మేటి సంస్థల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరాలని ఆశించేవారికోసం ఓ ప్రకటన వెలువడింది. జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) న్యూదిల్లీ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. దేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల జాబితాలో ఏటా రెండో స్థానంలో ఈ సంస్థ నిలుస్తోంది. ఇక్కడ చదువుకునే అవకాశం పొందినవారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతాయి.
ఇవీ కోర్సులు
ఎంఏ: పాలిటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఏరియా స్టడీస్, ఫిలాసఫీ, జాగ్రఫీ, సోషియాలజీ, డెవలప్మెంట్ అండ్ లేబర్ స్టడీస్, డిజాస్టర్ స్టడీస్, ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, సంస్కృతం
ఎమ్మెస్సీ: లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యుటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, మాలిక్యులర్ మెడిసిన్
ఎంఏ విదేశీ భాషలు: పర్షియన్, పాష్టో, అరబిక్, జపనీస్, కొరియన్, చైనీస్, ఫ్రెంచ్ అండ్ ఫ్రాంకోఫోన్ స్టడీస్, జర్మన్ లిటరేచర్, జర్మన్ ట్రాన్స్లేషన్, రష్యన్, స్పానిష్.
అర్హత: కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును డిగ్రీ స్థాయిలో చదివుండాలి. కొన్నింటికి మాత్రం ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులను బట్టి డిగ్రీలో 45/50/55 శాతం మార్కులు ఉండాలి.
యూజీ స్థాయిలో...
బీఏ: పర్షియన్, అరబిక్, జపనీస్, కొరియన్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్.
ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎమ్మెస్సీ: ఆయుర్వేద బయాలజీ
అర్హత: పై రెండు కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
సర్టిఫికెట్: మంగోలియన్, ఇండోనేషి‡యా, ఉర్దూ, పాష్టో, హిబ్రూ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మాస్ మీడియా ఇన్ ఉర్దూలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులో చేరడానికి ఉర్దూ ఒక సబ్జెక్టుగా 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డేటా ఎనలిటిక్స్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎంసీఏ, ఎంటెక్..తదితర కోర్సులు సైతం ఉన్నాయి.
పీహెచ్డీ
పలు విదేశీ భాషలు, ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు/ విభాగాల్లో పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నారు. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
ప్రవేశం: అన్ని కోర్సులకూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. పీహెచ్డీలకు మాత్రం పరీక్షకు 70 శాతం, మిగిలిన 30 శాతం వైవాకు వెయిటేజీ ఉంటుంది.
ప్రవేశపరీక్ష ఇలా
పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆయా సబ్జెక్టులను బట్టి ప్రశ్నల సంఖ్య, ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మార్పులకు అవకాశం ఉంది.
ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
రాతపరీక్షలు: సెప్టెంబరు 20,21,22,23 తేదీల్లో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
వెబ్సైట్: https://jnuexams.nta.ac.in/