‣ సైన్స్, మ్యాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య ప్రవేశాల కోసం నెస్ట్ ప్రకటన విడుదల
సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నెస్ట్ ఒకటి. ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే నెలకు రూ.5000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనాలు అందుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో నెస్ట్-2022 వివరాలు చూద్దాం...
విద్యార్థులకు సైన్స్ కోర్సుల్లో ఆసక్తి పెంచి, పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టు (నెస్ట్) ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు..నైసర్, సీఈబీఎస్ల ప్రత్యేకత. విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ బోధిస్తారు. ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్లో 200, సీఈబీఎస్లో 57 సీట్లు ఉన్నాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్ అందుతుంది. అలాగే వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున కాంటింజెన్సీ ఇస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులకు భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రైనింగ్ స్కూల్లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుంది. ఇలా ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్నపత్రం ఇలా...
పరీక్షను ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. అన్ని సెక్షన్లలోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్కు 50 మార్కులు కేటాయించారు. ఈ నాలుగింటిలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్ల స్కోర్ కలిపి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. దీని ప్రకారం మొత్తం 150 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్ పర్సంటైల్ విధానంలో లెక్కిస్తారు. జనరల్ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 75 పర్సంటైల్ సాధించడం తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు.
సన్నద్ధత ఎలా?
‣ ఇంటర్మీడియట్ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ పుస్తకాలతో అధ్యయనం ప్రారంభించాలి. ప్రాథమికాంశాలు, భావనలపై పట్టు సాధించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.
‣ ఏవైనా 3 సెక్షన్లకు జవాబులు గుర్తిస్తే సరిపోతుంది కాబట్టి బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్ను, మ్యాథ్స్ విద్యార్థులు బయాలజీని మినహాయించుకోవచ్చు.
‣ పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. నెస్ట్ వెబ్సైట్లో 2007 నుంచి 2021 వరకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందుబాటులో ఉంచారు. సబ్జెక్టులవారీ ఏయే చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు, ఎన్నేసి చొప్పున వస్తున్నాయో గమనించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలి.
‣ ఎంసెట్, ఐఐటీ-జేఈఈ, నీట్ పాత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు సాధన చేయడం ఉపయోగపడుతుంది.
‣ పరీక్షకు రెండు వారాల ముందు మాక్ టెస్టు నెస్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని సాధనచేయడం మరింత ప్రయోజనకరం.
ముఖ్య వివరాలు
అర్హత: సైన్స్ గ్రూప్లతో 2020, 2021లో ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2002 తర్వాత జన్మించిన జనరల్, ఓబీసీలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తులు: మే 18 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1200. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
పరీక్ష తేదీ: జూన్ 18
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. (విద్యార్థులు వారి ప్రాధాన్యం ప్రకారం ఐదు పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి. పరీక్ష కేంద్రానికి కనీసం 90 నిమిషాల ముందుగా చేరుకోవాలి)
వెబ్సైట్: www.nestexam.in
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.