పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇంటర్మీడియట్ కోర్సులు. తెలుగు రాష్ట్రాల్లో 85 గ్రూపు కాంబినేషన్లతో ఇంటర్ బోర్డులు వీటిని అందిస్తున్నాయి. భవిష్యత్తు లక్ష్యాల ప్రకారం విద్యార్థులు వీటిలో తమకు అనువైనవి ఎంచుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్; బోటనీ, జువాలజీ; హిస్టరీ, ఎకనామిక్స్; లాజిక్, మ్యూజిక్; సైకాలజీ, సోషియాలజీ...ఇలా ఎన్నో కాంబినేషన్లతో కోర్సులు ఉన్నాయి.
పలు రంగాలు, వృత్తుల్లో ప్రవేశానికి ఇంటర్ చదువులు సింహద్వారంలా ఉపయోగపడతాయి. కోరుకున్న విభాగంలో రాణించడానికి అందుకు తగ్గ సబ్జెక్టులు, గ్రూప్ను ఇంటర్మీడియట్లో ఎంచుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల లక్ష్యం దిశగా తొలి అడుగు పడినట్లవుతుంది. నేటి తరం విద్యార్థులకు ఎంచుకోవడానికి ఎన్నో కెరీర్లు ఉన్నాయి. రాణించడానికి రహదారి లాంటి మార్గాల సంఖ్యా తక్కువేమీ కాదు. అయితే వాటిలో ఏ దారి సరైనదో గుర్తించగలిగితే గెలుపు దిశగా తొలి అడుగు పడినట్లే.
దేశవ్యాప్తంగా...
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పది పూర్తయిన ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఇంజినీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లుగా రాణించడానికి ఇంటర్ చదువులు పునాదిగా నిలుస్తాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్; రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్, డైట్సెట్, లాసెట్ వీటన్నింటికీ ఇంటర్ కోర్సులే ఆధారం. తెలుగు రాష్ట్రాల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ల ఆధ్వర్యంలో 85 గ్రూపు కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి చోటా ఉన్నవి మాత్రం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీలే. మ్యూజిక్, లాజిక్, సైకాలజీ... మొదలైన సబ్జెక్టులను సైతం ఇంటర్ నుంచే చదువుకోవచ్చు. ఈ కోర్సులు అందించే కళాశాలలు పరిమితంగానే ఉన్నాయి. ఇంటర్లో విద్యార్థి చేరిన గ్రూపును బట్టి 3 లేదా 4 సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఆంగ్లం, మరో భాష తప్పనిసరి. ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్న విద్యార్థులు ముందుగా ఆయా గ్రూపుల వారీ ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే ఒక నిర్ణయానికి రావడం సులువవుతుంది.
గ్రూపు ఎంపికలో...
స్వీయ సమీక్షే కొలమానం కావాలి. సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా ఉన్నవాటిని ఎంచుకున్నప్పుడు అందులో రాణించడం సులువవుతుంది. సరైన అవగాహనతో అడుగులేస్తే మేటి నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది.
పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు లేదా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. కింది తరగతుల్లో ఆ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులకూ గ్రూప్ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, ఏ సబ్జెక్టు అమితానందాన్ని ఇస్తుంది, ఏ సబ్జెక్టును చాలా సౌకర్యవంతంగా భావిస్తున్నారో తెలుసుకుని అటు వైపు మొగ్గు చూపవచ్చు.
జీవిత లక్ష్యం ఏమిటి? అందుకు ఏ కోర్సులు (సబ్జెక్టులు) చదవాలి. ఆ సబ్జెక్టులపై ఆసక్తి ఉందా? లేదా? విశ్లేషించుకోవాలి. ఆసక్తి లేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవాలి లేదా ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ఉదాహరణకు డాక్టర్ కావాలని ఆశించే వ్యక్తికి బయాలజీ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందువల్ల ఏ మాత్రం ఇష్టంలేని సబ్జెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ ఇంజినీర్ కావాలనుకున్న వ్యక్తి మ్యాథ్స్లో పట్టు లేకపోయినప్పటికీ నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉన్నప్పుడు ఎంపీసీ గ్రూపు ఎంచుకుని ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలి.
ఎంచుకోవడమిలా...
మ్యాథ్స్, ఫిజిక్స్ రెండు సబ్జెక్టులపైనా ఆసక్తి, ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్నవారు ఇంటర్ ఎంపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు.
మొక్కలు, జంతువులు, వైద్యరంగం వీటిలో దేనిపై ఆసక్తి ఉన్నా బైపీసీ తీసుకోవాలి.
అంకెలు, వర్తకరంగం, మదింపు...తదితర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్ దిశగా అడుగులేయాలి.
చరిత్ర, సమకాలీన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నవారు ఆర్ట్స్ కోర్సుల్లో చేరిపోవచ్చు.
గ్రూపుల వారీ...
ఎంపీసీ: గత కొన్నేళ్లగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటోన్న గ్రూప్ ఇదే. భవిష్యత్తులో బీఈ/ బీటెక్, బీఆర్క్ కోర్సులు చదవడానికి ఎంపీసీ తప్పనిసరి. అలాగే పైలట్ కావాలన్నా ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఫ్యాషన్ టెక్నాలజీ దిశగా అడుగులేయడానికీ గణిత నేపథ్యం ఉండాల్సిందే. ఇంటర్ ఎంపీసీ చదివినవారు బీఎస్సీలోనూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు లేదా స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ...ఇలా కొత్త సబ్జెక్టులూ తీసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్- ఎమ్మెస్సీ, ఎంటెక్; బీఎస్-ఎంఎస్, డీఎడ్, లా, డిజైన్, ఫార్మసీ..ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇదే విద్యార్హతతో ప్రత్యేకంగా ఎన్నో కొలువులూ లభిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్ ఎంపీసీ అర్హతతో పోటీ పడవచ్చు. ఆర్మీ, నేవీల్లో 10+2 టెక్ ఎంట్రీతో ఉచితంగా బీటెక్ చదువుకుని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్లో మ్యాథ్స్పై ఆసక్తి తగ్గితే బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ...మొదలైనవాటిలోనూ చేరవచ్చు.
బైపీసీ: వైద్య వృత్తి, అనుబంధ విభాగాల్లో సేవలు అందించడానికి ఇంటర్లో బయాలజీ(బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. అలాగే వ్యవసాయ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, కొన్ని పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి బైపీసీ గ్రూప్తో ఇంటర్ చదివుండాలి. ఫిషరీ సైన్స్, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైన కోర్సులకు బైపీసీ అనివార్యం. ఫిజిక్స్ మినహాయించి ఇంటర్లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో తీసుకోవచ్చు. వీరు ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, డీఎడ్, లా, డిజైన్...తదితర కోర్సుల్లో చేరవచ్చు. బైపీసీ గ్రూప్ తీసుకున్నవారు కొన్ని డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసి సొంతంగా రాణించవచ్చు.
ఎంఈసీ: గణాంకం, వర్తక, వాణిజ్య రంగాల్లో రాణించాలని అభిలషించేవారికి ఎంఈసీ మేటి కోర్సు. ఈ గ్రూప్ విద్యార్థులకోసమే అంటూ ప్రత్యేకమైన పై చదువులు ఏమీ లేనప్పటికీ సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్ల్లో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మేనేజ్మెంట్ కోర్సులు చదవాలనుకున్నవారు ఎంఈసీ దిశగా అడుగులేయవచ్చు. బిజినెస్ ఎనలిస్ట్, స్టాటిస్టీషియన్, మార్కెట్ నిపుణులు...మొదలైన రంగాలకు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల నేపథ్యం పనికొస్తుంది. వీరు ఉన్నత విద్య (డిగ్రీ)లో భాగంగా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు. లేదా బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, డీఎడ్, లా, హోటల్ మేనేజ్మెంట్...మొదలైన కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనమిక్స్పై పట్టున్నవారికి మేటి అవకాశాలు లభిస్తున్నాయి. ఐఐటీలతోపాటు ప్రసిద్ధ సంస్థల్లో వీరు చదువుకోవచ్చు.
సీఈసీ: ఎకనామిక్స్, కామర్స్ కలయికతో ఈ కోర్సులు చదివినవాళ్లు అకౌంటింగ్ రంగంలో రాణించవచ్చు. వీరు భవిష్యత్తులో సీఏ, సీడబ్ల్యుఏ, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందవచ్చు లేదా న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య అభ్యసించవచ్చు. బీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, డీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్బీ కోర్సులు సైతం ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవి.
హెచ్ఈసీ: గ్రూప్స్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలు రాయడానికి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టుల కాంబినేషన్ పనికొస్తుంది. వీరు ఇంటర్ తర్వాత బీఏలో సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్, హోటల్ మేనేజ్మెంట్ వీరికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. న్యాయవాద వృత్తి, బోధన రంగంలోనూ వీరు రాణించగలరు. అందువల్ల ఇంటర్ తర్వాత డీఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఏబీఎడ్; బీఏ బీఎల్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీల్లో అందిస్తోన్న ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో చేరడం ద్వారా ఈ గ్రూపు విద్యార్థులు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ఇంటర్ పాపులర్ గ్రూప్ కాంబినేషన్లు
‣ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
‣ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
‣ ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
‣ సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
‣ హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
కాలేజీకి నేరుగా వెళ్లి చదవలేనివాళ్లు నేషనల్ / స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. రెగ్యులర్ విధానంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా పలు కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్తో సమాన గుర్తింపు లభిస్తుంది.
వృత్తుల/ కెరియర్ల వారీ అవసరమైన గ్రూపులు..
పైలట్: మ్యాథ్స్, ఫిజిక్స్తో ఇంటర్లో చేరాలి.
లాయర్: ఏ గ్రూప్తోనైనా ఇంటర్
ఇంజినీర్: ఇంటర్ ఎంపీసీ లేదా మూడేళ్ల డిప్లొమా
డాక్టర్: ఇంటర్ బైపీసీ
టీచర్: ఏ గ్రూప్తోనైనా ఇంటర్
చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ: ఏ గ్రూపుతోనైనా ఇంటర్. అయితే పదోతరగతి పూర్తికాగానే ఏది ఏమైనా సీఏ, సీఎస్, సీడబ్లుఏల్లో ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు చదవాల్సిందే అని తీర్మానించుకున్నవారు ఎంఈసీ లేదా సీఈసీ గ్రూప్లో చేరడమే ఉత్తమం. ఈ గ్రూప్ల్లో ఉండే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పాఠ్యాంశాలు సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ ఫౌండేషన్ నిమిత్తం పనికొస్తాయి. హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, డిజైన్, టూరిజం అండ్ ట్రావెల్, యానిమేషన్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఫైన్ ఆర్ట్స్...ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంది.