సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది. దీనికితోడు నేరాల రూపురేఖలు మారుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో వైట్ కాలర్ నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించాలంటే సమర్థులైన, సాంకేతిక నైపుణ్యం ఉన్న న్యాయ నిపుణులు కావాల్సి వస్తున్నారు. సామాజిక భద్రతను, న్యాయవాదులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనే విద్యా సంస్థలు న్యాయ విద్యలో అనేక డిగ్రీ, పీజీ, డిప్లొమా స్థాయి కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి వివరాలు...
సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్బీ అయిదు సంవత్సరాల 'లా' కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే. న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి.
‣ అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు.
న్యాయ విద్యలో లభిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు:
1) బీఏ ఎల్ఎల్బీ జనరల్,
2) బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్,
3) బీకాం ఎల్ఎల్బీ జనరల్,
4) బీకాం ఎల్ఎల్బీ ఆనర్స్,
5) బీబీఏ ఎల్ఎల్బీ జనరల్,
6) బీబీఏ ఎల్ఎల్బీ ఆనర్స్,
7) బీఎస్సీ ఎల్ఎల్బీ జనరల్,
8) బీఎస్సీ ఎల్ఎల్బీ ఆనర్స్.
ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రాములు. కాల వ్యవధి అయిదేళ్లు. ఈ కోర్సుల్లో చేరడంవల్ల ఏడాది ఆదా కావడమే కాకుండా ఒకేసమయంలో రెండు డిగ్రీలు (ఉదా: బీబీఏ + ఎల్ఎల్బీ) పొందే వీలుంటోంది.
ప్రవేశ విధానం
న్యాయ విద్యలోకి ప్రవేశించేందుకు జాతీయ స్థాయిలో 'క్లాట్', ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే... 3 లేదా 5 ఏళ్ల లా డిగ్రీ చేయడానికి లాసెట్ రాయాల్సి ఉంటుంది.
లాసెట్
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్రాల్లో 'లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్)' పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల లా కళాశాలల్లో చేరవచ్చు. అభ్యర్థులకు లాసెట్లో కనీసం 35 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
లాసెట్ ఆధారంగా చేరదగిన కోర్సులు:
1) ఎల్ఎల్బీ / బీఎల్ (కాలవ్యవధి 5 సంవత్సరాలు). ఈ కోర్సుకు ఇంటర్లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి.
2) ఎల్ఎల్బీ / బీఎల్ (3 ఏళ్ల కోర్సు).(అర్హత: డిగ్రీలో సగటున 45 శాతం మార్కులు అవసరం.)
జాతీయ స్థాయిలో...
న్యాయ విద్యను జాతీయ స్థాయి వర్సిటీల్లో చదవాలంటే ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది...
‣ క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) : దేశంలోని జాతీయస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష- క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్). దీని ప్రకటన వెలువడింది. పట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (సీఎన్ఎల్యూ) పరీక్షను ఈ ఏడాది నిర్వహిస్తోంది. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో సీటు లభిస్తుంది. క్లాట్ ద్వారా ప్రవేశం కల్పించే సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో... అత్యాధునిక కరిక్యులమ్, మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం మూలంగా నాణ్యమైన బోధన లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. అందుకే కోర్సు పూర్తిచేసినవారికి కెరియర్ పరంగా ఢోకా ఉండదు. క్లాట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో... తెలంగాణలో నల్సార్ (హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం (విశాఖపట్నం) లో ప్రవేశాలు పొందవచ్చు.
పరీక్ష విధానం
ఇది ఆన్లైన్ పరీక్ష. దీనిని 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇంగ్లిష్: 40 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్: 50 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథ్స్: 20 ప్రశ్నలు, లీగల్ అవేర్నెస్/ లీగల్ ఆప్టిట్యూడ్: 50 ప్రశ్నలు, లీగల్ రీజనింగ్: 40 ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఈ సంస్థల్లో ప్రవేశాలు
క్లాట్ ర్యాంకు ఆధారంగా... 17 న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలుంటాయి. అవి:
‣ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (ఎన్ఎల్ఎస్ఐయూ)
‣ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ (నల్సార్)
‣ ద నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్ (ఎన్ఎల్ఐయూ)
‣ ద వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జుడీషియల్ సైన్సెస్, కోల్కతా (డబ్ల్యూబీఎన్యూజేఎస్)
‣ నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్పూర్ (ఎన్ఎల్యూజే)
‣ హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్పూర్ (హెచ్ఎన్ఎల్యూ)
‣ గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్ (జీఎన్ఎల్యూ)
‣ డా.రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లఖ్నవూ (ఆర్ఎంఎల్ఎన్ఎల్యూ)
‣ రాజీవ్గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పంజాబ్ (ఆర్జీఎన్యూఎల్)
‣ చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పట్నా (సీఎన్ఎల్యూ)
‣ ద నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్, కొచ్చి (ఎన్యూఏఎల్ఎస్)
‣ నేషనల్ లా యూనివర్సిటీ ఒడిశా, కటక్ (ఎన్ఎల్యూఓ)
‣ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ (ఎన్యూఎస్ఆర్ఎల్)
‣ నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడిషియల్ అకాడమీ, అసోం (ఎన్ఎల్యూజేఏఏ)
‣ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం (డీఎస్ఎన్ఎల్యూ)
‣ తమిళనాడు నేషనల్ లా స్కూల్, తిరుచిరాపల్లి (టీఎన్ఎన్ఎల్ఎస్)
‣ మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, ముంబయి (ఎంఎన్ఎల్యూ)
(ఈ పదిహేడే కాకుండా పలు ప్రైవేటు సంస్థలు క్లాట్ స్కోర్తో న్యాయవిద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి)
అర్హత వివరాలు
‣ ఎల్ఎల్బీ 5 సంవత్సరాల కోర్సు (యూజీ), ఎల్ఎల్ఎం సంవత్సరం (పీజీ) కోర్సులకు ప్రవేశం.
‣ 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు 10+2 లేదా సమాన పరీక్షను 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 40% మార్కులతో పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్ రాయవచ్చు.
‣ ఎల్ఎల్ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్ఎల్బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్సీ, ఎస్టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్ రాయవచ్చు.
‣ అభ్యర్థులకు వయసు పరిమితి నిబంధన ఏమీ లేదు.