• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ చాలు.. వేల ఉద్యోగాలు!

కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో లభిస్తోన్న కొలువుల వివరాలు 

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే మంచి ఉద్యోగాలు పొందడానికి మార్గాలెన్నో ఉన్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు కెరియర్లో ఉన్నత స్థానానికీ చేరుకోవచ్చు. ఈ అర్హతతో ఏటా క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిలో ఆరు నెలలకు ఒకసారి విడుదలయ్యేవీ ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు; రైల్వే, ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్, కోస్టు గార్డు మొదలైనవి ఎంచుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖ... మొదలైన ఉద్యోగాల్లో చేరవచ్చు. చిన్న వయసులో చేరి ప్రతిభ చూపినవారు తక్కువ వ్యవధిలోనే పదిలమైన హోదాలను సొంతం చేసుకోవచ్చు. ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో లభిస్తోన్న కొలువుల వివరాలు చూద్దాం...

ఇంటర్‌ విద్యార్హతతో చాలా ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఎక్కువ నియామకాలు మాత్రం రక్షణ రంగంలోనే చేపడుతున్నారు. ఇందులోనూ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు  రూ.50 వేల నుంచి లక్ష వరకు అందించే ఉద్యోగాలు కేంద్ర దళాల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారు రూ.30వేలు, ఆపైన వేతనం ఆశించవచ్చు. సాధారణంగా అన్ని పరీక్షల్లోనూ ఆప్టిట్యూడ్, ఆంగ్ల పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలు వస్తాయి. ఆయా పోస్టును బట్టి పరీక్ష విధానంలో కొద్ది మార్పులు ఉంటాయి. 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో..

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా భర్తీ చేస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఎ), పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులను నిర్వర్తించవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, స్కిల్‌ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ అర్హులే.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌

కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ఎస్‌ఎస్‌సీ ప్రకటనలు విడుదలచేస్తోంది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనోలో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. 

రైల్వేశాఖలో...

ఇంటర్‌ విద్యార్హతతో రైల్వే శాఖలో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, జూనియర్‌ టైం కీపర్, ట్రైన్స్‌ క్లర్క్, కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్లలోపువారు వీటికి అర్హులు. ప్రకటనలు రెండు లేదా మూడేళ్లకు ఒకసారి రావచ్చు. కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ లెవెల్‌ 3 ఉద్యోగం. మిగిలినవన్నీ లెవెల్‌ 2 ఉద్యోగాలు. లెవెల్‌ 3కి 21,700; లెవెల్‌ 2 పోస్టులకు రూ.19,900 మూలవేతనం అందుతుంది. ఈ పోస్టులను రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు. పోస్టు బట్టి టైప్‌ లేదా స్కిల్‌ టెస్టు ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు. 

రాష్ట్రస్థాయిలో...

పోలీస్, అటవీ, ఎక్సైజ్‌ శాఖల్లో ఇంటర్‌ విద్యార్హతతో రాష్ట్రస్థాయి ఉద్యోగాలు పొందవచ్చు. 

కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్‌మెన్‌

ఈ పోస్టులకు ఇంటర్‌ పూర్తిచేసుకున్న అన్ని గ్రూపులవారూ అర్హులే. పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జైలు వార్డర్, ఫైర్‌ మెన్‌ పోస్టులకు 32 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. రెండు లేదా మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. 

ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌

ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌ విభాగంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభ, నడక ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది. 

దేశ రక్షణ రంగంలో

ఏర్‌ ఫోర్స్‌

ఏర్‌ మెన్‌ విభాగంలో గ్రూప్‌ ఎక్స్, వై ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు.

గ్రూప్‌ ఎక్స్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తప్ప మిగిలిన పోస్టులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆంగ్లంలో 50 శాతం మార్కులు ఉండాలి.   

గ్రూప్‌ వై: మెడికల్‌ అసిస్టెంట్, మ్యుజీషియన్‌ కాకుండా మిగిలినవాటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌లో 50 శాతం తప్పనిసరి. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ కోసం బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి.

అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు అవసరం. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు.

ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్‌ ఎక్స్‌ విభాగంలో ఎంపికైనవారికి ఫిట్టర్, గ్రూప్‌ వై విభాగంలో చేరినవారికి టెక్నీషియన్‌ ట్రేడులు కేటాయిస్తారు. నాన్‌ టెక్నికల్‌ ట్రేడుల్లో అకౌంట్‌ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, ఏర్‌ఫోర్స్‌

పోలీస్, సెక్యూరిటీ అసిస్టెంట్‌...తదితర ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడుల్లో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 చొప్పున   స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడులకు గ్రేడ్‌ పేతో కలుపుకుని రూ.33,100, గ్రూప్‌ వై ట్రేడులకు రూ.26,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. వీరు కెరీర్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ నుంచి మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ వరకు చేరుకోవచ్చు. ప్రతిభావంతులు ఆఫీసర్‌ హోదా అందుకోవడానికీ అవకాశం ఉంది.

ఆర్మీ

సోల్జర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌: ఈ పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50 శాత మార్కులు తప్పనిసరి. 

సోల్జర్‌ టెక్‌: ఈ పోస్టులకు ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. 

సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు అవసరం. అన్ని పోస్టులకు వయసు 17 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. అన్ని పోస్టులకు పురుషులే అర్హులు. 

ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.

నేవీ

భారతీయ వాయుసేనలో ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్, సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ పోస్టులకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టు, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. దీనికి మిలటరీ సర్వీస్‌ పే రూ.5200 అదనం. ఏఏకు ఎంపికైనవారు రూ.6200 గ్రూప్‌ ఎక్స్‌ పే కింద అదనంగా అందుకుంటారు. వీటన్నింటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. వీరు మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ హోదా వరకు చేరుకుంటారు. 

కోస్టు గార్డు

కోస్టు గార్డులో నేవిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో 50 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రకటనలు ఏటా రెండుసార్లు వెలువడతాయి. ఎంపికైనవారికి రూ. 21,700 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అదనం. భవిష్యత్తులో వీరు ప్రధానాధికారి హోదాకు చేరుకోవచ్చు. 

చదువుతోపాటు కొలువు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఎ) పరీక్షను మహిళలతోపాటు ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ రాసుకోవచ్చు. ఎంపికైనవారిని బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను ఉచితంగా చదివిస్తారు. శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అలాగే ఆర్మీ 10+2 టెక్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ-జేఈఈ స్కోర్, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. వీరికి నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ కోర్సు ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ మూడు ప్రకటనలూ ఏడాదికి రెండుసార్లు చొప్పున వెలువడతాయి.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దళాల్లో దూసుకుపోవచ్చు!

‣ వరుస విజయాలే నిరంతర ప్రేరణ

‣ ఉపాధికి, ఉన్నత విద్యకు చేరువ చేసే దూరవిద్య!

‣ గూగుల్‌లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తారా?

Posted Date: 01-12-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌