‣ మాస్టర్స్ డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం
సామాజిక వికాసం, దేశ అభివృద్ధికి సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలే కీలకం. ఇందుకోసమే దేశవ్యాప్తంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పలు సైన్స్ విభాగాల్లో ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగం కావాలనుకునే ఔత్సాహికులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించే సీఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్లో అర్హత సాధించాలి. అలాగే సైన్స్ కోర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు నెట్ ఉపయోగపడుతుంది. ఇటీవలే వెలువడిన సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబరు - 2023 వివరాలు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఏడాదికి రెండుసార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తరఫున నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) నిర్వహిస్తున్నారు. సీఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రయోగశాలలు ఉన్నాయి. వీటిలో పరిశోధనలు కొనసాగించుకునే అవకాశం జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)తో లభిస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ అర్హత సాధిస్తే ప్రతి నెల స్టైపెండ్ అందుకుంటూ పరిశోధనలు కొనసాగించవచ్చు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగానూ రాణించే అవకాశం ఉంది. లెక్చరర్షిప్ అర్హతతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. పరిశోధన సంస్థలతోపాటు డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. వీరు పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో భాగం కావచ్చు.
ఇవీ సబ్జెక్టులు..
‣ కెమికల్ సైన్సెస్
‣ ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్
‣ లైఫ్ సైన్సెస్
‣ మేథమెటికల్ సైన్సెస్
‣ ఫిజికల్ సైన్సెస్
అభ్యర్థులు చదువుకున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష రాయాలి. నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ.. మొదలైనవి పూర్తిచేసుకున్నవారికీ జేఆర్ఎఫ్ అవకాశం దక్కుతుంది. అయితే వీరు లెక్చరర్షిప్నకు అనర్హులు.
పరీక్ష ఇలా..
అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
పార్ట్ ఎ: అన్ని విభాగాల వారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
పార్ట్ బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఛాయిస్ ఉంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున తగ్గిస్తారు.
పార్ట్ సి: ఈ విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. మ్యాథ్స్లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున తగ్గిస్తారు. సైంటిఫిక్ కాన్సెప్టులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.
ప్రశ్నలు.. ఛాయిస్..
మొత్తం ప్రశ్నపత్రం నుంచి సబ్జెక్టులవారీ.. ఫిజికల్ సైన్సెస్లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్లో 120కి 60, లైఫ్ సైన్సెస్లో 145కి 75, కెమికల్ సైన్సెస్లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.
విజయానికి..
ఎందుకు పరీక్ష రాస్తున్నారో స్పష్టత ఉండాలి. అవగాహన, ప్రణాళిక ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలరు. ఆ తర్వాత పరీక్ష స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. సిలబస్ వివరాలు క్షుణ్నంగా తెలుసుకోవాలి.
సీఎస్ఐఆర్ నెట్లో విజయానికి ప్రాథమికాంశాలపై పట్టుతోపాటు సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉండాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవడం తప్పనిసరి. ఇలా చేస్తేనే వీలైనన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. రెండుమూడు అంశాలను కలిపి ఒక ప్రశ్నగా అడుగుతారు. అలాగే అనువర్తనం రూపంలోనూ ఇవి ఉంటాయి. అందువల్ల సిలబస్ మొత్తం పూర్తిగా అధ్యయనం చేయాలి.
సిలబస్ పరిశీలిస్తూ సన్నద్ధత కొనసాగించాలి. దాన్ని తేలిక, మధ్యస్తం, కఠినం ఇలా విభజించుకోవాలి. ఉన్న వ్యవధిలో కఠినమైన అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఫర్వాలేదు అనిపించినవాటిని తక్కువ వ్యవధిలోనే పూర్తిచేయాలి. ప్రాథమికాంశాలపై పట్టుకోసం సబ్జెక్టుకు చెందిన యూజీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ఆ తర్వాత అనువర్తన, పరిశోధన కోణంలో సన్నద్ధత కొనసాగించాలి. చాప్టర్లవారీ పీజీ స్థాయిలో రిఫరెన్స్ పుస్తకాలు లోతుగా అధ్యయనం చేయడం తప్పనిసరి. ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను శ్రద్ధగా గమనించాలి. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని ఏ స్థాయిలో చదవాలో తెలుసుకుని ఆచరించాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ పార్ట్ సి విభాగానికి ఎక్కువ వెయిటేజీ ఉంది. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్్్సను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్ పరీక్షలు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి పరీక్షనూ సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. పరీక్ష రాస్తున్నప్పుడు సమయానికీ ప్రాధాన్యమివ్వాలి. రుణాత్మక మార్కులున్నాయి. ఏ మాత్రం తెలియని వాటిని వదిలేయాలి.
వివరాలు..
అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా బీఈ/ బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సుల్లో ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.
వయసు: జేఆర్ఎఫ్కు గరిష్ఠ పరిమితి జులై 1, 2023 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు, మహిళలకు ఐదేళ్లు, నాన్ క్రీమిలేయర్ ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు వర్తిస్తుంది. లెక్చరర్షిప్ (ఎల్ఎస్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్కు వయసు నిబంధన లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు: నవంబరు 30 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1100, ఓబీసీ - నాన్ క్రీమీలేయర్కు రూ.550, ఎస్సీ/ ఎస్టీ/ థర్డ్ జండర్లకు రూ.275. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: డిసెంబరు 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్.
వెబ్సైట్: https://csirnet.nta.nic.in/
సబ్జెక్టులవారీ..
లైఫ్ సైన్సెస్: బోటనీ లేదా జువాలజీలో పీజీ పూర్తిచేసుకున్నవాళ్లు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్ టెక్నిక్స్, బయోఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపీ) పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు క్లాసికల్ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీపై ఎక్కువ దృష్టి సారించాలి.
కెమికల్ సైన్సెస్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసెమిట్రిక్ సింథసిస్, కన్ఫర్మేషనల్ అనాలిసిస్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ, రియేజెంట్స్, పెరిసైక్లిక్ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలనూ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్ క్లస్టర్స్ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో.. క్వాంటమ్ కెమిస్ట్రీ, సాలిడ్స్టేట్, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
ఫిజికల్ సైన్సెస్: మోడరన్ ఫిజిక్స్, న్యూక్లియర్, పార్టికల్ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్ (క్లాసికల్, స్టాటిస్టికల్), ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్పరిమెంటల్ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ విభాగాలను క్షుణ్నంగా చదవాలి.
మేథమేటికల్ సైన్సెస్: స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, కాంప్లెక్స్, డిఫరెన్షియల్ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్: భూమి, సౌరవ్యవస్థ, సముద్రాలు, వాతావరణం, పర్యావరణం, భూగర్భశాస్త్రం, జియో కెమిస్ట్రీ, ఎకనామిక్ జియాలజీ, ఫిజికల్ జాగ్రఫీ, జియో ఫిజిక్స్, మెటీరియాలజీ, ఓషన్ సైన్స్ అంశాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.
ప్రయోజనాలు
జేఆర్ఎఫ్కు ఎంపికై, పరిశోధనల్లో చేరినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెల రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత సాధించినవారికి ప్రతి నెల రూ.42,000 చొప్పున అందుతుంది. గతంతో మొదటి రెండేళ్లు రూ.31,000 తర్వాత రెండేళ్లు రూ.35,000 వచ్చేది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్లో 30 శాతం హెచ్ఆర్ఏ కింద అదనంగా చెల్లిస్తారు. నెట్ లెక్చరర్షిప్నకు అర్హత పొందినవారు, జేఆర్ఎఫ్కు ఎంపికైనవాళ్లు.. విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!