‣ కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం అందించే చదువుల్లో నర్సింగ్ ముందుంటుంది. సేవకు చిరునామా... ఈ వృత్తి! ఆసుపత్రుల్లో వైద్యుల తర్వాతి ప్రాధాన్యం వీరిదే. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నర్సుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వీరికి డిమాండ్ బాగా పెరిగింది. భారత నర్సులకు విదేశాల్లో ఆకర్షణీయ వేతనాలూ, ప్రోత్సాహకాలూ అందుతున్నాయి. ఇప్పటికిప్పుడు సుమారు 30 వేల మంది, వచ్చే నాలుగైదేళ్లలో దాదాపు 20 లక్షల మంది నర్సుల అవసరం భారత్లో ఉంది. ఆసక్తి ఉన్నవారు నర్సింగ్ కోర్సుల్లో చేరడానికి ఇదే సరైన సమయం. తాజాగా చాలా విద్యాసంస్థలు ప్రవేశ ప్రకటనలు వెలువరించిన నేపథ్యంలో నర్సింగ్ కోర్సులూ, కెరియర్ అవకాశాల వివరాలు...
నర్సింగ్ విద్యలో ప్రవేశం ఇంటర్మీడియట్ తర్వాత సాధ్యమవుతుంది. ఏఎన్ఎం/ఎంపీహెచ్డబ్ల్యు, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏఎన్ఎం/ఎంపీహెచ్డబ్ల్యు, జీఎన్ఎం కోర్సుల్లోకి ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంది. బీఎస్సీ నర్సింగ్ చదవడానికి బైపీసీ తప్పనిసరి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వివిధ స్థాయుల్లో నర్సింగ్ కోర్సులు అందిస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులతో ప్రవేశాలు లభిస్తాయి. ఏపీలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఎంసెట్ ర్యాంకుతో భర్తీ చేస్తున్నారు. ఎక్కువ సంస్థలు మహిళల కోసమే నర్సింగ్ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని చోట్లే మేల్ నర్సింగ్ విద్య అందుబాటులో ఉంది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరినవారికి ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి.
ఏఎన్ఎం/ ఎంపీహెచ్డబ్ల్యు
ఆగ్జిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం) / మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యు) కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులూ వీటిలో చేరవచ్చు. ప్రవేశాలు నేరుగా లభిస్తాయి. ఈ చదువులు పూర్తిచేసుకున్నవారు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉప కేంద్రాల్లో (హెల్త్ సబ్ సెంటర్స్) విధులు నిర్వర్తించవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. ఆసక్తి ఉన్నవారు జీఎన్ఎం, పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.
జీఎన్ఎం
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్ మెరిట్తో కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుకోవచ్చు లేదా ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితో పూర్తిచేసుకోవచ్చు. అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్లో చేరవచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలు లభిస్తాయి.
బీఎస్సీ నర్సింగ్
నర్సింగ్ విద్యలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కోర్సు ఇది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్ మార్కుల మెరిట్ లేదా ఎంసెట్ ర్యాంకు లేదా ప్రవేశ పరీక్షతో అవకాశం కల్పిస్తారు. వీరికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. అన్ని చోట్లా ఉద్యోగాలు లభిస్తాయి. బీఎస్సీ నర్సింగ్ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్ ఆ తర్వాత ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేసుకోవచ్చు.
ఉన్నత విద్య
‣ పోస్టు బేసిక్ డిప్లొమా: ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్ డిప్లొమా కోర్సుల్లోనూ చేరవచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్ కేర్, మిడ్ వైఫరీ, న్యూరో సైన్స్, ఆంకాలజీ, ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనేటల్, ఆపరేషన్ రూమ్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్, ఆప్తల్మాలిక్, టీబీ, లెప్రసీ..ఇలా నచ్చిన స్పెషలైజేషన్ ఎంచుకునే వీలుంది.
‣ ఎమ్మెస్సీ నర్సింగ్: ఇందులో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకాలాజికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ నర్సింగ్, పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఎమ్మెస్సీలో చేరవచ్చు. అనంతరం స్పెషాలిటీ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు లేదా బోధన దిశగా అడుగులేయడానికి ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేసుకోవచ్చు.
‣ బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు ఎంచుకోవచ్చు. లేదా కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తోన్న నర్స్ ప్రాక్టీషనర్ క్రిటికల్ కేర్ పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో చేరవచ్చు. ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీరు డాక్టర్ అందుబాటులో లేనప్పుడు చాకచక్యంగా అత్యవసర సేవలు అందించగలరు.
దేశంలో ప్రముఖ కళాశాలలు
‣ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, పట్నా, రాజ్పూర్, రుషికేష్ల్లో బీఎస్సీ నర్సింగ్ ఆనర్స్ కోర్సును మహిళల కోసం అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు.
‣ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ), వెల్లూరు
‣ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఏఎఫ్ఎంసీ), పుణె
‣ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్), పుదుచ్చేరి
‣ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, చండీగఢ్
‣ మణిపాల్ అకాడెమీ
‣ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న నర్సింగ్ కళాశాలలు
‣ నిమ్స్, అపోలో, యశోదా..తదితర ఆసుపత్రులు నర్సింగ్ కోర్సులు అందిస్తున్నాయి.
ప్రకటనలు వెలువడ్డాయ్..
‣ నిమ్స్, హైదరాబాద్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన వెలువరించింది. బైపీసీ గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ ఇంటర్ విద్యార్హతతో ఏపీలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులో ప్రవేశానికి ఉమ్మడి ప్రకటన వెలువడింది.
‣ స్విమ్స్ తిరుపతి బీఎస్సీ నర్సింగ్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
‣ వీటన్నింటి దరఖాస్తు గడువు అక్టోబరులో ముగిసింది.
‣ ఏపీ, తెలంగాణల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రకటనలు వెలువడతాయి.
భారతీయ నర్సులకు డిమాండ్
సుశిక్షితులైన నర్సులకు విదేశాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సబ్జెక్టుపై పట్టు, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉంటే వీరికి ప్రారంభంలోనే ఏడాదికి సుమారు రూ.22 లక్షల వేతనం, వసతి, సౌకర్యాలను యూకే, యూరప్ దేశాల్లో అందిస్తున్నారు. గల్ఫ్, యూఎస్, యూకే, కెనడా, సింగపూర్, మిడిల్ ఈస్ట్ల్లో భారతీయ నర్సులకు డిమాండ్ ఉంది. వచ్చే నాలుగైదేళ్లకు గానూ ఒక్క భారతదేశానికే 20 లక్షల మంది నర్సులు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. 2030 నాటికి 60 లక్షల మంది సేవలు తప్పనిసరని అంచనా.
కరోనా నేపథ్యంలో నర్సుల ప్రాధాన్యం, డిమాండ్ రెండూ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీప భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో నర్సుల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్ హోంలు, కార్పొరేట్ సంస్థలు..అన్ని చోట్లా వీరికి అవకాశాలుంటాయి. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థలకు ఎంపికైనవారు లెవెల్ 7 మూలవేతనం రూ.44,900 పొందుతున్నారు. అంటే వీరు ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే డీఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సులు కలుపుకుని సుమారు రూ.72 వేలు వేతనం పొందవచ్చు. వీరిని ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం రూ.పాతిక వేలకు పైగా లభిస్తుంది. డీఏ, హెచ్ఆర్ఎ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.నలభై వేలు అందుకోవచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ.15 వేల నుంచి ఇరవై వేలకు పైగా వేతనం అందిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
ఏ నైపుణ్యాలు అవసరం?

‣ సహనం, మృదు స్వభావం
‣ ఎదుటివారి బాధలకు స్పందించే సహానుభూతి
‣ రోగులకు అంకితభావంతో సేవలందించే శ్రద్ధ్ద
‣ వ్యాధిపీడితులను ఆప్యాయంగా చూసుకునే లక్షణం
‣ ఇతరులకు స్పష్టతతో విషయం చెప్పగలిగే నేర్పు
‣ సూక్ష్మాంశాలనూ పట్టించుకునే నిశిత దృష్టి
‣ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి
విదేశాల్లో రాణించాలంటే...
విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆయా దేశాలు నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. యూఎస్ కోసం ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్)లో స్కోరు, నేషనల్ కౌన్సిల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ - రిజిస్టర్డ్ నర్స్ (ఎన్సీఎల్ఈఎక్స్ - ఆర్ఎన్)లో ఉత్తీర్ణత తప్పనిసరి. కెనడాలో కెరియర్ ఆశించేవారు కెనడియన్ రిజిస్టర్డ్ నర్సెస్ ఎగ్జామ్ (సీఆర్ఎన్ఈ), దుబాయ్లో పనిచేయడానికి దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్ పరీక్ష, ఖతార్కు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ పరీక్ష రాయాలి. కొన్ని గల్ఫ్ దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఇంటర్వ్యూతో అవకాశం కల్పిస్తున్నాయి.