‣ ఆర్ఐఈ, ఇతర ప్రసిద్ధ సంస్థల్లో అవకాశం
సమాజంలో గౌరవం, వృత్తిపరమైన సంతృప్తి, ఆకర్షణీయ వేతనాలు.. ఇవన్నీ బోధన రంగంపై యువతరం అభిరుచిని పెంపొందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించడానికి ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి. ప్రస్తుతం వివిధ సంస్థలు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు అందిస్తున్నాయి. అలాంటివాటిలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)లు ముఖ్యమెనవి. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ బీఏ/బీఎస్సీ ఎడ్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్ కోర్సుల్లో ఇంటర్ విద్యార్హతతోనే చేరవచ్చు. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుల్లో చేరడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసుకోవచ్చు. సాధారణ పద్ధతుల్లో ముందు డిగ్రీ అనంతరం బీఎడ్ పూర్తిచేయడానికి మొత్తం అయిదేళ్లు అవసరమవుతుంది. ఇంటిగ్రేటెడ్ చదువుల కారణంగా ఏడాది సమయం ఆదాతో పాటు నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అభ్యసించడానికి వీలవుతుంది. ఈ అవకాశాన్ని జాతీయస్థాయిలో పేరున్న సంస్థలు కల్పిస్తున్నాయి.
ఆర్ఐఈలు.. సీట్లు
ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ల్లో ఆర్ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఆర్ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు.
మైసూర్లో బీఎస్సీ బీఎడ్ (ఫిజికల్ సైన్స్)లో 44, బీఎస్సీ బీఎడ్ (బయలాజికల్ సైన్స్)లో 44, బీఏ బీఎడ్ 44 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటితోపాటు ఎమ్మెస్సీ ఎడ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 18 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఎడ్ కోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సు పూర్తిచేసినవారు మైసూర్లోనే ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ స్కాలర్షిప్పులు లభిస్తాయి. మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. ఇక్కడి విద్యార్థులకు ఏటా ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారు. బీఎ/ బీఎస్సీ ఎడ్ చదువుకున్నవారికి నెలకు కనీసం రూ.25 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సుల వారికి కనీసం నెలకు రూ.35 వేల చొప్పున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
అర్హత: బీఎస్సీ బీఎడ్ కోర్సులో చేరడానికి ఇంటర్ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సుకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్ కోర్సుకు సైన్స్ / ఆర్ట్స్/ కామర్స్ ఏదైనా స్ట్రీమ్తో ఇంటర్ చదివినవాళ్లు అర్హులు. ఏ కోర్సుకైనా ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం) 2019, 2020లో ఇంటర్ పూర్తిచేసివారు, ఈ సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్లో సాధించిన మార్కులతో కోర్సులోకి తీసుకుంటారు. ఆర్ఐఈల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తోంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. పరీక్షలో భాషా నైపుణ్యాలు, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్లో 20, టీచింగ్ ఆప్టిట్యూడ్లో 30, రీజనింగ్ ఎబిలిటీలో 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాలవారీ సిలబస్, పాత ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో పొందుపరిచారు.
అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ
బోధన రంగంలో కోర్సులు అందిస్తోన్న పేరున్న సంస్థల్లో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ విధానంలో బీఎస్సీ బీఎడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమేటిక్స్ మూడు సైన్స్ విభాగాల్లోనూ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 18, క్వాంటిటేటివ్ రీజనింగ్ 18 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఎస్సే/ డేటా అనాలిసిస్/ ప్రాబ్లమ్ సాల్వింగ్లో రాత పరీక్షనూ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థి విభాగం బట్టి ఒక ప్రశ్న అడుగుతారు. గంట వ్యవధిలో సమాధానం రాయాలి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంస్థలో చదువుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దరఖాస్తులకు గడువు ముగిసింది.
వెబ్సైట్: https://azimpremjiuniversity.edu.in/SitePages/index.aspx
సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ...
‣ తేజ్పూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సును మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తోంది.
‣ ఇంటిగ్రేటెడ్ బీఏ బీఎడ్ కోర్సును జమ్మూ, సౌత్ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు.
‣ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ (మ్యాథ్స్) సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఏమిటి ప్రత్యేకత?
ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సును పేరున్న సంస్థల్లో చదివినవారు బోధనలో మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే వీరికి మొదటి ఏడాది తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ సులువుగానే పోటీ పడగలరు. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పే సమర్థతా వీరికి ఉంటుంది. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. వరుసగా నాలుగేళ్లపాటు చదవడం వల్ల సబ్జెక్టుపై గట్టి పట్టు దక్కుతుంది. ప్రసిద్ధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ టీచింగ్ కోర్సులు చదివినవారికి జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి.
సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే సమున్నత లక్ష్యంతో ప్రాంతీయ విద్యా శిక్షణ సంస్థ (ఆర్ఐఈ) లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ అర్హతతో ఈ సంస్థల్లో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్, అలాగే ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్ కోర్సునూ చదువుకోవచ్చు. ఈ తరహా చదువులపై ఆసక్తి ఉన్నవారు ఆర్ఐఈల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. సెమిస్టర్ విధానంలో బోధన ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున 8 సెమిస్టర్లు ఉంటాయి. చివరి ఏడాది ఏదైనా పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది
ఇంటిగ్రేటెడ్ ఎడ్ అందించే కొన్ని సంస్థలు
‣ స్త్ర డీమ్డ్ యూనివర్సిటీ, తంజావూర్: బీఏ(ఇంగ్లిష్) బీఎడ్, బీఎస్సీ (మ్యాథ్స్) బీఎడ్, బీఎస్సీ (ఫిజిక్స్) బీఎడ్ కోర్సులు నడుపుతోంది.
‣ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, గుజరాత్ (గాంధీనగర్): ఇంటిగ్రేటెడ్ బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎంఎడ్, ఎమ్మెస్సీ ఎంఎడ్ కోర్సులు చదువుకోవచ్చు.
‣ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్, తమిళనాడు (దిండిగల్): బీఎస్సీ బీఎడ్ కోర్సు అందిస్తోంది.
‣ జీడీ గోయంకా యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్ కోర్సులు ఉన్నాయి.
‣ పై సంస్థల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడాల్సి ఉంది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్మీడియట్ మార్కులతో సీట్లు కేటాయిస్తారు.
ఆర్ఐఈ మైసూరులో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సీట్లు ఇలా..
(ఎమ్మెస్సీ ఎడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఒక్కో సబ్జెక్టులో 18 చొప్పున మొత్తం 54 సీట్లు ఉన్నాయి. వీటికి రాష్ట్రాల కోటా వర్తించదు. హరియాణాలోని ప్రారంభ్ సంస్థ అందించే బీఎస్సీ బీఎడ్ 70, బీఏ బీఎడ్ 30 సీట్లకు దేశవ్యాప్తంగా అందరూ పోటీ పడవచ్చు)
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. మిగిలిన అందరికీ రూ.వెయ్యి.
రాత పరీక్ష తేదీ: జులై 18
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్/సికింద్రాబాద్
వెబ్సైట్: http://cee.ncert.gov.in/