• facebook
  • whatsapp
  • telegram

ఎదురులేని ఎంపీసీ!

ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పూర్తయితే ఏం చేయాలి? ఇటు ఇంటర్‌ ఉత్తీర్ణులకీ, అటు టెన్త్‌ పాసై ఎంపీసీ తీసుకోవాలనుకునే వారికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఇది. ఇంజినీరింగ్‌ తప్ప ఇంకేమీ వెంటనే తోచదు. కానీ ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్న ఆ కోర్సుల్లోకి ఎంపీసీ గ్రూప్‌ వాళ్లు ఎంటరైపోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు; మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల పట్ల అభిరుచితో వాటిలోనే కెరియర్‌ వెతుక్కోవాలనుకునే వారికి; ఎర్త్‌ సైన్స్‌, హెల్త్‌ సైకాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఓషనోగ్రఫీ వంటి భిన్నమైన చదువుల్లో చేరాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇంజినీరింగ్‌ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ ఎంపీసీకీ ఎదురులేదని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరుతుంటారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ దాదాపు ఇదే ట్రెండ్‌ అనుసరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలు మారుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉంటున్న ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకో మార్గంలో కెరియర్‌ కొనసాగించాలని భావిస్తున్నారు. అది పిల్లల ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటున్నారు. వాస్తవానికి అలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఎన్నో రకాల డిగ్రీలు, పీజీలను దేశవ్యాప్తంగా పలు ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్నాయి. అవన్నీ ఎంపీసీ విద్యార్థులకు ప్రత్యేకం. తమ గ్రూప్‌ కాకుండా వేరే సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీలకు సంబంధించిన ఇతర కోర్సుల దిశగానూ అడుగులేయవచ్చు. అటు సైన్స్‌, ఇటు ఆర్ట్స్‌ అన్ని గ్రూపుల్లోనూ చేరే అవకాశం ఎంపీసీ విద్యార్థులకు ఉంది. చేయాల్సిందల్లా ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలకు అనుగుణంగా అడుగులేయడమే.

ఇంజినీరింగ్‌
ఎంపీసీతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేయగానే మొదట కనిపించే దారి ఇంజినీరింగ్‌. దీని కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ ప్రవేశపరీక్షలున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం జేఈఈ ద్వారా లభిస్తుంది. ఏపీ, తెలంగాణల్లోని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే పలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేఎల్‌యూ, గీతం, విజ్ఞాన్‌ ఈ తరహాలో ప్రవేశాలు కల్పిస్తాయి. బిట్స్‌, విట్‌, ఎస్‌ఆర్‌ఎం ఇలా ఎన్నో విద్యాసంస్థలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి. విద్యార్థులు తమ ప్రతిభకు అనుగుణంగా వీటిలో కొన్నింటిని ఎంచుకుని, వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఇంజినీరింగ్‌ సీటు ఖాయమైనట్లే. సంబంధిత పరీక్షలు రాసి ఆర్మీ, నేవీల్లో చేరి బీటెక్‌ కోర్సు చదువుకోవడానికి ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంది.

ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైన్స్‌ కోర్సులు
ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపించడానికి ఏర్పాటుచేసినవే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏడు చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. తిరుపతి, బరంపూర్‌, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో వీటిని ఏర్పాటు చేశారు. బీఎస్‌-ఎంఎస్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. వీటిలో మూడు మార్గాల ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు సాధించినవాళ్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు ప్రవేశానికి పరీక్ష రాయకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండూ లేనివారికి ప్రవేశపరీక్ష ద్వారా అవకాశం కల్పిస్తారు. అలాగే జేఈఈ ర్యాంకర్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవాళ్లు సైతం ఐఐఎస్‌ఈఆర్‌ నిర్వహించే పరీక్షను రాసుకోవచ్చు. సగం సీట్లు జేఈఈ ర్యాంకులు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా సగం సీట్లను ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి కేటాయిస్తారు. ఏడు సంస్థల్లోనూ కలిపి 1300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా రూ.అయిదు వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.
బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సులు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్వైరాన్మెంటల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ (ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌లో ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి).

సైన్స్‌ రిసెర్చ్‌
పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశించే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మరో మంచి వేదిక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌. జేఈఈ, నీట్‌ ర్యాంకులు, కేవీపీవై స్కాలర్‌షిప్‌ల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థ నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు నిర్వహిస్తోంది. కోర్సులో చేరినవాళ్లు ఏదైనా సైన్స్‌ సబ్జెక్టును ప్రత్యేకంగా చదవడంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అంశాలు అదనంగా నేర్చుకోవడం తప్పనిసరి. అత్యంత నిష్ణాతులైన బోధనా సిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వసతులు ఐఐఎస్సీలో ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదివి పీజీ పట్టా అందుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్వైరాన్మెంటల్‌ సైన్స్‌ల్లో ఒకదానిని స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో డిగ్రీలను ప్రదానం చేస్తారు.

ఉపాధికి భరోసా ఆర్కిటెక్చర్‌
ఎంపీసీ విద్యార్థులు చేయదగ్గ మరో కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌). నిర్మాణ రంగంలో ఇంజినీరింగ్‌ సేవలు అందించాలనుకునేవారు ఈ కోర్సులో చేరవచ్చు. అయితే కోర్సు వ్యవధి అయిదేళ్లు. పలు ఐఐటీలు, ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈలో అదనంగా మరో పేపర్‌ రాయాల్సి ఉంటుంది. డ్రాయింగ్‌ నైపుణ్యం ఉన్నవారికి ఆర్కిటెక్చర్‌ అదనపు ఆకర్షణ. ప్రస్తుతం ఈ కోర్సుకు అన్నిచోట్లా డిమాండ్‌ ఉంది. కాబట్టి ఇష్టంతోచేరి కష్టపడి చదువుకున్నవారికి ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదు. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ఈ కోర్సులకు ప్రసిద్ధ సంస్థ.

మ్యాథ్స్‌లో బీఎస్సీ ఆనర్స్‌
చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణితంలో యూజీ కోర్సులకు దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. బీఎస్సీ (ఆనర్స్‌)- మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; బీఎస్సీ (ఆనర్స్‌)-మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ మూడేళ్ల కోర్సులు ఇక్కడ చేయవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ చదువుకున్నవారికి స్టైపెండ్‌ చెల్లిస్తారు.

స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ల్లో డిగ్రీ
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దృష్టిసారించాల్సిన సంస్థల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ప్రధానమైంది. నాణ్యమైన బోధన, ఉన్నత ప్రమాణాలు, వసతులతోపాటు ప్రతినెలాస్టైపెండ్‌ అందించడం ఐఎస్‌ఐ ప్రత్యేకత. ఇక్కడ బీ-స్టాట్‌, బీ-మ్యాథ్స్‌ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ. 3 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (బీ-స్టాట్‌) కోర్సు నిర్వహిస్తున్నారు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ (బీ-మ్యాథ్స్‌) కోర్సు అందిస్తున్నారు. కోర్సుల వ్యవధి మూడేళ్లు.

ఫ్యాషన్‌ టెక్నాలజీ
ఫ్యాషన్‌ కోర్సులకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు దేశంలో పేరుపొందిన సంస్థలు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 16 చోట్ల వీటిని నెలకొల్పారు. వీటిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌ టెక్‌ - అపారెల్‌ ప్రొడక్షన్‌) కోర్సులో ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంపీసీ విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అలాగే ఇక్కడ పలు ఇతర డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలోనూ చేరవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కూడా పలు కోర్సులు అందిస్తోంది. మరికొన్ని సంస్థలూ బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి.

పరిశోధనల మార్గంలో!
పరిశోధనా రంగంలో రాణించాలనుకునే ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) మంచి అవకాశం. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థల్లో ప్రవేశం లభించినవారు ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ కింద అయిదేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ఉపకార వేతనం పొందవచ్చు. అలాగే వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. నైసర్‌లో 202, సీఈసీఎస్‌లో 47 సీట్లు ఉన్నాయి. శాస్త్రవేత్తలతో బోధన ఇక్కడి ప్రత్యేకత. ఆఖరి సంవత్సరంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

బీఎస్సీ
ఇంటర్‌ తర్వాత నచ్చిన గ్రూప్‌ కాంబినేషన్లతో బీఎస్సీ కోర్సులో చేరిపోవచ్చు. ఇంటర్‌లో సాధించిన మార్కుల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. అందుబాటులో ఉన్న కొన్ని కాంబినేషన్లు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌; మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ; మ్యాథ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, జియాలజీ; జియాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ..ఇలా పలు కాంబినేషన్లతో చదువుకోవచ్చు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బీఎస్సీ (ఫిజిక్స్‌) కోర్సు అందిస్తోంది. బీఎస్సీ అనంతరం ఎంపీసీ విద్యార్థులు ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జామ్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.

మరెన్నో!
ఇతర కోర్సుల గురించి పరిశీలిస్తే పలు సంస్థలు యానిమేషన్‌లో బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఆసక్తి ఉంటే బీఫార్మసీ చేయవచ్చు. ఇంకా లా, సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌, డీఎడ్‌ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. మరికొన్ని సంస్థలు, కళాశాలలు ఫిజికల్‌ ఓషనోగ్రఫీ, జియలాజికల్‌ ఓషనోగ్రఫీ, మెరైన్‌ కెమిస్ట్రీ మొదలైన కోర్సులను డిగ్రీ స్థాయిలో అందిస్తున్నాయి. ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో ఇంటర్‌ ఎంపీసీతో బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఐఎస్‌ఎం ధన్‌బాద్‌, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ వంటి సంస్థలు బీటెక్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌ కోర్సు అందిస్తున్నాయి. వైవిధ్యం కోరుకునేవారు వీటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇందులోనూ పలు స్పెషలైజేషన్లు బీటెక్‌ స్థాయిలో ఉన్నాయి.

బీఎడ్‌, ఎమ్మెస్సీ ఎడ్‌
ఒకవైపు ఇంటర్‌ గ్రూప్‌లతోనే డిగ్రీని కొనసాగిస్తూ, మరోవైపు బీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సులు పూర్తి చేసుకునే సౌలభ్యాన్ని మైసూర్‌లోని ఆర్‌ఐఈ కల్పిస్తోంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ ఆరేళ్ల కోర్సును మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తున్నారు. దీంతోపాటు నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ (ఎంపీసీ) ఎడ్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఎడ్‌ కోర్సు అందిస్తోంది.

బీటెక్‌ వద్దనుకుంటే!
ఎంపీసీ తర్వాత ఇంజినీరింగ్‌ వద్దనుకునే వారికి, అందరూ బీటెక్‌లే చేస్తున్నారు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకునే వారికి బేసిక్‌ సైన్సెస్‌, ఇతర కోర్సులు చక్కటి మార్గాలు.వీటిలో కొన్నింటిని అన్ని గ్రూప్‌ల వాళ్లు చేయవచ్చు.
బేసిక్‌ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు బేసిక్‌ సైన్స్‌ల్లో ఇంటర్‌ తర్వాత పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, నైసర్‌, పుదుచ్చేరి, హైదరాబాద్‌ల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. అలాగే పలు సంస్థలు సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ కోర్సులు అందిస్తున్నాయి. ఐఎస్‌ఐ కోల్‌కతా, సీఎంఐ-చెన్నై, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఇంకొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-ఎడ్‌, బీఎస్సీ-ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇవేవీ కాదనుకుంటే రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ సబ్జెక్టుల నుంచి మారాలనుకుంటే లా, డీఎడ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. డిగ్రీలో సైన్స్‌ సబ్జెక్టులే కాకుండా ఎకనామిక్స్‌, పాలిటీ, హిస్టరీ, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, టూరిజం స్టడీస్‌ మొదలైన వాటిలో చేరవచ్చు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్సీ
ఇంటిగ్రేటెడ్‌ విధానంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ కోర్సులను అందిస్తోంది. వీటి వ్యవధి అయిదేళ్లు మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, హెల్త్‌ సైకాలజీ కోర్సుల్లో ఎంపీసీ విద్యార్థులు చేరవచ్చు. వీటితోపాటు కావాలనుకుంటే ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ కోర్సుల్లోనూ చేరడానికి అవకాశం ఉంది. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ - అప్లైడ్‌ జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌ కోర్సులు అందిస్తోంది.
ఇటీవల ఏర్పడిన పది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్వైరాన్మెంటల్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, బీఎస్సీ-ఎడ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. సీయూ సెట్‌లో చూపిన ప్రతిభ ద్వారా వీటిలోకి ప్రవేశం లభిస్తుంది.
ఐఐటీల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ప్రవేశం జేఈఈ ద్వారా లభిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, ఉస్మానియాలే కాకుండా దాదాపు అన్ని యూనివర్సిటీలూ కనీసం ఒక సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. సంబంధిత యూనివర్సిటీ సెట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు.

Posted Date: 20-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌