‣ వివిధ శాఖల్లో అవకాశాలిలా..
తక్కువ విద్యార్హత అయినప్పటికీ పదో తరగతి పాసైతే ఉద్యోగాలకు ఢోకా లేదు. చిన్న వయసులోనే స్థిరపడాలని ఆశించేవారికోసం ఈ చదువుతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వీటిలో చేరినవారు అనుభవం, అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థాయిని అందుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, కోస్టుగార్డు, రైల్వే, పోస్టల్, ఆర్బీఐ, ఆర్టీసీ...తదితర సంస్థల్లో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు పదితో పోటీ పడవచ్చు. ప్రతి నెలా రూ.30 వేలకు పైగా వేతనం పొందవచ్చు!
ఆర్థిక పరిస్థితులు సహకరించనివారూ, ఉన్నత చదువులపై ఆసక్తి లేనివారూ, తక్కువ వ్యవధిలోనే కెరియర్లో స్థిరపడాలని ఆశించేవారూ పదో తరగతి విద్యార్హతతో ఉన్న ఎన్నో పోస్టులకు ప్రయత్నించవచ్చు. అయితే టెన్త్ పూర్తయినవెంటనే ఉద్యోగంలో చేరడం సాధ్యం కాదు. ఎందుకంటే యూనిఫారం ఉద్యోగాలకు కనీసం 17 ఏళ్లయినా ఉండాలి. అదే సివిల్ పోస్టులకు పద్దెనిమిదేళ్లు నిండాలి. అందువల్ల ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారు పదో తరగతి తర్వాత ఇంటర్, ఐటీఐ, డిప్లొమా...ఇలా ఏదో ఒక కోర్సులో చేరడమే మంచిది. రెగ్యులర్ విధానంలో వీలు కాకపోతే ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ లేదా ఒకేషనల్ కోర్సులు పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
నేవీ
చెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్ ఉద్యోగాలను మెట్రిక్ రిక్రూట్మెంట్ (ఎంఆర్) ద్వారా నేవీలో భర్తీ చేస్తున్నారు. 17 -21 ఏళ్లలోపు వయసున్న అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ.. ఉంటాయి. భవిష్యత్తులో మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకుంటారు.
‣ మ్యుజీషియన్: నేవీ బ్యాండ్లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
‣ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ: ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
ఎస్ఎస్సీ
కేంద్ర పోలీస్ బలగాలతోపాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్లో జనరల్ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్మెన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తోంది. ఒక్కో విడతలో వేల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ పరీక్షతోనే లభిస్తున్నాయి. ఇందులో ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్ ప్రకారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్), అస్సాం రైఫిల్స్లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. ఈ పోస్టులకు వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి లెవెల్ 3 మూలవేతనం రూ.21,700 అందుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ...మొదలైనవి కలుపుకుని రూ.35 వేలకు పైగా పొందవచ్చు. అర్హత, అనుభవంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఆ పైస్థాయి హోదాలను సొంతం చేసుకోవచ్చు.
ఆర్మీ
‣ సోల్జర్ జనరల్ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు సోల్జర్ జనరల్ డ్యూటీకి అర్హులు. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు, 166 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు ఉండాలి.
‣ సోల్జర్ ట్రేడ్మెన్: చెఫ్, వాషర్ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన పోస్టులను సోల్జర్ ట్రేడ్మెన్ విభాగంలో భర్తీ చేస్తారు. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, కనీసం 50 కి.గ్రా. బరువు తప్పనిసరి.
ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ఏటా నియామకాలు (రిక్రూట్మెంట్ ర్యాలీలు) జరుగుతాయి. ఈ ఉద్యోగంలోకి చేరినవారు తదనంతరం సిపాయ్, నాయక్, హవల్దార్ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, దేహదార్ఢ్య పరీక్షలు, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. సోల్జర్ ట్రేడ్మెన్ విభాగంలో హౌస్ కీపర్, మెస్ కీపర్, గుర్రాల పర్యవేక్షణ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి ఎనిమిదో తరగతి విద్యార్హత సరిపోతుంది. ఏ పోస్టుకి ఎంపికైనప్పటికీ రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ), డీఏ, హెచ్ఆర్ఏ.. ఉంటాయి.
రైల్వేల్లో...
పదో తరగతి విద్యార్హతతో రైల్వేల్లో చాలా ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటికోసం మహిళలు, పురుషులు పోటీ పడవచ్చు. గ్రేడ్-4 ట్రాక్ మెయింటైనర్తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం వీటిని లెవెల్-1 (ప్రారంభస్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. కరవు భత్యం, ఇంటిఅద్దె.. మొదలైనవాటితో సుమారు రూ.ముప్సై వేల వరకు మొదటి నెల నుంచే వేతనం అందుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోస్టులకూ పదో తరగతి విద్యార్హత సరిపోతుంది.
కోస్ట్ గార్డ్
ఇండియన్ కోస్ట్ గార్డులో డొమెస్టిక్ బ్రాంచ్ కుక్, స్టివార్డ్ పోస్టులకు రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21700 మూలవేతనం చెల్లిస్తారు. పురుషులే అర్హులు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి.
ఏర్ఫోర్స్
‣ గ్రూప్ వై మ్యుజీషియన్: ఈ ట్రేడ్ ఉద్యోగాలకు పదితోపాటు ఏదైనా సంగీత/ వాద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 17-25 ఏళ్లలోపున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు ఏర్ఫోర్స్ బ్యాండ్లో పనిచేస్తారు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు. రూ.21,700 మూలవేతనం, రూ.5200 మిలటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ ఉంటాయి.
ఎస్ఎస్సీ - మల్టీ టాస్కింగ్ స్టాప్
కేంద్రంలో వివిధ విభాగాలకు అవసరమైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఆర్బీఐలో
ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ విభాగంలో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్ అనే మూడు రకాల పోస్టులుంటాయి. వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. ఉద్యోగంలో చేరినవారు సీనియర్ ఆఫీస్ అటెండెం ట్గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా అసిస్టెంట్ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి.
‣ ఐటీబీపీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్: కేంద్రీయ ఆర్మ్డ్ దళాలు కానిస్టేబుల్ హోదాలో కుక్, వాషర్మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టుల భర్తీకి విడిగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. పురుషులు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
‣ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో: లేబర్ పోస్టులు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ పోస్టులకు పది అర్హతతో పోటీ పడవచ్చు.
‣ రాష్ట్ర అటవీ శాఖల్లో: బంగ్లా వాచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఎత్తు అవసరం.
‣ కండక్టర్: ఏపీఎస్ / టీఎస్ ఆర్టీసీల్లో కండక్టర్ పోస్టులను ఖాళీలు ఉన్నప్పుడు టెన్త్ మార్కుల మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు.
‣ డ్రైవర్: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ ...మొదలైనవాటిలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉద్యోగానికీ ఈ లైసెన్స్ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్): బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్ (ఎండీ), ప్యాకర్ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు, క్లర్క్...మొదలైన పదోన్నతులు పొందవచ్చు.
పోస్టల్
పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. రెండు మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు.