• facebook
  • whatsapp
  • telegram

క్లాట్‌ మార్గంలో నాణ్యమైన న్యాయవిద్య!

ఇంజినీరింగ్‌లో ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌కు ఐఐఎంలు, వైద్యానికి ఎయిమ్స్‌ల మాదిరిగానే నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్‌ లా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో అయిదేళ్ల వ్యవధితో డిగ్రీ+ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందిస్తున్నాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)లో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ చదువుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. 

న్యాయవిద్యపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/బీఎస్సీ/బీకాం/బీబీఎం/బీఎస్‌డబ్ల్యు - ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బీతో పోలిస్తే ఏడాది సమయం ఆదా అవుతుంది. అలాగే వరుస అయిదేళ్ల కోర్సుతో న్యాయవిద్యపై గట్టి పట్టు దక్కుతుంది. 

అవకాశాలు...

ఎక్కువమంది న్యాయవిద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో పెద్ద మొత్తంలో బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వీరిని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, ప్రైవేటు ఈక్విటీలు, కన్సల్టింగ్, అకౌంటింగ్‌ సంస్థలూ, లీగల్‌ ఫర్మ్‌లు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లను కోర్టులు జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ విస్తరిస్తోంది. బోధనలోనూ అవకాశాలుంటాయి. ఎన్జీవోలు, చైల్డ్‌రైట్స్, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ...తదితర చోట్ల కొలువులు వస్తాయి. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు సైతం ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు. మీడియా సంస్థల్లోనూ లీగల్‌ జర్నలిజంలో అవకాశాలు ఉంటాయి. పెరుగుతోన్న సాంకేతిక మోసాలు, కాపీ రైట్‌ కేసులు లీగల్‌ పట్టభద్రుల అవకాశాలను విస్తృతం చేస్తున్నాయి. 

ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు: యూజీ క్లాట్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. అయితే ప్రతి విభాగంలోనూ 300 నుంచి 450 పదాలతో ప్యాసేజ్‌లు ఇచ్చి వాటి కింద ప్రశ్నలు ఇస్తారు. ప్రతి దానికీ ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 28-32 (20 శాతం వెయిటేజీ), కరంట్‌ అఫైర్స్, జీకే 35-39 (25 శాతం వెయిటేజీ), లీగల్‌ రీజనింగ్‌ 35-39 (25 శాతం వెయిటేజీ), లాజికల్‌ రీజనింగ్‌ 28-32 (20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13-17 (10 శాతం వెయిటేజీ) వరకు ప్రశ్నలు వస్తాయి. పరీక్ష ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్, స్కిల్స్‌ ఉన్నాయా? లేవా? అనేది పరీక్షతో గమనిస్తారు. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వర్తమాన అంశాలు, చరిత్రాత్మక ఫిక్షన్, నాన్‌ ఫి‡క్షన్‌ విభాగాల్లో పాసేజ్‌ ప్రశ్నలు వస్తాయి. ఇంటర్‌ విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిలోనే, ఒక్కోటి 5 నుంచి 7 నిమిషాల్లో చదవగలిగేలా ఉంటాయి. వీటిద్వారా అభ్యర్థిలోని గ్రహణ, భాషా నైపుణ్యాలను గమనిస్తారు. జవాబు గుర్తించడానికి ఆ పాసేజ్‌ క్షుణ్నంగా చదవాలి. అందులోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అందులోని భిన్న అభిప్రాయాలు, వాదనలు.. అన్నీ బేరీజు వేసుకుని స్పష్టమైన నిర్ణయానికి రావాలి. పదసంపదపై పట్టు పెంచుకుంటే పాసేజ్‌ అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఆకళింపు చేసుకుంటూ వేగంగా చదవగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధన చేయాలి. దీంతోపాటు ద హిందూ/టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా/ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చే వ్యాసాలు అందులోనూ ముఖ్యంగా సమకాలీన చర్చనీయ అంశాలకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలు చదవాలి. 

కరంట్‌ అఫైర్స్, జీకే: వార్తలు, కథనాలు, నాన్‌ ఫిక్షన్‌ రచనల నుంచి పాసేజ్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో లీగల్‌ లేదా లీగల్‌ సంబంధిత అంశాలు ఉండవచ్చు. అయితే సమాధానాలు గుర్తించడానికి న్యాయవిద్యలో ప్రావీణ్యం అవసరం లేదు. వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌ల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్, ప్రపంచంలో చర్చనీయమవుతోన్న పరిణామాలు, సంఘటనలు; కళలు, సంస్కృతి; అంతర్జాతీయ అంశాలు, వర్తమానంతో ముడిపడిన చరిత్రాత్మక అంశాలు..తదితరాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. అందువల్ల తాజా సంఘటలను ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఈ విభాగంలో రాణించడానికి ఆంగ్ల పత్రికలు అనుసరించాలి. 

లీగల్‌ రీజనింగ్‌: ఇందులోనూ పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. లీగల్‌తో ముడిపడిన ఉన్న వాస్తవ సంఘటనలు, పరిణామాలు, పబ్లిక్‌ పాలసీ, నీతి, తాత్వికాంశాలకు చెందిన ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి న్యాయవిద్యతో పరిచయం అవసరం లేదు. వర్తమానాంశాలపై అవగాహన, సమకాలీన న్యాయ, మానవత్వ సంఘటనలపై దృష్టి సారించాలి. ఇచ్చిన పాసేజ్‌లోని నిబంధనలు, సూత్రాలు (నియమాలు) గుర్తించాలి. వాటిని వివిధ సందర్భాలకు అనువర్తించాలి. వాస్తవికతకు తర్కాన్ని జోడించి ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 

లాజికల్‌ రీజనింగ్‌: ప్యాసేజ్‌ కింద ప్రశ్నలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అడగవచ్చు. వీటికి సరైన సమాధానం గుర్తించడానికి ఇచ్చిన పాసేజ్‌లో ఆర్గ్యుమెంట్లు, కన్‌క్లూజన్లు గమనించాలి. వాటిని తార్కికంగా విశ్లేషించుకోవాలి. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: ఈ విభాగంలో.. సమాచారం లేదా గ్రాఫ్‌లు లేదా అంకెలతో కూడిన చిత్రాలు లేదా కొన్ని వాస్తవికాంశాలు...వీటిలో ఏవైనా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు సంబంధించిన జవాబు దానిపైన ఉన్న వివరణతో ముడిపడే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోవాలి. గణితంపై పట్టు ఉంటే ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్చు. ఇందుకోసం పదో తరగతిలోని రేషియో, ప్రపోర్షన్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌ అంశాలను బాగా చదువుకోవాలి. 

రాణించాలంటే...

పుస్తకాలు, పత్రికలు చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలు నోట్సు రాసుకోవాలి. దీంతో పరీక్షకు ముందు రివిజన్‌ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. 

వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. వీటితోపాటు 2020, 2021 ప్రశ్నపత్రాలు సునిశితంగా గమనించాలి. దీంతో ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. 

ప్రామాణిక ఆంగ్ల వార్తాపత్రిక ఎడిటోరియల్స్, లీగల్‌ అంశాలు రోజూ చదవాలి.

పరీక్షలో లీగల్‌ ఆప్టిట్యూడ్‌కి ప్రాధాన్యం ఉంది. అందువల్ల లీగల్‌ వార్తలు, ఒకాబ్యులరీ, థియరీ అంశాల్లో పట్టు పెంచుకోవడం తప్పనిసరి. 

పరీక్ష తేదీకి ముందు కనీసం ఏడెనిమిది నెలల కరంట్‌ అఫైర్స్‌పై పట్టు పెంచుకోవాలి. తాజా అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. 

ఆంగ్లంలో రాణించడానికి వ్యాకరణం.. అందులోనూ ముఖ్యంగా పదసంపదపై పట్టు పెంచుకోవాలి. జాతీయాలు, సామెతలపై అవగాహన అవసరం. దీంతో ఆ వ్యాసాన్ని అర్థం చేసుకోవడం తేలికవుతుంది. 

సుదీర్ఘ వ్యాసాలు క్లిష్టంగా వస్తున్నాయి. వీటి అవగాహనకు ఆంగ్లంపై పట్టు తప్పనిసరి. వేగంగా చదవగలగాలి. అలాగే సంగ్రహణ నైపుణ్యాలు బాగా ఉండాలి. ఇందుకోసం నవలలు, వార్తాపత్రిక కథనాలు, సంపాదకీయాలు, పత్రికలు, ఆంగ్లంలో విమర్శనాత్మక సమీక్షలు, వార్తాంశాలను వివరంగా చదవడం ముఖ్యం. వాటిని చదివిన తరువాత సొంతంగా నోట్స్‌ సిద్ధం చేసుకోగలగాలి. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోని ప్రశ్నలకు తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న శాతాలు, నిష్పత్తులు, సగటులు వంటి ప్రాథమిక అంకగణితం బాగా సాధన చేయాలి. 

క్లాట్‌ మాదిరి ప్రశ్నలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్నవారికి విభాగాలవారీ స్టడీ మెటీరియల్‌తో పాటు చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌లూ ఇస్తారు. ఇంటర్నెట్‌లో పాత ప్రశ్నపత్రం- సమాధానాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.స్కోర్‌తో ఉద్యోగం

గేట్‌ స్కోర్‌తో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నట్లుగానే క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్ష స్కోర్, ఇంటర్వ్యూతో కొలువులు లభిస్తున్నాయి. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, ఓఎన్‌జీసీ లిమిటెడ్, నేషనల్‌ థర్మల్‌ పవర్, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌...లీగల్‌ విభాగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. వీరికి లా ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌/ ట్రెయినీ లీగల్‌ అడ్వయిజర్‌ హోదాలు దక్కుతున్నాయి. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌కు సంస్థలు దాదాపు 75 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. మిగిలిన 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి. ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 50% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీలు 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి  ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా రాయవచ్చు. 

పీజీ క్లాట్‌

ఈ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందుల 120 మల్టిపుల్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్షలో కాన్‌స్టిట్యూషన్, క్రిమినల్, ఫ్యామిలీ, ప్రాపర్టీ, కంపెనీ, ట్యాక్స్, లేబర్, ఇండస్ట్రియల్, ఎన్విరాన్‌మెంటల్‌ లా విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎల్‌ఎల్‌బీ పాఠ్యపుస్తకాలతోపాటు ఆయా విభాగాలవారీ కనీసం ఒకటి రెండు రిఫరెన్స్‌ బుక్స్‌ చదివినవారు ఎక్కువ మార్కులు సాధించగలరు.

ముఖ్య వివరాలు...

అర్హత: ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యారులు 40% మార్కులు సరిపోతాయి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న వాళ్లూ అర్హులే. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ, ఎస్టీలకు రూ.3500.

పరీక్ష తేది: మే 8 

వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/

ఉపయోగపడే పుస్తకాలు

యూనివర్సల్‌ క్లాట్‌ గైడ్‌

లీగల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ లీగల్‌ ఆప్టిట్యూడ్‌- ఏపీ భరద్వాజ్‌

లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌

వర్డ్‌పవర్‌ మేడ్‌ ఈజీ- నార్మన్‌ లూయీ

ఎనలిటికల్‌ రీజనింగ్‌ - ఎంకే పాండే

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - ఆర్‌ఎస్‌ అగర్వాల్‌

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆశావహ ధోరణితో అనుకూల ఫలితాలు

‣ జట్టుగా.. కలిసికట్టుగా!

‣ ఏ బోర్డులో చదివితే గెలుపు సులువు?

Posted Date: 04-01-2022


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌