అడవులపై అధ్యయనం చేయడానికి దేశంలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటి ఆధ్వర్యంలో కొన్ని కోర్సులు అందిస్తున్నారు. ఈ తరహా సంస్థల్లో దేహ్రాదూన్లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) ఒకటి. ఇక్కడ కొన్ని పీజీ కోర్సులు నడుపుతున్నారు. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
అడవులను రక్షించడంతోపాటు వాటిని వృద్ధి చేసి, పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో దేహ్రాదూన్లో ఎఫ్ఆర్ఐను నెలకొల్పారు. దీనిలో సంబంధిత కోర్సులను అందిస్తున్నారు. అటవీ ఉత్పత్తులైన కలప మొదలైనవి సమర్థంగా ఉపయోగించడంపై మెలకువలు నేర్పుతున్నారు. వృక్ష సంపదను వృద్ధి చేయడానికి పెంపొందించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులు చదివినవారు సంబంధిత విభాగాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.
రాత పరీక్షలో..
సైన్స్, సోషల్ సైన్స్లో ప్రాథమికాంశాలు, అరిథ్మెటిక్, క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, కంప్యుటేషనల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ, గ్రామర్, ఇడియమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
దరఖాస్తు విధానం
యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలు నింపి, అవసరమైన పత్రాలు, రూ.1500 ఫీజు డీడీ జతచేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 16 పరీక్ష తేదీ: మే 16. పరీక్షను ఆన్లైన్లో రిమోట్ ప్రొటెక్టెడ్ విధానంలో నిర్వహిస్తారు.
వెబ్సైట్: http://fridu.edu.in/
అటవీ అధ్యయన కోర్సులను పూర్తి చేసినవారికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. శిక్షణ పొందిన కోర్సును బట్టి చెక్క ఆధారిత తయారీ సంస్థల్లో, కాగిత పరిశ్రమ, వస్తు తయారీ, ప్యాకింగ్ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది.
ఏ కోర్సు.. ఎన్ని సీట్లు?
ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
సీట్లు: 38
అర్హత: బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథ్స్/ఫిజిక్స్/జువాలజీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులో: అడవులను ఎలా పరిరక్షించాలి, ఎదురవుతోన్న ఇబ్బందులు, పట్టణాల్లో పచ్చదనం పెంచడం, వృక్షాలకు వచ్చే వ్యాధులు-నివారణ, అడవులను వృద్ధి చేయడమెలా..తదితర అంశాలను వీరు తెలుసుకుంటారు. వీరికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోల్లో అవకాశాలు ఉంటాయి.
ఎమ్మెస్సీ వుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ
సీట్లు: 38
అర్హత: 50 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపులో బీఎస్సీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ ఉత్తీర్ణత
కోర్సులో: కర్ర/చెక్కను వివిధ ఉత్పత్తుల్లో, తయారీలో ప్రభావంతంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవచ్చు.వృక్ష ధర్మాలు, కర్ర, చెక్కలను ఎలా పరిరక్షించాలో నేర్పుతారు. వీరికి చెక్క ఆధారిత తయారీ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్
సీట్లు: 38
అర్హత: 50 శాతం మార్కులతో బేసిక్/అప్లయిడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ/అగ్రికల్చర్ లేదా బీఈ ఎన్విరాన్మెంట్ సైన్స్ చదివి ఉండాలి.
కోర్సులో: వీరు పర్యావరణ సమస్యలు, వాటిని అధిగమించే విధానాలపై దృష్టి సారిస్తారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, అటవీకరణ విధానాలను తెలుసుకుంటారు. ప్రపంచానికి ఎదురవుతోన్న పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను అధ్యయనం చేస్తారు. వీరికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది.
ఎమ్మెస్సీ సెల్యులోజ్ ఖీ పేపర్ టెక్నాలజీ
సీట్లు: 20
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా సైన్స్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ కెమికల్/ మెకానికల్ ఇంజినీరింగ్
కోర్సులో: వృక్షాల నుంచి కాగితం తయారీకి సంబంధించిన విషయాలను వీరు అధ్యయనం చేస్తారు. సాంకేతికతను ఉపయోగించి, తక్కువ వృథాతో పెద్ద మొత్తంలో కాగితాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తెలుసుకుంటారు. వీరికి కాగిత పరిశ్రమ, వస్తు తయారీ, ప్యాకింగ్ సంస్థల్లో అవకాశాలుంటాయి.