• facebook
  • whatsapp
  • telegram

బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. నెట్‌

స్టైపెండ్‌, ఫెలోషిప్‌ కొలువులకు అవకాశం



బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. జాతీయ అర్హత పరీక్ష (నెట్‌). ఇందులో అర్హత పొందినవారు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైనవారు నెలనెలా స్టైపెండ్‌ అందుకుంటూ పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. ఈ స్కోరుతోనే మేటి సంస్థల్లో ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను యూజీసీ తరఫున ఏడాదికి రెండుసార్లు ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. ఇటీవలే డిసెంబరు ప్రకటన వెలువడింది. 


పీజీ కోర్సులో నైపుణ్యానికి కొలమానం నెట్‌. దీన్ని 83 సబ్జెక్టులు/ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ఇందులో అర్హత పొందితే.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. మేటి స్కోరు ఉన్నవారికి డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి. పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ నెట్‌ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్‌ ఫెలోషిప్పులు పొందడానికి నెట్‌ అర్హత తప్పనిసరి. కొన్ని మహారత్న, నవరత్న సంస్థలు నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో.. లీగల్, హ్యూమన్‌ రిసోర్సెస్, మార్కెటింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.


పరీక్ష ఏవిధంగా?

మొత్తం రెండు పేపర్లు. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు. అభ్యర్థులందరికీ మొదటి పేపర్‌ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు వంద మార్కులకు వస్తాయి. రెండో పేపర్‌లో వంద ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. ఈ ప్రశ్నపత్రం అభ్యర్థి ఎంచుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ 1, 2 మధ్య విరామం లేదు. పరీక్షను ఉదయం, మధ్యాహ్నం ప్రతి రోజూ నిర్వహిస్తారు.   


పేపర్‌-1: పది విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి.. టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం. అభ్యర్థి బోధన, పరిశోధన రంగాల్లో రాణించగలరా, లేదా తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఆలోచన విధానం, ఆంగ్లాన్ని అర్థం చేసుకునే తీరు, గణితంలో ప్రాథమిక పరిజ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, కమ్యూనికేషన్‌ సాధనాలు, అభివృద్ధి, పర్యావరణం, ఉన్నత విద్యలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. వర్తమాన సంఘటనలనూ స్పృశిస్తారు. 


పేపర్‌-2: ఈ విభాగంలో ప్రశ్నలన్నీ అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచే ఉంటాయి. ఆ  సబ్జెక్టులో.. ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా వీటిని అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. సబ్జెక్టులో లోతైన పట్టున్నవారే సమాధానం ఇవ్వగలరు. ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివితేనే నెగ్గగలరు. 


జేఆర్‌ఎఫ్‌: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అవకాశం వచ్చినవారు మేటి సంస్థల్లో పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. వీరికి ప్రతి నెలా రూ.31,000 చొప్పున మొదటి రెండేళ్లు చెల్లిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది. 


ఉపయోగపడే పుస్తకాలు: పేపర్‌-1, 2ల కోసం.. ట్రూమెన్స్‌/ అరిహంత్‌/ ఉప్‌కార్‌/ టాటా మెక్‌గ్రాహిల్స్‌/ పియర్సన్‌ - వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకోవచ్చు.  


కటాఫ్‌: సబ్జెక్టుల వారీగా మారుతుంది. ఆ సబ్జెక్టులో ఎంతమంది పరీక్ష రాశారు, ప్రశ్నపత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి. లెక్చరర్‌షిప్‌ అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్‌ఎఫ్‌ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో 180 మార్కులకూ లెక్చరర్‌షిప్‌ పొందవచ్చు. జేఆర్‌ఎఫ్‌ 200కీ లభిస్తోంది. 


ఇలా సన్నద్ధం కండి!  

ముందుగా మీ సబ్జెక్టులో సిలబస్‌ వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి. యూజీసీ వెబ్‌సైట్‌లో ఇవి ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. 

ప్రాథమికాంశాలపై పూర్తి అవగాహన ఉంటేనే జవాబులు గుర్తించగలం. అందువల్ల సన్నద్ధత అక్కడ నుంచే ప్రారంభించాలి. 

ప్రశ్నలు ఆ సబ్జెక్టులో మీకెంత పట్టు ఉందో తెలుసుకునేలా రూపొందిస్తారు. పలు అంశాలను జోడించి ఒకే ప్రశ్నగానూ అడుగుతారు. ఇలాంటివాటికి సబ్జెక్టులోని ప్రతి అంశంపైనా లోతైన పరిజ్ఞానం అవసరం. 

మీ సబ్జెక్టులో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విస్తృతంగా చదవాలి. ఆ తర్వాత పీజీ, రిఫరెన్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. 

రిఫరెన్స్‌ పుస్తకాలను పరిమితంగా ఎంచుకుని, వాటినే బాగా చదవాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని మరోసారి మననం చేయాలి. 

పరీక్షలో విజయానికి పాత ప్రశ్నపత్రాలే దిక్సూచి. వీటి నుంచి.. ప్రశ్నలడిగే విధానం, వాటి స్థాయి, అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. సన్నద్ధతలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. 

రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌/స్లెట్‌ పేపర్లు పరిశీలించవచ్చు. జేఎల్, డీఎల్‌ ప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి. పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల అధ్యయనమూ మేలు చేస్తుంది. 

సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ ఛాప్టర్లు/విభాగాల్లో తప్పులొస్తున్నాయో తెలుసుకుని వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. ఇదే పద్ధతిని చివరి పరీక్ష వరకు కొనసాగిస్తే విజయవంతం కావచ్చు. 

రుణాత్మక మార్కులు లేవు కాబట్టి బాగా ఆలోచించి తెలియని ప్రశ్నకూ జవాబు గుర్తించాలి. ఏదైనా ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా, ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు ఉన్నా బోనస్‌ మార్కులు ఇస్తారు. అయితే ఆ ప్రశ్నకు ఏదో ఒక ఆప్షన్‌ జవాబుగా గుర్తించినవారికే ఇవి దక్కుతాయి. ఏ సమాధానమూ ఇవ్వనివారికి ఈ మార్కులు జత చేయరు. అందువల్ల ఏ ప్రశ్ననూ విడిచిపెట్టకూడదు. 

గతంలో అడిగిన ప్రశ్నలు పునరావృతం కావడానికి అవకాశం తక్కువే. అయినప్పటికీ పాత ప్రశ్నపత్రాల ద్వారా.. ప్రశ్నలు ఏ స్థాయిలో, ఏ విధంగా అడుగుతున్నారో తెలుస్తుంది. దీంతో ఏ తరహా ప్రశ్నలు రావొచ్చో, వాటిని ఎదుర్కోవడానికి ఏం నేర్చుకోవాలో అవగతమవుతుంది. అందువల్ల గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. 

మీ సబ్జెక్టులో ఇటీవల విజయం సాధించినవారి మెలకువలూ, ప్రొఫెసర్ల సూచనలూ సన్నద్ధతలో ఉపయోగపడతాయి. 

సిలబస్‌లో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్న వ్యవధిలోనే మొత్తం సిలబస్‌ చదవడం పూర్తిచేయాలి. 

పరీక్షలో విజయానికి పునశ్చరణ (రివిజన్‌) ప్రధానం. అందువల్ల పరీక్షకు పది రోజుల ముందు నుంచీ పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. నేర్చుకున్న అంశాలన్నీ మరోసారి మననం చేసుకోవాలి. 

ఎంత సమయం, ఎన్ని రోజులు చదివారు, ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేశారు- ఇవేవీ విజయానికి ప్రామాణికం కాదు. ఉన్న వ్యవధిని ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాం, సన్నద్ధతలో నాణ్యత, పరిమిత పుస్తకాలనే పూర్తిగా చదివి, పునశ్చరణ చేసుకోవడం.. ఇవే విజయానికి సోపానాలు. 

పరీక్ష ఒత్తిడి లేకుండా జాగ్రత్త తీసుకుని, ఆత్మవిశ్వాసంతో రాస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.   


నెట్‌తో సెట్‌..

నెట్‌ జాతీయ స్థాయి పరీక్ష. అందువల్ల ఈ స్కోరుతో దేశంలో ఏ రాష్ట్రం/ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకైనా పోటీపడవచ్చు. సెట్‌ రాష్ట్ర స్థాయి పరీక్ష. కాబట్టి ఈ అర్హతతో సొంత రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకే అవకాశం ఉంటుంది. నెట్‌ ఏటా రెండుసార్లు (సాధారణంగా జూన్, డిసెంబరుల్లో) నిర్వహిస్తారు.

సెట్‌ కోసం ప్రత్యేకంగా క్యాలండర్‌ లేదు. నెట్‌లో అర్హత సాధించడం కష్టమే కానీ, ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల అదే ప్రయత్నంలో ఉన్నవారు విజయవంతం కాగలరు. విలువ పరంగా చూస్తే నెట్‌కే అధిక ప్రాధాన్యం. నెట్‌కు సన్నద్ధమైతే సెట్‌లో అర్హత పొందడం సులువే.  


ముఖ్య వివరాలు..

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పొందడానికి వయసు నిబంధన లేదు. జేఆర్‌ఎఫ్‌ కోసం డిసెంబరు 1, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 28 (సాయంత్రం 5 గంటల వరకు). 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1150. ఓబీసీ (నాన్‌ క్రీమీ లేయర్‌), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.325.

పరీక్షలు: డిసెంబరు 6 నుంచి 22 వరకు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో అన్ని ముఖ్య ప్రాంతాల్లోనూ ఇవి ఉన్నాయి. 

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.ac.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Posted Date: 04-10-2023


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌