‣ మూడు కేటగిరీలు
‣ నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివినవారికీ అవకాశం
ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ... కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు... వీటన్నిటికీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోరే ప్రామాణికం. తాజా మార్పులతో నాలుగేళ్ల యూజీ కోర్సులతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయి సంస్థల్లో పీహెచ్డీలో ప్రవేశానికీ ఈ స్కోరు దారిచూపుతుంది. ఇటీవల వెలువడిన యూజీసీ నెట్ జూన్- 2024 వివరాలు..
యూజీసీ నెట్ను ఏడాదికి రెండుసార్లు ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను 83 సబ్జెక్టుల్లో రాసుకోవచ్చు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. గత డిసెంబరు వరకు జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ స్కోరుతో అవకాశం కల్పించేవారు. తాజా ప్రకటనలో పలు మార్పులు చేశారు. ఎక్కువమంది అభ్యర్థుల అవసరాలు తీరేలా మూడు కేటగిరీల్లో ఎంపిక ఉంటుంది.
నెట్తో ప్రయోజనాలివీ..
‣ జేఆర్ఎఫ్కు ఎంపికైతే ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ పరిశోధన కొనసాగించవచ్చు.
‣ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
‣ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
‣ వివిధ పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ నెట్ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి.
‣ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికి నెట్ తప్పనిసరి.
‣ కొన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్ స్కోర్తో మేనేజ్మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి.
‣ ప్రైవేటు సంస్థలు సైతం నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
‣ తాజా మార్పులతో రాష్ట్ర స్థాయి సంస్థల్లోనూ పీహెచ్డీలో చేరవచ్చు.
పరీక్షలో...
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. సమాధానాలు ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి. పేపర్-1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. 50 ప్రశ్నలకు వంద మార్కులు. రెండో పేపర్ వంద ప్రశ్నలు, 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రం అభ్యర్థి ఎంచుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి ఉంటుంది.
రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్ 1, 2 మధ్య విరామం లేదు.
పేపర్-1: ఇందులో 10 విభాగాలు ఉన్నాయి. అవి.. టీచింగ్ ఆప్టిట్యూడ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టం. అభ్యర్థి బోధన, పరిశోధన రంగంలో రాణించగలరా, లేదా తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఆలోచన విధానం, ఆంగ్లాన్ని అర్థం చేసుకునే తీరు, గణితంలో ప్రాథమిక పరిజ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, కమ్యూనికేషన్ సాధనాలు, అభివృద్ధి, పర్యావరణం, ఉన్నత విద్యలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.
పేపర్-2: ప్రశ్నలన్నీ అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచే ఉంటాయి. ఆ విభాగంలో.. ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా వీటిని అడుగుతారు. అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే అయినప్పటికీ.. అందులో లోతైన పట్టున్నవారే సమాధానం ఇవ్వగలరు. ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివితేనే నెగ్గగలరు.
జేఆర్ఎఫ్..
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అవకాశం వచ్చినవారు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్డీ) దిశగా అడుగులేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా రూ.31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. సంస్థ వసతి కల్పించనకపోతే స్టైపెండ్లో 30 శాతం వరకు హెచ్ఆర్ఏ రూపంలో చెల్లిస్తారు. ప్రతి ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది.
ముఖ్య వివరాలు
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందడానికి వయసు నిబంధన లేదు. జేఆర్ఎఫ్ కోసం జూన్ 1, 2024 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు.
ఆన్లైన్ దరఖాస్తులు: మే 10 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150. ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రూ.325.
పరీక్ష తేదీ: మార్పు చేశారు. జూన్ 18న నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://ugcnet.nta.ac.in/
సన్నద్ధత మెలకువలు
యూజీసీ వెబ్సైట్లో సబ్జెక్టులవారీ సిలబస్ వివరాలు ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని, ఆ అంశాలే లోతుగా అధ్యయనం చేయాలి.
‣ సబ్జెక్టులో మీకెంత పట్టు ఉందో తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. ప్రాథమికాంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. కొన్ని ప్రశ్నలను పలు అంశాలను జోడించి అడుగుతారు. ఇలాంటివాటికి సబ్జెక్టులోని ప్రతి అంశంపైనా లోతైన పరిజ్ఞానం అవసరం.
‣ అధ్యయనంలో ముందుగా ఆ సబ్జెక్టులో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను బాగా చదవాలి. అనంతరం పీజీ, రిఫరెన్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
‣ పరిమిత పుస్తకాలనే ఎంచుకుని, వాటినే విస్తృతంగా చదవాలి.
‣ చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని మరోసారి మననం చేయాలి.
‣ పరీక్షలో విజయానికి పాత ప్రశ్నపత్రాల అధ్యయనం తప్పనిసరి. ప్రశ్నల స్థాయి, వాటిని అడిగే విధానం, అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం.. వీటితో తెలుసుకోవచ్చు. సన్నద్ధత ఎలా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.
‣ నెట్లో విజయానికి.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్/స్లెట్ పేపర్లూ పరిశీలించవచ్చు. జేఎల్, డీఎల్ ప్రశ్న పత్రాలూ ఉపయోగపడతాయి. పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాల అధ్యయనమూ మేలు చేస్తుంది.
‣ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కనీసం పదైనా నమూనా పరీక్షలు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు/విభాగాల్లో తప్పులొస్తున్నాయో గుర్తించి, వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. మొదటి పరీక్ష నుంచి చివరి దాకా ఇలా విశ్లేషణ చేసుకుంటూ, సన్నద్ధమైతే విజయవంతం కావచ్చు.
‣ రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకూ బాగా ఆలోచించి జవాబు గుర్తించాలి. ఏదైనా ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా, ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు ఉన్నా బోనస్ మార్కులు ఇస్తారు. అయితే ఆ ప్రశ్నకు ఏదో ఒక ఆప్షన్ జవాబుగా గుర్తించినవారికే ఇవి దక్కుతాయి. ఏ సమాధానమూ ఇవ్వనివారికి ఈ మార్కులు జత చేయరు. అందువల్ల తెలియని ప్రశ్ననూ వదలొద్దు.
‣ సబ్జెక్టుల వారీగా ఎన్నో సంస్థల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ట్రూమెన్స్/అరిహంత్/ఉప్కార్/ టాటా మెక్గ్రాహిల్స్/ పియర్సన్ వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకోవచ్చు. ఆన్లైన్లోనూ విస్తృత సమాచారం చాలావరకు ఉచితంగా పొందవచ్చు.
కటాఫ్ ఇలా..
సబ్జెక్టు బట్టి మారుతుంది. ఆ సబ్జెక్టులో ఎంత మంది పరీక్ష రాశారు, ప్రశ్నపత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి. లెక్చరర్షిప్ అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్ఎఫ్ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో లెక్చరర్షిప్ 180 మార్కులకీ పొందవచ్చు. జేఆర్ఎఫ్ 200 మార్కులకీ లభిస్తోంది.
తాజా మార్పులు
నెట్లో అర్హత సాధించడానికి 3 కేటగిరీలు ఉన్నాయి. ఎవరి అవసరం ప్రకారం వారు ఆ కేటగిరీని ఎంచుకోవచ్చు.
కేటగిరీ-1: జేఆర్ఎఫ్. దీనికి ఎంపికైనవారు ప్రతి నెలా యూజీసీ నిర్దేశిత స్టైపెండ్ పొందుతూ పరిశోధన (పీహెచ్డీ) కొనసా గించుకోవచ్చు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, జేఆర్ఎఫ్ లేకుండా జరిపే పీహెచ్డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-2: ఈ విధానంలో ఎంపికైనవారికి జేఆర్ఎఫ్ దక్కదు. అయితే వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-3: వీరు పీహెచ్డీలో ప్రవేశానికే అర్హులు. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లేదు.
తాజా మార్పుల ద్వారా.. రాష్ట్ర విశ్వవిద్యాలయాలూ, ఉన్నత విద్యాసంస్థలూ పీహెచ్డీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలను విడిగా రాయనవసరం లేదు. కేటగిరీ 2, కేటగిరీ 3ల్లో ఎంపికైనవారు పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూతో పీహెచ్డీ ప్రవేశం పొందవచ్చు. నెట్ స్కోరుకు 70, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ దక్కుతుంది. ఇలా అవకాశం వచ్చినవారికి యూజీసీ నిర్దేశిత స్టైపెండ్ దక్కదు. ఆ సంస్థ నిబంధనల మేరకు ఎంతో కొంత చెల్లిస్తారు. ఈ స్కోరు ఏడాది వరకు చెల్లుతుంది. ఈ తరహా పీహెచ్డీలో చేరడానికి వయసు నిబంధన లేదు. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు.
యూజీ కోర్సులతోనూ..
నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. వీరు జేఆర్ఎఫ్, పీహెచ్డీల్లో ప్రవేశానికే అర్హులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడలేరు (పీజీ చదవకపోవడమే దీనికి కారణం). చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!