• facebook
  • whatsapp
  • telegram

సబ్జెక్టుపై పట్టు.. పరిశోధనకు మెట్టు! 

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు ఆదరణ

ఇటీవలి కాలంలో ఇంటిగ్రేటెడ్‌ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రత్యేక సంస్థలు...ఇవన్నీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులవైపు దృష్టి సారిస్తున్నాయి. ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు ఇలాంటి కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సబ్జెక్టుపై గట్టి పట్టుకు, పరిశోధనల దిశగా అడుగులేయడానికి ఈ చదువులు దోహదపడతాయి. కొన్ని కోర్సుల్లో ఏడాది సమయమూ ఆదా అవుతుంది. వివిధ విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎడ్, లా కోర్సులు అందిస్తున్నాయి! 

భవిష్యత్తు చదువులపై స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ విధానానికి ప్రాధాన్యం ఇవ్వటం సమంజసం. ఇలా చేయడం వల్ల యూజీ, పీజీ ఒకేసారి ఒకే సంస్థలో పూర్తిచేసుకునే అవకాశం చిక్కుతుంది. దాంతోపాటు సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాల నుంచి పరిశోధన స్థాయి వరకు విజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరినవాళ్లు పీజీ ప్రవేశాలకు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చేరితే కోర్సు పూర్తయినంతవరకు అవాంతరాలు లేకుండా నిశ్చింతగా చదువుకోవచ్చు. ఒకవేళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరిన తర్వాత ఉన్నత చదువులపై ఆసక్తి లేకపోయినా, అప్పటిదాకా చదువుతోన్న సబ్జెక్టు నచ్చకపోయినా యూజీ డిగ్రీతో బయటకు వచ్చేయవచ్చు. ఈ వెసులుబాటును చాలా సంస్థలు కల్పిస్తున్నాయి. కొన్ని కోర్సుల్లో మధ్యలో వైదొలిగే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల చేరకముందే అన్ని వివరాలూ తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు ప్రతి నెలా స్టైపెండ్‌ అందిస్తున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ, హెల్త్‌ సైకాలజీ.

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌.  

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ  

ఈ సంస్థ ఆరేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎంఆప్టోమ్‌) కోర్సునూ ఇంటర్‌ విద్యార్హతతో అందిస్తోంది.   

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్‌ కోర్సులు అందిస్తున్నారు. బిట్‌శా  ట్‌తో ప్రవేశం లభిస్తుంది. పిలానీ క్యాంపస్‌లో ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సు నడుపుతున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ 

మేనేజ్‌మెంట్‌ విద్యపై ఆసక్తి ఉన్న ఇంటర్‌ విద్యార్థులు ఐఐఎం ఇండోర్, రోహ్‌తహ్, రాంచీ, బుద్ధగయ, జమ్ము అందించే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సులో చేరవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నిర్మా యూనివర్సిటీ, నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్, దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ...తదితర సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్, నిర్మా యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లో అయిదేళ్ల వ్యవధితో బీటెక్‌ + ఎంబీఏ కోర్సులు ఉన్నాయి.  

ఎంటెక్‌

ఐఐటీలతోపాటు చాలా విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలు అయిదేళ్ల వ్యవధి ఉన్న ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సు అందిస్తున్నాయి. బీటెక్‌ అనంతరం ఎంటెక్‌ పూర్తిచేయడంతో పోలిస్తే ఏడాది సమయం ఆదా అవుతుంది. ఐఐటీ-జేఈఈ స్కోర్‌తో ప్రవేశం లభిస్తుంది. పాత తరం ఐఐటీలన్నీ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు అందిస్తున్నాయి. రాష్ట్రస్థాయి సంస్థల్లోనూ ఈ కోర్సులు ఉన్నాయి. పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కనీసం రెండు లేదా మూడు ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు నడుపుతున్నాయి. ఈ విధానంలో వివిధ స్పెషలైజేషన్లతో కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, ఎనలిటిక్స్‌ కోర్సులు ఎక్కువగా లభిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (సీఎస్‌) కోర్సులో జేఈఈ స్కోర్‌తో చేరవచ్చు. 

ఎమ్మెస్సీ

ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఐఐటీలతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. ఐఐటీల్లో జేఈఈ స్కోర్‌తో ప్రవేశం లభిస్తుంది. బీఎస్‌ ఎంఎస్‌ పేరుతో సైన్స్‌ విభాగాల్లో ఐఐఎస్‌ఈఆర్‌లు కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ మార్కుల మెరిట్‌/ జేఈఈ స్కోర్‌/ ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభ/ కేవీపీవై తదితర విధానాల ద్వారా కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏడు చోట్ల తిరుపతి, తిరువనంతపురం, పుణె, మొహాలీ, భోపాల్, బరంపూర్, కోల్‌కతాల్లో ఈ సంస్థలు ఉన్నాయి. వీటిలో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ అందుతోంది. నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌)తో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ల్లో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ కోర్సులు చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో చేరినవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది. హైదరాబాద్, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు చాలా ఉన్నాయి.  

ఎంఏ

రాష్ట్ర, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలెన్నో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీ-మద్రాస్‌ ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను అందిస్తోంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ)తో కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు ఉన్నాయి.

బీఎడ్‌

నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకునే అవకాశాన్ని చాలా సంస్థలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాంతీయ విద్యాసంస్థలు, కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పేరొందిన ప్రైవేటు సంస్థలు ఈ తరహా కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో చేరినవారికి ఏడాది సమయం ఆదాతోపాటు, బోధనపై గట్టి పునాది ఏర్పడుతుంది. ఆసక్తి ఉంటే ఇంటర్‌ తర్వాత నేరుగా ఎమ్మెస్సీతోపాటు బీఎడ్‌ చదువుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇలా చేరడం వల్ల ఏడాది సమయం ఆదా అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆర్‌ఐఈ మైసూరులో ఈ కోర్సులన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరినవారు మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉండదు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, బెంగళూరు; తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, శస్త్ర యూనివర్సిటీ, జీడీ గొయాంకా, లవ్‌ లీ ప్రొఫెషనల్‌..తదితర సంస్థలు నాలుగేళ్ల బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. 

లా

ఇంటర్‌ తర్వాత నేరుగా న్యాయవిద్య కోర్సులు చదువుకోవచ్చు. డిగ్రీ, బీఎల్‌ కోర్సులను అయిదేళ్లకే పూర్తిచేసుకోవచ్చు. ఈ రెండూ విడిగా చదవడానికి ఆరేళ్లు పడుతుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి సంస్థలు, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సులతోపాటు బీఎల్‌ పూర్తిచేసుకోవచ్చు. జాతీయ సంస్థల్లోకి క్లాట్, రాష్ట్రస్థాయిలో చేరడానికి లాసెట్‌తో అవకాశం లభిస్తుంది. 

తెలుగు రాష్ట్రాల్లో... 

ఉస్మానియా యూనివర్సిటీ: ఎంఏ ఎకనమిక్స్, ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ

తెలంగాణ యూనివర్సిటీ: అప్లయిడ్‌ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ

పాలమూరు యూనివర్సిటీ: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ

కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

మహాత్మా గాంధీ వర్సిటీ: ఎంబీఏ, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

ఆచార్య నాగార్జున: ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ

యోగి వేమన యూనివర్సిటీ: ఎమ్మెస్సీ -బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్‌ సైన్సెస్‌ తీసివేత, కూడికలతో తేలికగా..!  
 

Posted Date: 06-11-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌