• facebook
  • whatsapp
  • telegram

సైన్యంలో సాంకేతిక పోస్టులు

ఇంజినీరింగ్‌ విద్యార్థులు అర్హులు

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) విధానంలో టెక్‌ పోస్టులకు ప్రకటన వెలువరించింది. వీటికి బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.


ఎస్‌ఎస్‌సీ టెక్‌ మెన్, ఉమెన్‌ ఖాళీలు మొత్తం 191 ఉన్నాయి. వీటిలో మెన్‌ 175, ఉమెన్‌ 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. మెన్‌ ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్‌లో 49, మెకానికల్‌ 15, ఎల్రక్టికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ 16, కంప్యూటర్‌ సైన్స్‌ 47, ఎల్రక్టానిక్స్, అనుబంధ విభాగాల్లో 29, ఏరోనాటికల్‌ 5, ఏవియానిక్స్‌ 5, ఏరోస్పేస్‌ 1, ఆటోమొబైల్‌ 2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 2, టెక్స్‌టైల్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌... ఒక్కో విభాగంలో ఒకటి చొప్పున ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్‌ 3, ఎల్రక్టికల్‌ 2, ఎల్రక్టానిక్స్‌ 2, కంప్యూటర్స్‌ 4, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఏరోనాటికల్‌ ఒక్కో విభాగంలో 1 చొప్పున ఉన్నాయి. 


విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఏప్రిల్‌ 1 నాటికి ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు పోటీపడవచ్చు.


వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1994 - ఏప్రిల్‌ 1, 2001లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు. 


ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను వారి గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 


శిక్షణ.. వేతనాలు..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2021 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్‌ కమిషన్‌ లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌ 10) మూల వేతనంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలు పొందవచ్చు. 


వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/
 

Posted Date: 04-12-2020


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌