డాక్టర్గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు.
బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.
వైద్యవిద్యా కోర్సుల్లో చేరదల్చిన విద్యార్థులు ‘నీట్’ ర్యాంకు పొందడం తప్పనిసరి. గతంలో వివిధ పరీక్షలు వివిధ విశ్వవిద్యాలయాలకు జరిగేవి కానీ ఇప్పుడు ఎంబీబీఎస్లో ప్రవేశానికి దేశం మొత్తంలో జరిగే పరీక్షలు మూడే. అవి..
1) నీట్
2) ఎయిమ్స్
3) జిప్మర్
నీట్తో పోలిస్తే ఎయిమ్స్, జిప్మర్ ద్వారా ఉండే సీట్ల సంఖ్య చాలా తక్కువ. దేశంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన మొత్తం 52,305 సీట్లు నీట్ - యూజీలో అర్హులైన విద్యార్థులతోనే భర్తీ చేయాల్సి వుంటుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందాలన్నా నీట్లో అర్హత పొందాల్సిందే. తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తప్పనిసరిగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) రాయాల్సివుంది. మొదట ఏఐపీఎంటీ రూపంలో ఉన్న ఈ పరీక్ష 2016 నుంచి ‘నీట్’గా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు లేదా డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లకు మైనారిటీ సంస్థలతో కలిపి నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరి అయింది.