• facebook
  • whatsapp
  • telegram

వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

డిప్లొమా కోర్సులకు అడ్మిషన్‌ నోటిఫికేషన్లు

వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం విడిగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభించాయి. 

ఇప్పటికే మత్స్య, పశువైద్య, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రవేశ ప్రకటనలు విడుదల చేయగా.. ఉద్యాన విశ్వవిద్యాలయం త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. గత రెండేళ్ల నుంచీ డిప్లొమా కోర్సును ఇంటర్మీడియట్‌తో సమానంగా పరిగణించి.. ఉన్నత విద్యామండలి సూచించిన కొన్ని డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. 

వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన, మత్స్యశాస్త్రాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పశుపోషణపై ఆసక్తి ఉన్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ కోర్సులను రూపొందించారు. వీటిని పూర్తిచేసినవారికి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వ్యవసాయంలో డిప్లొమా పూర్తిచేసినవారికి వ్యవసాయశాఖలో ఏఈవో, ఎంపీఈవో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విత్తన, ఎరువుల సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పశుసంవర్థక పాలిటెక్నిక్‌ డిప్ల్లొమా పూర్తి చేసినవారు పశుసంవర్థకశాఖలో ఎంపీఈవోలుగా, పశువైద్య సహాయకులుగా చేరవచ్చు. కోళ్ల పరిశ్రమ, దాణా తయారీ కర్మాగారాల్లో ఉద్యోగం సాధించుకోవచ్చు. ఉద్యాన పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి ఉద్యానశాఖలో ఏహెచ్‌వో, ఎంపీఈవోలుగా, ప్రైవేటు విత్తన సంస్థలు, ప్రైవేటు నర్సరీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

పట్టణ, నగర ప్రాంత విద్యార్థులూ అర్హులే

వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాస్త్ర, పశుసంవర్థక పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు పొందేందుకు గతంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రమే అర్హులు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన కాలంలో కనీసం నాలుగు సంవత్సరాలైనా నగరపాలిక, పురపాలికేతర ప్రాంతాల్లో చదివినవారిని మాత్రమే గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా పరిగణిస్తారు. పదో తరగతి, దానికి సమానమైన విద్యార్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. గత ఏడాది గ్రేడ్‌ పాయింట్స్‌తో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులకు  మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్నవారు, పదో తరగతి కంపార్టుమెంట్‌లో ఉత్తీర్ణులైనవారు సైతం దరఖాస్తు చేయవచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తయినవారు అనర్హులు. దరఖాస్తుదారుల వయసు 15-22 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రస్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం: తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థకంలో డిప్లొమా కోర్సును అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 విశ్వవిద్యాలయ, 12 విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన ప్రైవేటు పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. మొత్తం 990 పాలిటెక్నిక్‌ సీట్లు భర్తీ చేయనున్నారు. డెయిరీ టెక్నాలజీలో ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్‌లో ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిలిపివేశారు. https://www.svvu.edu.in/ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు విధానం, సీట్లు, కళాశాలలు ఉన్న ప్రాంతాల వివరాలు పొందవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్‌ 23. 

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం: పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఈ విశ్వవిద్యాలయం నిర్వహించే నాలుగు ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 145 సీట్లు భర్తీ చేస్తున్నారు. అనుబంధ ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఐదు 200 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఉద్యాన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ http://www.drysrhu.edu.in/ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు పొందవచ్చు. తెలుగు మాధ్యమంలో డిప్ల్లొమా బోధన ఉంటుంది. డిప్లొమా పూర్తయిన వెంటనే హార్టీసెట్‌ ద్వారా ఏటా నిర్ణీత సంఖ్యలో ఉద్యానశాస్త్ర డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం: ఇది గుంటూరు జిల్లా లాం కేంద్రంగా పని చేస్తోంది. దీని పరిధిలో వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం విభాగాల్లో రెండేళ్ల డిప్ల్లొమా కోర్సులను తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సును మూడేళ్ల కాలపరిమితిలో ప్రవేశపెట్టారు. ఇది ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. విశ్వవిద్యాలయం పరిధిలో 17 వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో 578 సీట్లు, 51 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో 2340 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పాలిటెక్నిక్, ప్రైవేటులో 8 పాలిటెక్నిక్స్‌ ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌ ఒకటి, అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్‌ మరొకటి ఉంది. మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌లో విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రెండు పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు 11 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలూ ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. అన్‌లైన్‌లో జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని విభాగాల్లో పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రిసెట్‌ నిర్వహించి నిర్ణీత సంఖ్యలో వ్యవసాయ డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వివరాల కోసం https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం

ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన మత్స్య విశ్వవిద్యాలయం మత్స్య పాలిటెక్నిక్‌ల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఈ నెల 12లోపు, అపరాధ రుసుముతో 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయ నిర్వహణలోని పాలిటెక్నిక్‌లో 55 సీట్లు, విశ్వవిద్యాలయ గుర్తింపుతో నడుస్తున్న 8 పాలిటెక్నిక్‌లలో 440 సీట్లు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://apfu.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

తెలంగాణలో..

తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేటల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 30 చొప్పున, మామునూర్‌ పాలిటెక్నిక్‌లో 20 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భావదేవరపల్లె పాలిటెక్నిక్‌లో తెలంగాణ కోటాగా 11 సీట్లు భర్తీ చేస్తారు. తెలంగాణలో పశుసంవర్థకశాఖలో ప్రైవేటు పాలిటెక్నిక్‌లు లేవు. బోధన తెలుగు మాధ్యమంలో ఉంటుంది. తెలంగాణ పాలిసెట్‌-2023 ర్యాంకులతో సీట్లు కేటాయిస్తారు. జూన్‌ 19 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

వెబ్‌సైట్‌: https://www.tsvu.edu.in/home.aspx

కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఆదిలాబాద్, రామగిరిఖిల్లాల్లోని ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 80 సీట్లున్నాయి. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మరో మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లున్నాయి. తెలంగాణ పాలిసెట్‌ ర్యాంకులతో సీట్లను భర్తీ చేస్తారు. 

ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 240 సీట్లు, అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, ఒక విత్తన సాంకేతిక, ఒక వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ పాలిసెట్‌ ర్యాంకులతో ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్‌ 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెస్ట్‌ కెరియర్.. బ్యాంకింగ్‌ టెక్నాలజీ

‣ జనరేషన్‌ ‘జడ్‌’ జాబ్స్‌తో నయా ట్రెండ్‌!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

Posted Date: 14-06-2023


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌