‣ విద్యార్హతలు, ప్రవేశ విధానం వివరాలు
దైనందిన జీవితంలో మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువుల్లోనూ ఎంతో కొంత ప్లాస్టిక్ తప్పనిసరి. తేలిక, మన్నిక, సౌకర్యవంతం, తక్కువ ధరలో రూపొందడం.. మొదలైనవి ప్లాస్టిక్ ఆదరణకు కారణాలు. కేంద్రం ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ప్లాస్టిక్ వస్తువులు తయారీ విభాగంలో ముఖ్య సంస్థ. ఇది హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
కోరుకున్న రూపంలోకి సులువుగా మారిపోవడం ప్లాస్టిక్ ప్రత్యేకత. ఎన్నో విధాల ప్రయోజనకరంగా ఉండటంతో పరిశ్రమలు పెద్ద మొత్తంలో దీన్ని వినియోగిస్తున్నాయి. అలాగే ఉత్పత్తీ చేస్తున్నాయి. ఇందుకోసం ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్, అనుబంధ విభాగాల్లో మేటి మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఏర్పాటైంది. గతంలో దీన్ని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’గా పిలిచేవారు.
ఈ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. పరీక్షలో ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఓఎన్జీసీ, ఓల్టాస్, మిల్టన్, సెలో, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, ఐఎఫ్బీ, బీపీఎల్, హెచ్సీఎల్, ఏషియన్ పెయింట్స్, బటర్ఫ్లై, టాటా...తదితర సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జూమర్ గూడ్స్, మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్ అండ్ డీ.. తదితర విభాగాలకు చెందిన సంస్థలకు ప్లాస్టిక్పై పట్టున్నవారి సేవలు కీలకం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి ఢోకా లేదు. కొన్నేళ్ల అనుభవంతో మెరుగైన వేతనాలూ అందుకోవచ్చు. సొంతంగానూ పరిశ్రమను నెలకొల్పవచ్చు.
డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను దేశవ్యాప్తంగా 30 సిపెట్ కేంద్రాల్లో అందిస్తున్నారు. ఇవి.. హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, అమృత్సర్, ఔరంగాబాద్, బడ్డీ, బాలాసోర్, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చెన్నై, దేహ్రాదూన్, గువాహటి, హాజీపూర్, హల్దియా, ఇంఫాల్, జయపూర్, కోచి, లఖ్నవూ, మధురై, ముర్థల్, మైసూరు, రాయ్పూర్, రాంచీ, కోర్బ, అగర్తల, గ్వాలియర్, వారణాసి, భగల్పుర్, అయోధ్యల్లో ఉన్నాయి.
ఏ కోర్సులకు ఏ అర్హతలు?
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ)
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. పరీక్షలు రాసి, ఫలితాలకోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లిష్ 5 ప్రశ్నలు వస్తాయి.
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. పరీక్షలు రాసి, ఫలితాలకోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లిష్ 5 ప్రశ్నలు వస్తాయి.
పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్ (పీడీ-పీఎండీ)
వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు)
అర్హత: మెకానికల్/ ప్లాస్టిక్ టెక్నాలజీ/ టూల్/ ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ మెకట్రానిక్స్/ టూల్ డై అండ్ మేకింగ్/ సిపెట్ నుంచి డీపీఎంటీ/ డీపీటీ వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 10, సంబంధిత డిప్లొమా నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)
వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
అర్హత: ఏదైనా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 10, బీఎస్సీ స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ 10 ప్రశ్నలు వస్తాయి.
పై కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్లో అందిస్తున్నారు. పీడీ-పీఎండీ తప్ప మిగిలినవి విజయవాడ క్యాంపస్లో ఉన్నాయి. అన్ని కోర్సులకూ ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష
అన్ని కోర్సులకూ ప్రవేశపరీక్షను ఆన్లైన్లో విడిగా నిర్వహిస్తారు. దీని వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. మొత్తం యాభై ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. మాదిరి ప్రశ్నపత్రాలు సిపెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో స్పోర్ట్స్, హిస్టరీ, పాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంటర్టైన్మెంట్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో సైన్స్, ఇంగ్లిష్ ప్రశ్నలు పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదువుకున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. సిపెట్ వెబ్సైట్లో మాదిరి ప్రశ్నలు పరిశీలించి, ప్రశ్నాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31.
పరీక్ష ఫీజు: రూ.100.
ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 9
వెబ్సైట్: https://www.cipet.gov.in/
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!