• facebook
  • whatsapp
  • telegram

సేవా నిరతికి... సత్వర ఉపాధికి!

కరోనా విలయంలో ప్రజలను కాపాడటానికి శ్రమిస్తున్న అందరికీ చప్పట్లు.. దీపాలు.. పూలతో దేశమంతా అభినందనలు తెలియజేసింది. వారి సేవా నిరతికి హారతి పట్టింది. ఆ అపూర్వ గౌరవాన్ని అందుకున్నవారిలో వేలాదిమంది నర్సులూ ఉన్నారు. అలాంటి ఉదాత్తమైన ఉద్యోగాల్లో చేరి సేవలందించడంపై ఆసక్తి ఉంటే నర్సింగ్‌ కోర్సుల్లో చేరవచ్ఛు ఇంటర్మీడియట్‌ నుంచే ఆ దిశగా కెరియర్‌ను ప్రారంభించవచ్ఛు నర్సులకు దేశ, విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు, వేతనాలు అందుతున్నాయి.

సుశిక్షితులైన నర్సులకు భారత్‌తోపాటు విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఆటోమేషన్‌, మాంద్యం ఈ రెండూ నర్సింగ్‌ లాంటి వృత్తులపై ప్రభావాన్ని చూపకపోవడం సానుకూలాంశం. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, హెల్త్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్‌ హోంలు, కార్పొరేట్‌ సంస్థలు..అన్నిచోట్లా నర్సులకు ఉపాధి దొరుకుతుంది.

బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు రూ.44,900 మూలవేతనంతో ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.70 వేలు అందుకోవచ్ఛు వీరిని ఆర్మీలో నేరుగా లఫె్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా జీతం చెల్లిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్సుల పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం రూ.పాతిక వేలకు పైగా లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.నలభై వేలు అందుకోవచ్ఛు కార్పొరేట్‌ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసిన వారిని ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ. 20 వేలకు పైగా వేతనం ఇచ్చి నియమించుకుంటున్నాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు కార్పొరేట్‌ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రత్యేక సేవలను అందించవచ్ఛు బోధన రంగాన్నీ ఎంచుకోవచ్ఛు

విదేశాల్లోనూ డిమాండ్‌

అభివృద్ధి చెందిన దేశాలన్నీ నర్సుల కొరత ఎదుర్కొంటున్నాయి. గల్ఫ్‌, యూఎస్‌, యూకే, మిడిల్‌ ఈస్ట్‌ల్లో భారత నర్సులకు డిమాండ్‌ ఉంది. సబ్జెక్టు ప్రావీణ్యం, ఆంగ్ల నైపుణ్యం ఉన్నవారిని యూఎస్‌, కెనడా, సింగపూర్‌ తదితర దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రపంచానికి నర్సులను అందిస్తున్న టాప్‌ 5 దేశాల్లో భారత్‌ ఒకటి. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆయా దేశాల వారీ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. యూఎస్‌ కోసం ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌)లో స్కోరు, నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ - రిజిస్టర్డ్‌ నర్స్‌ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్‌ - ఆర్‌ఎన్‌)లో ఉత్తీర్ణత తప్పనిసరి. కెనడాలో కెరియర్‌ ఆశించేవారు కెనడియన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌ (సీఆర్‌ఎన్‌ఈ), దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్‌ పరీక్ష, ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ పరీక్ష రాయాలి..కొన్ని గల్ఫ్‌ దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి..

ఏయే కోర్సులు?

ఏఎన్‌ఎం: ఆక్సిలరీ నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం) కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ ఈ కోర్సులో చేరవచ్ఛు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాశాలలు ఏఎన్‌ఎం కోర్సును అందిస్తున్నాయి. వీటిలోకి ప్రవేశాలు నేరుగా లభిస్తాయి. ఏఎన్‌ఎం అనంతరం వరుసగా జీఎన్‌ఎం, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేయవచ్ఛు ఏఎన్‌ఎం పూర్తిచేసుకున్నవారు గ్రామ స్థాయుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన ప్రాథమిక సేవలను అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉపకేంద్రాల్లో (హెల్త్‌ సబ్‌సెంటర్స్‌) విధులు నిర్వర్తిస్తారు. చిన్నారులకు టీకాలు వేయించడం, బాలింతలకు పౌష్టికాహారం, సప్లిమెంట్లు ఇవ్వడం, సహజ కాన్పులను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం వీరి విధుల్లో భాగం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ప్రాథమిక సేవలను అందించవచ్ఛు

జీఎన్‌ఎం: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు ఈ కోర్సు నిర్వహిస్తున్నాయి ఇంటర్‌ మెరిట్‌తో కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ రెగ్యులర్‌ విధానంలో చదువుకోవచ్ఛు దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితోనూ పూర్తిచేసుకోవచ్ఛు అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరవచ్ఛు

బీఎస్సీ నర్సింగ్‌: నర్సింగ్‌ విద్యలో ప్రాధాన్యం ఉన్న కోర్సు ఇది. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్‌ మార్కుల మెరిట్‌ లేదా ఎంసెట్‌ ర్యాంకు లేదా ప్రవేశ పరీక్షతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్ఛు

ఉన్నత విద్య

ఎమ్మెస్సీ నర్సింగ్‌: కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇందులో కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్‌, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకలాజికల్‌ నర్సింగ్‌, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసుకున్నవారు ఎమ్మెస్సీలో చేరవచ్ఛు
పోస్టు బేసిక్‌ డిప్లొమా: ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్‌ డిప్లొమా కోర్సుల్లోనూ చేరవచ్ఛు కార్డియో థొరాసిక్‌, క్రిటికల్‌ కేర్‌, మిడ్‌ వైఫరీ, న్యూరో సైన్స్‌, అంకాలజీ, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, సైకియాట్రిక్‌, నియోనేటల్‌, ఆపరేషన్‌ రూమ్‌, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్‌, ఆప్తాల్మిక్‌, టీబీ, లెప్రసీ..ఇలా నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకునే వీలుంది. 

బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేయవచ్ఛు లేదా కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్న నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్సీ ప్రొగ్రాంలో చేరవచ్ఛు ఇంటర్‌ బైసీసీ విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వచ్ఛు నర్సింగ్‌ విద్యపై ఆసక్తి ఉన్న హైస్కూల్‌ విద్యార్థులు ఇంటర్‌లో బైపీసీ ఎంచుకోవడమే మంచిది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్‌ఎం కోర్సులోకి ప్రవేశాలు రద్దవుతాయి. అప్పుడు బైసీసీ కాకుండా ఇతర గ్రూపులు చదివిన విద్యార్థులు ఏఎన్‌ఎం కోర్సులో చేరడానికే అవకాశం ఉంటుంది. ఎక్కువ కళాశాలలు మహిళల కోసమే కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని సంస్థల్లోనే మేల్‌ నర్సింగ్‌ విద్య అందుబాటులో ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ ఉన్నతీకరణకు అవకాశాలున్నాయి. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. ప్రస్తుతం మనదేశం 20 లక్షల మంది నర్సుల కొరతను ఎదుర్కొంటోంది. 2030 నాటికి 60 లక్షల మంది సేవలు అవసరమని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీప భవిష్యత్తులో వైద్యరంగ సిబ్బందిని.. అందులోనూ ముఖ్యంగా నర్సులను పెద్ద సంఖ్యలో నియమించుకో బోతున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఎయిమ్స్‌ న్యూదిల్లీ, భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, పట్నా, రాజ్‌పూర్‌, రుషికేష్‌ల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ కోర్సు మహిళల కోసం అందిస్తున్నారు. 

క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ), వెల్లూరు 

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌ (ఏఎఫ్‌ఎంసీ), పుణె 

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్మర్‌), పుదుచ్చెరి 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, చండీగఢ్‌ 

మణిపాల్‌ అకాడమీ 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న నర్సింగ్‌ కళాశాలలు 

నిమ్స్‌, అపోలో, యశోదా..తదితర సంస్థల ఆధ్వర్యంలో నర్సింగ్‌ పాఠశాలలు.

Posted Date: 22-01-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌