీదు అందిస్తారు. టెక్నాలజీని పలు విధాలుగా ఉపయోగించి బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాల్లో ఉత్పాదకత పెరిగేలా శిక్షణ అందిస్తారు. కోర్సులో ప్రాక్టికల్‌ లర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు.ఈ కోర్సులో చేరినవారికి జులై 1 నుంచి తరగతులు మొదలవుతాయి. వసతితో కలుపుకుని  కోర్సు ఫీజు రూ.5 లక్షలు. పన్నులు అదనం. కోర్సు 3 నెలలకు ఒక టర్మ్‌ చొప్పున 4 టర్మ్‌ల్లో ఉంటుంది. ఇందులో భాగంగా లెక్చర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్‌ సెషన్లు ఉంటాయి. సీనియర్‌ బ్యాంకర్లు, సంస్థకు చెందిన రిసెర్చ్‌ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ బ్యాంకింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, పేమెంట్‌ సిస్టమ్‌...మొదలైనవాటిపై విస్తృత స్థాయిలో శిక్షణ అందిస్తారు. చివరి టర్మ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌కు కేటాయించారు. 

కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు. కోర్సు చివరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్, ఐడీబీఐ, కరూర్‌ వైశ్య, ఫెడరల్, కొటాక్, సౌత్‌ ఇండియా, ఎన్‌పీసీఐ..తదితర సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. 
 

Posted Date: 13-07-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌