• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీ ఒకే చోట

పీజీ చేయాలని ముందే నిర్ణయించుకున్నప్పటికీ డిగ్రీ ఒక చోట, పీజీ మరో చోట చేయాల్సి వచ్చి అభ్యర్థులు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతుంటారు. అలాంటి అవస్థలను తొలగించే ప్రధాన ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రా రంభించారు. దీని వల్ల ఎలాంటి అవరోధాలు లేకుండా డిగ్రీ, పీజీ వరుసగా పూర్తిచేయవచ్చు.

విద్యార్థులకు ప్రవేశపరీక్షల ఒత్తిడిని తగ్గించి విద్యా సంవత్సరాన్ని ఆదాచేయాలనే ఉద్దేశంతో దేశంలో, రాష్ట్రంలోనూ విశ్వవిద్యాలయాలు అయిదేళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిని వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలతోపాటు జాతీయస్థాయిలో ప్రముఖ సంస్థలుగా పేరొందిన బిట్స్ పిలానీ, ఐసర్, సెంట్రల్ వర్సిటీలు కూడా ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ప్రధాన ఉద్దేశం

ఇంటర్ తర్వాత పీజీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా కూడా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం. పరిశోధనా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారిని మేధావులుగా రూపొందించడం.

ప్రయోజనం

డిగ్రీ నుంచి పీజీ వరకు జరిగే అవిచ్ఛిన్న అధ్యయనం వల్ల సబ్జెక్టులపై పట్టు కుదురుతుంది. అధ్యాపకులు, తోటి విద్యార్థులతోనూ దీర్ఘకాల అనుబంధం వల్ల వారిసాయంతో కోర్సును విజయవంతంగా పూర్తిచేయవచ్చు.

విద్యార్హతలు

ఇంటర్ ఏ గ్రూప్ వారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. కాకపోతే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/ ఎంఎస్ లాంటి కోర్సులు చేయవచ్చు. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివినవారు బీఏఎల్ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరవచ్చు.

సర్టిఫికెట్ జారీ విధానం

విద్యార్థి మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేసి వద్దనుకుంటే మూడేళ్ల కాల వ్యవధితో సాధారణ డిగ్రీ పట్టా ఇస్తారు. నాలుగేళ్లు చదివి ఆగిపోతే ఆనర్స్ డిగ్రీ (ఉదా: బి.ఎ./ బి.ఎస్‌సి. (ఆనర్స్)), పూర్తిగా 5 సంవత్సరాలు చదివితే పి.జి. (ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ మొదలైనవి) సర్టిఫికెట్ లభిస్తుంది.

రాష్ట్రంలో...

ఇంటిగ్రేటెడ్ కోర్సుల విధానం మన రాష్ట్రంలో 2006లో ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 2006లో జరిగిన యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ (వీసీ)ల సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీన్లో భాగంగా 2006 లో ఆంధ్రా, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2007లో నిజామాబాద్, కడప, రాజమండ్రి ప్రాంతాల్లోని వర్సిటీలకు విస్తరించారు.

ఆంధ్రా యూనివర్సిటీ

రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను మొదట విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రారంభించారు. వీటిలో

1) ఎం.ఎస్.అప్లయిడ్ కెమిస్ట్రీ,

2) ఎం.ఎస్.జియాలజీ,

3) ఎం.ఎస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,

4) ఎం.ఎస్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి.

5) ఎం.ఎస్.ఎకనమిక్స్: ఈ కోర్సుకు ఇంటర్‌లో 50 శాతం మార్కులుండాలి.

అన్నింటికి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

www.andhrauniversity.info

సెంట్రల్ యూనివర్సిటీ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ వర్సిటీ) ఎంఏ, ఎంఎస్సీల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. కోర్సులు...

1) ఎంఎస్సీ ప్రోగ్రాములు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమికల్‌సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టొమెట్రీ అండ్ విజన్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ.

2) ఎంఏ ప్రోగ్రాములు: తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనమిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.

సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

www.uohyd.ac.in

ద్రవిడ యూనివర్సిటీ

కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ

1) ఎంకాం,

2) ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాములను నిర్వహిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా చేరవచ్చు.

www.dravidianuniversity.ac.in

యోగి వేమన వర్సిటీ

కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ఎంఎస్సీ (బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్) ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. ఎంపిక నిమిత్తం వైవీయూ సెట్ రాయాల్సి ఉంటుంది.

http://yogivemanauniversity.ac.in/

నన్నయ వర్సిటీ

రాజమండ్రిలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైన్స్ విభాగంలో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. అవి...

1) ఎం.ఎస్. పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్.

2) ఎం.ఎస్. బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ

3) ఎం.ఎస్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్

4) ఎం.ఎస్. ఎకనమిక్స్.

ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష నిర్వహిస్తారు.

http://www.nannayauniversity.info/

ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. కోర్సుల్లో...

1) ఎం.ఎ. అప్లయిడ్ ఎకనమిక్స్,

2) ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ,

3) ఎం.బి.ఎ.ఉన్నాయి.

వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు.

ఈ కోర్సులను మహాత్మాగాంధీ, తెలంగాణా, పాలమూరు యూనివర్సిటీల్లో కూడా నిర్వహిస్తారు. అన్ని రకాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

www.osmania.ac.in

జాతీయ స్థాయిలో....

ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రాధాన్యాన్ని, వాటి ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని గుర్తించిన ఎయిమ్స్, ఐసర్ లాంటి పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు సైన్స్ సబ్జెక్టులతో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...

ఐఐఎస్ఈఆర్

బిట్స్- పిలానీ

భారతీదాసన్ యూనివర్సిటీ

ఐఐటీలు

ఎయిమ్స్

పుదుచ్చేరి యూనివర్సిటీ

వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైనవి.

సెంట్రల్ యూనివర్సిటీల సెట్

దేశంలోని 7 ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలు కలిసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి 'సెంట్రల్ వర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూ సెట్)ను నిర్వహిస్తున్నాయి. బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడులకు చెందిన ఈ వర్సిటీలు ఎంఏ, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. సీయూ సెట్ రాసేందుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

www.cub.ac.in

'నాగార్జున'లో ఆధునిక కోర్సులు

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెండు రకాల ఇంటిగ్రేటేడ్ కోర్సులను అందిస్తోంది. అవి..

1) ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్,

2) నానో టెక్నాలజీ.

వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు.

1) ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి మూడు సంవత్సరాలకు రూ.18,760లు ఫీజు చెల్లించాలి. అదేవిధంగా నాలుగు, అయిదు సంవత్సరాలకు రూ.32,500లు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సులను సమర్ధంగా నిర్వహించేందుకు ఇప్పటివరకు రూ.1.20 కోట్లు వెచ్చించి అత్యాధునిక లైబ్రరీ, కంప్యూటర్లు, సెమినార్ హాలు, తరగతిగదులను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు ఉజ్వల భవిత

2) నానో టెక్నాలజీ: నానో టెక్నాలజీ రంగంలో నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కోర్సును నాగార్జున వర్సిటీలో 2007లో ప్రవేశ పెట్టారు. ఇందులో ఇప్పటివరకు ఎంసెట్, ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూ సెట్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత విద్యార్థులు కోర్సు నుంచి వెళ్లిపోవాలనుకుంటే వారికి బీఎస్సీ డిగ్రీ ధ్రువపత్రం అందజేస్తారు. మొత్తం అయిదేళ్లు పూర్తిచేస్తే వారికి ఎంఎస్సీ నానో టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ధ్రువపత్రం ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా వివిధ పరిశ్రమల్లో శిక్షణ పొందేలా చూస్తారు.

జేఎన్‌టీయూలో ఇంటర్నేషనల్ కోర్సులు

జేఎన్‌టీయూలో ఇంటర్నేషనల్ కోర్సులు హైదరాబాద్, కాకినాడల్లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే)లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులను 2011లో ప్రారంభించారు. విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభించారు.

బీటెక్ ఈసీఈ: దీన్లో బీటెక్ ఈసీఈ సిగ్నల్ ప్రాసెసింగ్, బీటెక్ ఈసీఈ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, ఈసీఈ రేడియో కమ్యూనికేషన్ కోర్సులు ఉన్నాయి.

బీటెక్ సీఎస్ఈ: దీన్లో బీటెక్ సీఎస్ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ రెండు కోర్సులను జేఎన్‌టీయూకేలో మూడున్నర సంవత్సరాలు, స్వీడన్‌లోని బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 18 నెలలు చదవాల్సి ఉంటుంది.

ఎంటెక్, ఎంఎస్సీ ఇంజినీరింగ్: దీన్లో ఈసీఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ కోర్సు ఉంది. తొలి ఆరునెలలు జేఎన్‌టీయూకేలో, ఏడాది బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదవాల్సి ఉంటుంది.

బీటెక్ సివిల్, ఎంఎస్ ఇంజినీరింగ్: మూడున్నర సంవత్సరాలు జేఎన్‌టీయూకేలో, ఏడాదిన్నరపాటు బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేయాలి. 

www.jntuh.ac.in

Posted Date: 16-11-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌