• facebook
  • whatsapp
  • telegram

ఎంపీసీతో ఎన్నో మార్గాలు! 

ఇంటర్ తర్వాత 

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎక్కువమందే ఉంటారు. వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి అన్ని రకాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఈ గ్రూపువారికి ఉంటుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ...ఇలా చాలా కోర్సుల్లో చేరవచ్చు లేదా మేనేజ్‌మెంట్, టీచింగ్, లా, డిజైన్, అకౌంట్స్‌... తదితర కోర్సుల దిశగానూ అడుగులేయవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందున్న అవకాశాలు చూద్దాం!

ఇంజినీరింగ్‌

ఈ కోర్సుని లక్ష్యంగా చేసుకునే ఎక్కువమంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూపులో చేరుతున్నారు. వీరిలో అధిక శాతం ఐఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు కోసం పోటీ పడుతున్నారు. ఐఐటీ- జేఈఈ స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు సొంతమవుతుండడంతో తమ కెరియర్‌ను మలుపు తిప్పే కోర్సుగా బీటెక్‌/ బీఈకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటర్‌ తర్వాత నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులోనూ చేరే అవకాశం ఉంది. దీంతో అయిదేళ్లకే కోర్సు పూర్తయి ఏడాది సమయం ఆదా అవుతుంది. కొన్ని ఐఐటీలతోపాటు పేరున్న సంస్థల్లో ఈ తరహా కోర్సులు ఉన్నాయి. 

విద్యార్థులు మాత్రం బీటెక్‌లో చేరడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్‌ బ్రాంచీల వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఆర్మీ, నేవీలు ఏటా రెండుసార్లు 10+2 టెక్నికల్‌ ఎంట్రీ విధానంలో ఎంపీసీ విద్యార్థులను ఎంపిక చేసి, బీటెక్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. జేఈఈ స్కోరు, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు అనంతరం లెఫ్టినెంట్, సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటున్నాయి. బీటెక్‌ అనంతరం ఎంఎస్‌ లేదా ఎంటెక్‌ ఆ తర్వాత పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. సీఎస్‌ఐఆర్‌ నెట్‌తో బీటెక్‌ అర్హతతోనే స్టైపెండ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరడానికీ అవకాశం ఉంది. పరిశోధన, బోధనలో భాగం కావాలనుకునేవాళ్లు ఈ తరహా చదువులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బీటెక్‌ అనంతరం విదేశాల్లో ఎంఎస్‌ (పీజీ) కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. 

బీఫార్మసీ

ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎంసెట్‌ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులవారికి చెరి సగం సీట్లు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత నేరుగా ఫార్మ్‌ డి కోర్సులోనూ చేరడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి.

ఫ్యాషన్‌ టెక్నాలజీ

నిఫ్ట్‌లతోపాటు ఎన్నో విద్యాసంస్థలు బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు అందిస్తున్నాయి. నిఫ్ట్‌లు నిర్వహించే ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఫ్యాషన్‌ రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. వ్యవధి నాలుగేళ్లు. అనంతరం ఎంటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. పీజీలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. పీజీ తర్వాత పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు.

పైలట్‌

ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు చదివినవారికే పైలట్‌ శిక్షణ తీసుకునే అవకాశం దక్కుతుంది. దేశంలో చాలా ప్రైవేటు సంస్థలు పైలట్‌ కోర్సు అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం తప్పనిసరి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ పరీక్షతో ఉచితంగా పైలట్‌ కోర్సు పూర్తిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఎంపికైనవారు ఒక వైపు బీటెక్‌ చదువుకుంటూనే పైలట్‌ శిక్షణ పొంది ఏర్‌ఫోర్స్‌లో సేవలు అందించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి.

ఆర్కిటెక్చర్‌

ఇంజినీరింగ్‌లో ఆర్కిటెక్చర్‌ ప్రత్యేక విభాగంగా చెప్పుకోవచ్చు. నిర్మాణాలు, కట్టడాల్లో సృజనాత్మకత చూపడానికి ఇష్టపడేవారు, డ్రాయింగ్‌ నైపుణ్యం ఉన్నవారు ఆర్కిటెక్చర్‌ వైపు అడుగులేయవచ్చు. ఐఐటీ-జేఈఈలో మరో పేపర్‌ అదనంగా రాయడం వల్ల ఈ సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే నాటాతోనూ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్కిటెక్చర్‌ చదువుల నిమిత్తం ప్రత్యేక సంస్థలు సైతం వెలిశాయి. బీఆర్క్‌ తర్వాత ఎంఆర్క్‌ చదువుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్లకు దేశీయంగా, విదేశాల్లోనూ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌

బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో చదువుకున్నవారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. పేరొందిన సంస్థల్లో ఈ తరహా చదువులు లభిస్తున్నాయి. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సును ఆరేళ్ల వ్యవధితో అందిస్తోంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఫిజికల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌ల్లో బీఎస్‌సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. తేజ్‌పూర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ బీఎస్‌సీ ఎడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించనివారు రెండేళ్ల డీఎడ్‌ కోర్సుల్లో చేరవచ్చు.

బీఎస్‌సీ  

ఎంపీసీ విద్యార్థులు బీటెక్‌ తర్వాత బీఎస్‌సీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లకు ఎక్కువమంది పోటీ పడుతున్నారు. బీఎస్‌సీలో వైవిధ్యమైన కాంబినేషన్లు ఎంచుకునే అవకాశం ఇప్పుడుంది. ఆనర్స్‌ కోర్సులూ చదువుకోవచ్చు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అందించే మూడేళ్ల బీస్టాట్, బీమ్యాథ్స్‌ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువ. చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్, చెన్నై ఆనర్స్‌ విధానంలో బీఎస్‌సీ కోర్సులు అందిస్తోంది. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బీఎస్‌సీ మ్యాథ్స్, ఫిజిక్స్‌ కోర్సులు అందిస్తోంది. బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ సంస్థలు అందించే కోర్సులు ఉపయోగపడతాయి. ఇప్పుడు బీఎస్‌సీలోనూ డేటాసైన్స్, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, యాక్చూరియల్‌ సైన్స్‌...మొదలైన అంశాలను ఎంచుకునే వీలుంది.

బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులు

ఐఐఎస్‌సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా పుట్టుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను అయిదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి ఈ కోర్సులను రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ ఐఐటీ-జేఈఈ స్కోరుతో ప్రవేశాలు లభిస్తాయి. కేవీపీవైకు ఎంపికైనవారు నేరుగా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీ వైపు దృష్టి సారించవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ

ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో కోర్సులు అందించే సంస్థలు పెరుగుతున్నాయి. ఐఐటీలన్నీ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తున్నాయి. సీట్లు జేఈఈతో భర్తీ చేస్తారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నెస్ట్‌తో నైసర్‌-భువనేశ్వర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఇలా ప్రవేశం పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ పొందవచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి.

ఇతర దారులు

ఎంపీసీ నేపథ్యంతో కాకుండా వేరే దారిలో వెళ్లాలని భావించేవారి కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు చాలా సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్‌తో ప్రముఖ న్యాయవిశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్, లిబరల్‌ స్టడీస్, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు..ఇలా ఎవరికి వారు తమకి నచ్చిన మార్గాన్ని ఎంచుకుని చదివే స్వేచ్ఛ ఉంది.

Posted Date: 10-11-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌