• facebook
  • whatsapp
  • telegram

బీటెక్‌ తర్వాత భవిత ఇలా..! 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది విద్యార్థుల క్రేజీ కోర్సు ఇంజినీరింగ్‌. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ, విద్యార్థులూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే నేడు ప్రతి చిన్న అవకాశానికీ తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. ఉద్యోగమైనా, ఉన్నత చదువులైనా ముందస్తు ప్రణాళికతో సన్నద్ధమైతేనే విజయం దక్కేది! అందుకే బీటెక్‌/బీఈ ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. నాలుగేళ్లూ సరైన ప్రణాళికతో అడుగేస్తే తిరుగులేని సుదీర్ఘ కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు! 

బీటెక్‌ తర్వాత ఎంచుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఎంటెక్, ఎంబీఏ కోర్సులు, విదేశీ విద్య, కార్పొరేట్‌ కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలు...ఇలా ఎన్నో! అయితే గమ్యం ఎటువైపో నిర్ణయించుకోవాల్సింది మాత్రం విద్యార్థులే. ఇందుకోసం తమ బలాలు, ఆసక్తులు, అవసరాలు... అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. మేటి నిర్ణయాలు తీసుకోవడానికి స్వీయ సమీక్ష అత్యుత్తమ కొలమానం. నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నవారికి మెచ్చిన అవకాశాలు సొంతమవుతాయి. అయితే ఉన్నత విద్య, ఉద్యోగం... ఇలా లక్ష్యం ఏదైనప్పటికీ భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) చాలా ముఖ్యం. అందువల్ల ప్రథమ సంవత్సరంలో ఆంగ్లంపై దృష్టి సారించాలి. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడానికి ఈ మొదటి ఏడాదిని బాగా ఉపయోగించుకోవాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మెరవాలనుకునేవారు అకడమిక్స్‌తోపాటు ఆప్టిట్యూడ్‌పై దృష్టి సారించాలి. 

భద్రమైన కెరియర్‌ కోసం 

ఒడిదొడుకులు లేని, భద్రమైన కెరియర్‌కు యువతరం ప్రాధాన్యమిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే కానిస్టేబుల్, వీఆర్వో పోస్టులకు పోటీపడే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ ఆశావహుల్లోనూ సింహభాగం వీరే ఉంటున్నారు. బీటెక్‌ తర్వాత చాలా ఉద్యోగాలే ఉన్నాయి. కేవలం ఇంజినీరింగ్‌ అర్హతతోనే ఉన్న ఉద్యోగాలు కూడా తక్కువేమీ కాదు. ఆయా బ్రాంచీలపై పట్టు ఉన్న విద్యార్థులంతా ఈ తరహా ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మేలు. ఆ వివరాలు...

యూపీఎస్‌సీ

చదువుకున్న కోర్సుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే బీటెక్‌ విద్యార్థులకు యూపీఎస్‌సీ ఏటా నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ఒక చక్కని వేదిక. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాల్లో రాణించవచ్చు. సివిల్, మెకానికల్, ఎల్రక్టికల్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం ఐఈఎస్‌తో ఎంపికైన ఇంజినీర్లకు ఉంటుంది. ఏ బ్రాంచీ విద్యార్థులైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ

రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. రెండుమూడేళ్లకు ఒకసారి ఈ ప్రకటన వెలువడుతుంది.

ఎస్‌ఎస్‌సీ

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సివిల్, మెకానికల్, ఎల్రక్టికల్‌ బ్రాంచీల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే జేఈ పరీక్షతో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు డిప్లొమా విద్యార్హత సరిపోతుంది. అయితే ఇంజినీరింగ్‌ నేపథ్యంతో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఏటా ఈ ప్రకటన వెలువడుతోంది.

రక్షణ రంగం

యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ)లో నేవీ విభాగంలోని ఖాళీలకు బీటెక్‌ చదివినవారే అర్హులు. ఆర్మీలో.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ఇంజినీర్స్, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్‌ పోస్టులకు నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోడీపడవచ్చు. ఏర్‌ ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్‌తో గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు మెకానికల్, ఎల్రక్టికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నత స్థాయి ఉద్యోగాలే.

కొలువుల రత్నాలు

గేట్‌ స్కోరుతో ప్రభుత్వ రంగ యూనిట్లు (పీఎస్‌యూ) ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్నల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా సుమారు 50 సంస్థల్లో మేటి కొలువులకు గేట్‌ స్కోరు ప్రామాణికం. సంస్థను బట్టి వార్షిక వేతనాలు రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అందుకోవచ్చు. ఇస్రో సైంటిస్ట్‌ ఇంజినీర్‌ పోస్టులను గేట్‌ స్కోరుతోనే భర్తీ చేస్తుంది. అందువల్ల ఇంజినీరింగ్‌ డొమైన్‌ ఉద్యోగాలు ఆశించేవారు బీటెక్‌ ప్రథమ సంవత్సరం నుంచే గేట్‌పై దృష్టిసారించాలి. ఈ పరీక్ష ఉన్నత విద్యకూ, అత్యున్నత ఉద్యోగాలకూ దారి చూపుతుంది.

బోధన, పరిశోధనలు

సాంకేతికంగా మరింత పరిజ్ఞానం పొందాలని కోరుకునే బీటెక్‌ విద్యార్థులు ఎంటెక్‌లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎంటెక్‌+ పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బోధన, పరిశోధన రంగాల్లో రాణించడానికి ఇవి దోహద పడతాయి. ఈ విధానంలో చేరినవారు ఏడాది విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గేట్‌ స్కోరుతో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్‌ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. గేట్‌లో అర్హత సాధించినవారు ఎంటెక్‌లో రెండేళ్లపాటు ప్రతినెలా రూ.12,400 స్ట్టైపెండ్‌ కూడా అందుకోవచ్చు. గేట్‌లో అర్హులు కానివారు పీజీఈసెట్‌ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరొచ్చు. అయితే బీటెక్‌లా కాకుండా ఎంటెక్‌ మాత్రం వీలైనంతవరకు మేటి సంస్థల్లోనే చదవడానికి ప్రయత్నించాలి. ఇలా జరిగినప్పుడే ఆ పీజీకి విలువ పెరుగుతుంది. కేవలం విద్యార్హత పెంచుకోవడానికి ఎంటెక్‌ పూర్తి చేస్తే పెద్ద ప్రయోజనమేమీ దక్కదు.

విదేశీ విద్య 

బీటెక్‌ అనంతరం విదేశాల్లో అందులోనూ ముఖ్యంగా యూఎస్‌లో ఎంఎస్‌ పూర్తిచేయాలనే లక్ష్యం ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. ఈ తరహా చదువులకు అకడమిక్‌ ప్రతిభతోపాటు జీఆర్‌ఈ స్కోరు కీలకం. అందువల్ల విదేశీ విద్య ఆశావహులు తొలి నుంచే సన్నద్ధతను ప్రారంభిస్తే కోర్సు పూర్తయ్యేసరికి అకడమిక్స్‌తోపాటు జీఆర్‌ఈలోనూ మంచి స్కోరు సాధించడం తేలికవుతుంది. లేదంటే బీటెక్‌ అనంతరం మరో ఏడాదిపాటు ఆగాల్సివుంటుంది. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు మెరుగ్గా ఉండడం వల్ల ప్రవేశాలూ అంతే కఠినంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తోన్నవారు ఎంఎస్‌ కోర్సులవైపు అడుగులేయడం మంచిది. 

ఎంబీఏ 

ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందులోనూ ముఖ్యంగా ఐఐఎంల్లో చేరే బీటెక్‌ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. వివిధ కంపెనీలు సాంకేతిక నేపథ్యంతో ఎంబీఏ చదివినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. క్యాట్‌ స్కోర్‌తో ఐఐఎం లతోపాటు ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశాలు లభిస్తాయి. విదేశాల్లో ఎంబీఏ విషయానికొచ్చేసరికి యూఎస్‌లో ప్రముఖ యూనివర్సిటీలు పని అనుభవానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల అవకాశాలు పరిమితం. ఎంబీఏ లక్ష్యంగా ఉన్నవారు తొలి నుంచే క్యాట్‌ కోసం సన్నద్ధమైతే బీటెక్‌ పూర్తవ్వగానే ప్రముఖ సంస్థలో సీటు ఖాయమవుతుంది.

రాష్ట్ర స్థాయిలో...

ఇంజినీర్లకు సొంత రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటిలో ఎక్కువ పరీక్షలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటికి ఆయా శాఖల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుంది.

గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారితో భర్తీ చేస్తారు. 

ఐ అండ్‌ సీఏడీ, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌ పోస్టులకు సివిల్‌ బ్రాంచీ చదివినవారు అర్హులు. 

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలవారు పోటీపడవచ్చు. 

మెట్రోపాలిటన్‌ అండ్‌ వాటర్‌ సప్లై సివరేజ్‌ బోర్డులో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎల్రక్టికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచీలవారు సన్నద్ధం కావచ్చు. 

ఇంజినీర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్, మెకానికల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 

సివిల్‌ ఇంజినీర్లకు రోడ్లు, భవనాలు; పంచాయతీరాజ్, ప్రభుత్వ నీటిసరఫరా విభాగాల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. 

ఎల్రక్టికల్‌ ఇంజీనీర్లకు విద్యుత్‌ సంస్థలు, పంపిణీ బోర్డుల్లో అవకాశాలు లభిస్తాయి. 

సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచిలు చదివినవారికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్‌ ఉద్యోగాలు లభిస్తాయి. 

బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు బీటెక్‌ అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి పోటీపడవచ్చు. 

ఇవేకాకుండా ఏదైనా డిగ్రీ అర్హతతో నిర్వహిస్తోన్న జనరల్‌ ఉద్యోగాలైన.. సివిల్‌ సర్వీసెస్, ఆర్‌ఆర్‌బీ నాన్‌టెక్నికల్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఐబీపీఎస్‌ పీవో, క్లరికల్‌; సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌క్యాట్, సీఏపీఎఫ్, గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ...తదితర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Posted Date: 09-03-2021


 

బీటెక్‌ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌