• facebook
  • whatsapp
  • telegram

టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

ఆసక్తి, అభిరుచి ప్రధానం

విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. అవన్నీ పదిలంగా గమ్యాన్ని చేర్చేవే. అయితే వాటిలో ఎవరికి ఏ దారి బాగో తెలుసుకోవాల్సింది మాత్రం విద్యార్థులే. ఎందుకంటే.. స్పష్టమైన లక్ష్యంతో ఎంచుకున్న కోర్సులే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. మరి మీ దారెటో తేల్చుకుంటారా? 

అందరూ అటు వైపు వెళ్తున్నారు కాబట్టి అదే నా దారి..

ఎవరూ ఇటు వెళ్లడం లేదు అందువల్ల ఇదే మంచిది..

స్నేహితుల మాటే నా భవితకు బాట... 

అమ్మనాన్నలు చూపిన తోవే బాగు.

ఇవేవీ మీకు సరైనవి కావు. వాటిలో ఎక్కడా మీ పాత్ర లేకపోవడమే అందుకు కారణం. మీ దారి.. రహదారి కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. చిన్నవయసు, నేనెలా ఎంచుకోవాలి.. అనుకోవద్దు. మీతో మీరు మాట్లాడండి. మీ గురించి మీరే తెలుసుకోండి. ఇందుకోసం శ్రద్ధతో సమయాన్ని కేటాయించండి. స్వీయ సమీక్షను మించిన కొలమానం లేదు.  

పదో తరగతి తర్వాత కోర్సులు ఎంచుకునే విధానంలో సమగ్రత కొరవడితే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల విద్యార్థులందరూ తమ ముందున్న అన్ని అవకాశాలపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. అలాగే నైపుణ్యాలను విశ్లేషించుకుని, వాటిలో ఏది నప్పుతుందో గుర్తించడం అవసరం. ఇలా అవగాహన, ఆసక్తితో కోర్సులు ఎంచుకుంటే.. లక్ష్యం దిశగా తొలి అడుగు పడినట్లే!

పది పూర్తిచేసుకున్నవారి ముందున్న మార్గాలు.. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్‌ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు.

ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. దేనికవే గొప్పవి. ఏదీ తక్కువ కాదు. అయితే వీటిలో సరిపోయేవి గుర్తించే బాధ్యత విద్యార్థులదే. వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించి, విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.   

ఎంచుకోవడం ఎలా? 

కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు తమ స్వీయ సామర్థ్యాలను మదింపు చేసుకుని, సంపూర్ణంగా విశ్లేషించుకోవాలి. ఇలా జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశముంటుంది. 

మ్యాథ్స్‌ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేదు అందుకే సీఈసీ.. ఇలా ఉండకూడదు ఎంపిక. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్‌ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్‌ అంశాల్లో పట్టు లేదు కాబట్టి ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరకూడదు. 

ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, ఆ దిశగా అడుగులేయాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో దాన్ని ఎంచుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకే పెద్ద పీట వేయాలి. 

ఇలా వద్దు

చదువుల్లో రాణించలేకపోయిన ఎక్కువమంది చెప్పే సమాధానం... ఫలానా వాళ్ల ఒత్తిడి కారణంగా ఆసక్తి లేకుండా ఈ కోర్సులో చేరి నష్టపోయానని అనడమే. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. తెలిసినవాళ్లు చెప్పారనో, బంధువులు సూచించారనో, అమ్మానాన్నల ఆశయమనో, స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కువ సంపాదనకు వీలుందనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతున్నారనో, అవకాశాలు ఎక్కువనో... ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. ఎవరో చెప్పారని కోర్సులు తీసుకుంటే వాటిని చదవాల్సింది మాత్రం మీరేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్‌ నిర్మించుకోవాలి.

ఇందుకోసం ఆసక్తులు, బలాలు, ఇష్టాలు, అభిరుచులు, ఆశయాలు అన్నీ ఒకచోట సమగ్రంగా రాసుకోవాలి. ఈ కసరత్తుకు వీలైనంత  సమయం కేటాయించుకోవాలి. వ్యక్తిగత అభిరుచి లేకుండా ఎవరినైనా, దేన్నైనా అనుసరించడం వల్ల నష్టపోయేది మనమే. నిర్ణయంలో తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ విలువైన సమయం వృథా అవుతుంది. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఇతరుల సలహాలపై పూర్తిగా ఆధారపడవద్దు. అవసరమైన సమాచారాన్నే ఇతరుల నుంచి సేకరించండి. వాళ్ల అనుభవాలు, ఆలోచనలను మీ విశ్లేషణలో ఉపయోగించుకోండి. అంతిమ నిర్ణయం మీ ఇష్ట ప్రకారమే తీసుకోండి. 
ఫలానా కోర్సులో చేరతాను. అందుకు బలమైన కారణాలు ఇవీ.. అనే స్పష్టత మీ వద్ద ఉంటే.. మీరు సరైన మార్గంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లే లెక్క.

ఏ నిర్ణయానికీ రాలేనివాళ్లు....?

వీరు తమ గురించి బాగా తెలిసిన ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు. విద్యార్థుల సామర్థ్యాలపై వీళ్లకు కొంత అవగాహన ఉంటుంది. ఆ విద్యార్థి ప్రత్యేకతలు, తెలివితేటలు ఆధారంగా సరైన మార్గనిర్దేశం చేయడం సాధ్యమవుతుంది. లేదా గుర్తింపు పొందిన కెరియర్‌ కౌన్సెలర్ల సహాయాన్నీ తీసుకోవచ్చు. కెరియర్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలతోనూ ఒక అంచనాకు రావచ్చు. 

తల్లిదండ్రులిలా... 

పిల్లల గ్రూపు ఎంపికలో తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ఆశయాలను పక్కనబెట్టాలి. ఫలానా గ్రూపు అయితే భవిష్యత్తు బాగుటుందని, వాళ్ల ఇష్టంతో సంబంధం లేకుండా చేర్చడం మంచిది కాదు. పిల్లలపై వ్యక్తిగత ఆశయాలను రుద్దడం, వాళ్ల ద్వారా తమ కోరికలు తీర్చుకోవాలనుకోవడం తప్పు. వ్యక్తిగత ఆసక్తితో కాకుండా పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు రాణించలేరు. ఎంతో ఇబ్బంది పడతారు కూడా. పెట్టుబడి మాదే కాబట్టి చెప్పింది చదవాల్సిందే అనే ధోరణితోనూ నష్టమే. డాక్టర్‌ కావాలనుకుని అకౌంటెంట్‌గా జీవితాన్ని నెట్టుకొచ్చే తండ్రులెందరో ఉంటారు. వీరిలో ఎక్కువమంది కనీసం తమ పిల్లలనైనా డాక్టర్ని చేయాలనే ఆశయంతో.. వాళ్ల ఇష్టాలతో సంబంధం లేకుండా.. నీట్‌(బైపీసీ)లో పడేస్తారు. దీంతో డిజైనర్‌ కావాలనుకున్న పిల్లాడు చివరికి తండ్రిలాగే క్లర్క్‌గా అసంతృప్తి జీవితం గడపాల్సి వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు విద్యార్థుల ఆశయాలకు అవరోధం కాకూడదు. పిల్లల్లోని సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో అద్భుతంగా రాణించడానికి అవకాశాలెక్కువ. వాళ్లకు విలువైన సూచనలు చేస్తూ, మార్గదర్శిగా నిలవాలి. దీంతో బంధాలూ బలపడతాయి.

ఉచిత వేదికలెన్నో...

కొంతమంది ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా పది తర్వాత చదువులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఎన్నో వేదికలు ఉన్నాయిప్పుడు. 

ఇంటర్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఆరేళ్లు ఉచితంగా చదువుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్‌ఐటీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలుంటాయి. 

ఇంటర్‌ చదవడానికి రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలెన్నో ఉన్నాయి. ప్రవేశపరీక్షతో వీటిలో చేర్చుకుంటున్నారు. ఈ సంస్థల్లో జేఈఈ, నీట్‌ శిక్షణనూ అందిస్తున్నారు. 

సాంకేతిక విద్య కోసం అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. 

అలాగే పలు ఐటీఐలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. 

ఒకేషనల్‌ కోర్సులు కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే అందిస్తున్నారు. 

విద్యార్థి లక్ష్యం ఏదైనప్పటికీ ఉచితంగా చదువుకోవడానికి వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించి రాణిస్తోన్న విద్యార్థుల సంఖ్య తక్కువ కాదు. అందువల్ల కార్పొరేట్‌ సంస్థల్లో చదవలేకపోతున్నామనే దిగులు చెందాల్సిన అవసరం లేదిప్పుడు. టీవీ ఉంటే చాలు ఇంట్లోనే ఉంటూ, ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన జేఈఈ, నీట్‌ వీడియో పాఠాలు వీక్షించి, సన్నద్ధమైపోవచ్చు. 

విద్యార్థులు అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. కోర్సు లేదా కెరియర్‌ ఎంపిక సరిగా ఉంటే దాదాపు సగం విజయం ఖాయమైనట్టే. అలాకాకుండా ఎంపీసీలో చేరిన ఆరు నెలల తర్వాత అయ్యో బైపీసీ తీసుకోవాల్సిందే అనుకోవడం వల్ల విలువైన ఏడాది సమయం వృథా కావడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ఇలా జరగకుండా- ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమాలు; ఒకేషనల్‌ విద్య, ఐటీఐ, ఉద్యోగాలు...ఈ సమాచారాన్నంతా తెలుసుకుంటే స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు. 

వచ్చే సంచికల్లో ఆ వ్యాసాలన్నీ మీ ముందు ఉంచుతాం. వాటిని చదివి, నిర్ణయం తీసుకుంటే...భవిత పదిలమే!

ఇలా చేయవచ్చు... 

పదో తరగతి సబ్జెక్టుల్లో తమకున్న ప్రతిభ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. నైపుణ్యం ఉన్న సబ్జెక్టుల్లో ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకోవచ్చు. 

మ్యాథ్స్‌పై గట్టి పట్టున్నవారు ఎంపీసీ లేదా ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు. 

సైన్స్, ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఎంపీసీని ఖాయం చేసుకోవచ్చు. 

సీఏ, సీడబ్ల్యుఏ చేయాలనుకుంటే ఎంఈసీవైపు మొగ్గు చూపవచ్చు. 

బయాలజీని బాగా ఇష్టపడేవాళ్లంతా బైపీసీని ఎంచుకోవడమే మంచిది. 

సమకాలీనం, సామాజికాంశాలపై ఆసక్తి ఉంటే మరో ఆలోచన లేకుండా హెచ్‌ఈసీలో చేరిపోవచ్చు. 

వర్తక రంగం, వ్యాపార గణితంపై మనసున్నవారు.. మ్యాథ్స్‌పై పట్టుంటే ఎంఈసీ, లేకుంటే సీఈసీ తీసుకోవచ్చు. 

సాంకేతికతను ఇష్టపడేవారు, యంత్రాలతో పనిచేయాలనే తపన మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్‌ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. 

తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సులు లేదా ఐటీఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 

పై చదువులపై పెద్దగా ఆసక్తి లేనివాళ్లు పది అర్హతతో ఉన్న ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే దూరవిద్యలో దారులు వెతుక్కోవచ్చు. 

కాలేజీకి వెళ్లి చదవడం వీలు కానివారు ఓపెన్‌ స్కూల్‌ లేదా ఇగ్నో నుంచి నచ్చిన కోర్సుల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

‣ కంప్యూటర్‌ సైన్స్‌కే జై!

‣ కోల్‌ ఇండియాలో కొలువులు

‣ సుప్రీంకోర్టులో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

Posted Date: 27-06-2022


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌