‣ ఇంటర్ తర్వాత
వైద్యవిద్య లక్ష్యంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే ఆ అవకాశం లభిస్తుంది. మరి మిగిలిన విద్యార్థుల సంగతి? వీరికోసం ఎన్నో కోర్సులు ఉన్నాయి. వాటితో బంగారం లాంటి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫార్మసీ, ఫిజియో థెరపీ, ఫిషరీ సైన్స్, ఎంఎల్టీ, నర్సింగ్, టీచింగ్, రిసెర్స్, రెగ్యులర్ బీఎస్సీ...ఇలా విస్తృత సంఖ్యలో ఆప్షన్లు వీరి ముందు ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం!
ఎంబీబీఎస్ సీటు లక్ష్యంగా ఇంటర్ బైపీసీ ప్రస్థానం మొదలవుతుంది. నీట్ స్కోరు ఇందుకు దారి చూపుతుంది. ఎంబీబీఎస్లో అవకాశం రానివాళ్లు బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, వెటర్నరీ కోర్సుల్లో చేరుతున్నారు. కొంతమంది విదేశాల్లోనూ వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్తున్నారు. ఎక్కువ మంది పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తిచేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా వైద్యవిద్యలో చేరగా మిగిలినవారు ఎంచుకోవడానికి భిన్న మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
పారా మెడికల్
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారా మెడికల్ కోర్సులు ఉపయోగపడతాయి. వీరు ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ కేంద్రాల్లో సేవలు అందించవచ్చు. అనస్తీషియా టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, స్లీప్ లేబొరేటరీ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్ టెక్నాలజీ, ఆర్తోపెడిక్స్ టెక్నాలజీ, డెంటల్ హైజీనిస్ట్, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ తదితర బ్యాచిలర్ కోర్సులు బైపీసీ విద్యార్థులు చదువుకోవచ్చు.
కోర్సులను బట్టి వీటి వ్యవధి మూడేళ్లు, మూడున్నర, నాలుగేళ్లుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎయిమ్స్ వివిధ కేంద్రాలతోపాటు ఎన్నో ఇతర సంస్థల్లో ఈ కోర్సులు ఉన్నాయి. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలోని చాలా సంస్థల్లో ఈ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సైతం పారామెడికల్ శిక్షణ అందిస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. రాష్ట్రాల పారా మెడికల్ బోర్డుల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఇంటర్ మార్కుల మెరిట్తో సీట్లు కేటాయిస్తారు.
స్పెషల్ బీఎస్సీ
అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెరికల్చర్..తదితర విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధితో ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా సమారు 74 విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్) తరఫున ఎన్టీఏ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్ స్కోరుతో అవకాశం కల్పిస్తారు. ఈ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. యూజీ తర్వాత పీజీ, పీహెచ్డీ కోర్సులను సంబంధిత విభాగాల్లో పూర్తిచేసుకోవచ్చు. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మేటి ఉద్యోగాలు పొందవచ్చు. పీహెచ్డీతో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు.
రెగ్యులర్ బీఎస్సీ
ఎక్కువ మంది బైపీసీ విద్యార్థులు సాధారణ బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ చదువుల్లో నచ్చిన మూడు కోర్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు వైవిధ్యమైన కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత విద్యకూ, బోధన, పరిశోధనల్లో రాణించడానికీ బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఆక్వాకల్చర్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ...తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. అనంతరం ఈ సబ్జెక్టుల్లోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో చేరవచ్చు.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
ఇంటర్ బైపీసీ తర్వాత నేరుగా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరే అవకాశాన్ని వివిధ సంస్థలు కల్పిస్తున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్...తదితర కోర్సులు ఇంటిగ్రేటెడ్ విధానంలో అందిస్తున్నారు. .
బీఎస్-ఎంఎస్ కోర్సులు
ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్ పట్టా పుచ్చుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్ఈఆర్లు బీఎస్-ఎంఎస్ కోర్సులను అయిదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి ఈ కోర్సులను రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ నీట్ స్కోర్తో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్డీవైపు దృష్టి సారించవచ్చు.
బీఫార్మసీ
ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎంసెట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ వారికోసమే కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. పరిశోధన, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారు ఫార్మసీలో పీహెచ్డీ పూర్తిచేసుకుని ఔషధాల తయారీలో పాలుపంచుకోవచ్చు.
నర్సింగ్

ఫిజియోథెరపీ
బైపీసీ విద్యార్థులు పరిశీలించదగ్గ కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. ఇది పూర్తిచేసుకున్నవారికి ఉపాధికి ఢోకా ఉండదు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 50 కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు అందుబాటులో ఉంది. జాతీయ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేక సంస్థలు వెలిశాయి. ఎయిమ్స్తోపాటు పేరున్న సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇటీవల గీతం, విశాఖపట్నం ఫిజియో కోర్సు ప్రారంభించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఈ కోర్సు అభ్యసించవచ్చు. ఇంటర్ మార్కుల మెరిట్/ ఎంసెట్/నీట్ స్కోరు లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటారు. బీపీటీ పూర్తిచేసుకున్నవారు ఎంపీటీ కోర్సులో చేరవచ్చు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్ దిశగా అడుగులేయవచ్చు.
ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్
బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సు వైపు అడుగులేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తి చేసుకుని ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని కేంద్రీ విద్యాసంస్థల్లోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించనివారు రెండేళ్ల డీఎడ్ కోర్సుల్లో చేరవచ్చు.
ఇతర చదువులు
