• facebook
  • whatsapp
  • telegram

‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

టెన్త్‌తో పోటీ పడే వివిధ కొలువుల వివరాలు

పదో తరగతి విద్యార్హతతోనూ ప్రభుత్వోద్యోగాలెన్నో ఉన్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎన్నో కొలువులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు. రక్షణరంగంలోనూ అవకాశాలున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, కోస్టుగార్డు, రైల్వే, పోస్టల్, ఆర్‌బీఐ, ఆర్టీసీల్లో పదితో సేవలందించవచ్చు. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవం, అంతర్గత పరీక్షలు, ఉన్నత విద్యతో మెరుగైన స్థాయికీ చేరుకోవచ్చు! 

చిన్న వయసులో, వీలైనంత తొందరగా ఉద్యోగ జీవితం ప్రారంభించాలని ఆశించేవారు పది పూర్తయిన వెంటనే ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించనివారు, ఉన్నత విద్యపై ఆసక్తి లేనివాళ్లూ ఈ కొలువులకు ప్రయత్నించవచ్చు. కానీ పదోతరగతి పూర్తైన వెంటనే ఉద్యోగంలో చేరడం వీలుపడదు. యూనిఫారం కొలువులకు కనీసం 17 ఏళ్లైనా నిండాలి. సివిల్‌ పోస్టులకు పద్దెనిమిదేళ్లు ఉండాలి. అందువల్ల ఉద్యోగం లక్ష్యంగా ఉన్నవాళ్లు పదో తరగతి తర్వాత ఇంటర్, ఐటీఐ, డిప్లొమా.. ఇలా ఏదో ఒక కోర్సులో చేరి, సన్నద్ధం కావడమే మంచిది. నేరుగా కాలేజీకి వెళ్లి చదివే అవకాశం లేకపోతే జాతీయ/ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ లేదా ఒకేషనల్‌ కోర్సుల్లో కొనసాగాలి.  

అగ్నివీర్‌

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో పదో తరగతి విద్యార్హతతో సేవలందించాలంటే ముందు అగ్నివీర్‌గా ఎంపికవ్వాలి. నాలుగేళ్లు విధుల్లో కొనసాగాలి. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందికే శాశ్వత ఉద్యోగంలోకి అవకాశం లభిస్తుంది. ఈ నాలుగేళ్లలో.. మొదటి సంవత్సరం రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో ఏట రూ.36,500 నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనం చెల్లిస్తారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని ఖాతాలో జమ అవుతాయి. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ అందిస్తుంది. మొత్తం రూ.10.04 లక్షలకు వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. వీరికి సర్టిఫికెట్‌ అందిస్తారు. నాలుగేళ్ల తర్వాత కార్పొరేట్‌ సంస్థల్లో రక్షణ విభాగంలో ఉద్యోగాలు దక్కుతాయి. 

ఆర్మీలో..

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గ్రేడ్‌ల్లో అయితే కనీసం సీ2 ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం ఉండాలి.   

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌: పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఈ ట్రేడ్స్‌మెన్‌లో కొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోనూ అవకాశం ఉంది. 

వయసు: కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, సరిపోయేంత ఛాతీ కొలతలు అవసరం.  

ఎంపిక: అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో విజయవంతమైతే ఉమ్మడి పరీక్ష నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.   

అగ్నివీర్‌ నుంచి శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారికి సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌ హోదాలు దక్కుతాయి. ఉద్యోగంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు. వీరు భవిష్యత్తులో సిపాయ్, నాయక్, హవల్దార్‌ హోదాలు పొందవచ్చు.  

నేవీలో.. 

అగ్నివీర్‌గా సేవలందించిన తర్వాత నేవీలో షెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలకు అవకాశం లభిస్తుంది. 17-23 ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 జీతం అందుకోవచ్చు. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. 

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లు అవసరం. సంగీత పరికరాలపై ప్రావీణ్యం, వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు.
స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. 

ఎయిర్‌ ఫోర్స్‌లో..

అగ్నివీర్‌ వాయులో నాలుగేళ్ల సేవల అనంతరం అవకాశం దక్కినవారు ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ వై మ్యుజీషియన్‌ హోదా పొందవచ్చు. ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదితోపాటు ఏదైనా సంగీత/ వాద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. రూ.21,700 మూలవేతనం, రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు.

కోస్ట్‌ గార్డ్‌ 

ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ పోస్టులకు రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. పురుషులే అర్హులు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. 

ఎస్‌ఎస్‌సీ 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టులను దాదాపు ఏటా భర్తీ చేస్తోంది. ఒక్కో విడతలోనూ యాభై వేలు, ఆ పైనే ఖాళీలు ప్రకటిస్తున్నారు. పదో తరగతి అర్హతతో ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఇవే. ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అసోం రైఫిల్స్‌లో సేవలు అందించవచ్చు. వీటిలో ఉద్యోగానికి వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ పరీక్షతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి లెవెల్‌ 3 మూలవేతనం రూ.21,700 అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ...అన్నీ కలిపి సుమారు రూ.38,000 అందుకోవచ్చు. భవిష్యత్తులో.. హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఆ పైస్థాయికీ చేసుకోవచ్చు. 

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: కేంద్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన బహుళ సేవల నిమిత్తం మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులను ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా పదివేలు, ఆపైనే భర్తీ చేస్తుంది. పరీక్ష¡తో నియామకాలుంటాయి. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో నెలకు సుమారు రూ.30,000 వేతనం అందుకోవచ్చు.  

రైల్వేలో..

పదో తరగతితో రైల్వేలో పలు ఉద్యోగాలు ఉన్నాయి. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయింటైనర్‌తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం వీటిని లెవెల్‌-1 (ప్రారంభస్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అన్నీ కలిపి రూ.30,000 వరకు మొదటి నెల నుంచే జీతం పొందవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులతో నియామకాలు చేపడతారు. రైల్వే భద్రత విభాగంలోనూ సేవలు అందించవచ్చు. 

పోస్టల్‌ 

పోస్టల్‌ శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో రూ.35,000 అందుకోవచ్చు. రెండు మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. 

ఆర్‌బీఐ 

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ విభాగంలో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి. పరీక్షతో నియామకాలుంటాయి. ఉద్యోగంలో చేరిన వారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షలతో అసిస్టెంట్‌ స్థాయి దక్కుతుంది. 

ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌.. తదితర కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్, వాషర్‌మన్, బార్బర్, వాటర్‌ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులను విడిగా భర్తీ చేస్తున్నాయి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.  

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు పదో తరగతి సరిపోతుంది. 

రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు పదితో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ప్రతిభతో నియామకాలు చేపడతారు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులకు 163 సెం.మీ., స్త్రీలకు 150 సెం.మీ. ఎత్తు అవసరం.

కండక్టర్‌: ఏపీఎస్‌/ టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులను ఖాళీలు ఉన్నప్పుడు పదో తరగతి మార్కుల మెరిట్‌తో భర్తీ చేస్తారు. 

డ్రైవర్‌: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ.. మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికీ ఈ లైసెన్స్‌ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. 

గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌): ఇందులో బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. ఏటా ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. అంతేకాదు శాఖాపరమైన పరీక్షలతో పోస్టుమెన్, మెయిల్‌ గార్డు, క్లర్క్‌.. మొదలైన పదోన్నతులు పొందొచ్చు.  

పరీక్షల్లో..

పదో తరగతి విద్యార్హతతో  నిర్వహించే పరీక్షల్లో.. జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, బేసిక్‌ అరిథ్‌మెటిక్, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, బేసిక్‌ రీజనింగ్, జనరల్‌ సైన్స్‌ల్లో ప్రశ్నలుంటాయి. పాఠ్యాంశాలపై పట్టుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

‣ ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date: 21-06-2023


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌