• facebook
  • whatsapp
  • telegram

అరుదైన కోర్సులు మెరుగైన కొలువులు!

టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక విభాగంలో ఇంజినీరింగ్‌ నైపుణ్యం ఉన్నవారి సేవలు సరిపోవడం లేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థికి ఎలక్ట్రికల్‌ పరిజ్ఞానం అవసరమవుతోంది. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానానికి సాంకేతిక సహకారాన్ని జోడించాల్సి వస్తోంది. బయాలజీ, ఇంజినీరింగ్‌లను కలిపి చదివితేనే అవకాశాలు అందుతున్నాయి. దీంతో సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ప్రత్యేక అవసరాల కోసం సరికొత్త బ్రాంచీలు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత ఐఐటీ, ఎన్‌ఐటీలు సహా రాష్ట్రస్థాయిలో కొన్ని కళాశాలల్లో వీటిని బోధిస్తున్నారు. ఈ వైవిధ్య కోర్సులు చదివినవారికి పరిశ్రమలు ప్రాధాన్యం ఇస్తున్నాయి

మెకట్రానిక్స్‌

మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఈ రెండింటి మేళవింపే మెకట్రానిక్స్‌. ఇందులో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌ కూడా ఉంటాయి. మొబైల్‌ ఫోన్లు, మోటార్‌ కార్లు, ఇండస్ట్రియల్‌ రోబోట్‌లు రూపొందించడానికి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అంశాల్లో ప్రావీణ్యం అవసరం. దీంతో తయారీరంగం చాలా వరకూ మెకట్రానిక్స్‌పై ఆధారపడుతోంది. అలాగే ఆటోమేషన్‌కూ ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా మెకట్రానిక్స్‌ చదివినవారికి అవకాశాలు విస్తరించాయి. ఫాక్స్‌కాన్‌, మారుతి లాంటి తయారీ సంస్థల్లో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెకట్రానిక్స్‌లో రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ సైతం ఉంటాయి. ఆటోమోటివ్‌లు, డిఫెన్స్‌, స్మార్ట్‌సిటీస్‌, ఈ-కామర్స్‌ల్లో రోబోటిక్స్‌ వినియోగం పెరిగింది. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రసిద్ధ సంస్థలు: నిట్‌ - వరంగల్‌, రవుర్కెలా; ఐఐటీ- పట్నా, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వంటివి ఈ కోర్సు అందిస్తున్నాయి.
 

నియామకాలు: హనీవెల్‌ ఆటోమేషన్‌, శాంసంగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ ఉత్పత్తులు తయారుచేసే సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.

ఎనర్జీ ఇంజినీరింగ్‌

భారత్‌లో ఎనర్జీ వినియోగం 2035 నాటికి ఏడాదికి 4.2 శాతం చొప్పున పెరుగుతుందని ఒక అంచనా. పరిశ్రమలు, ఇళ్లు, కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా విద్యుత్తు వినియోగం అనివార్యం. అందుకే విద్యుత్తు ఉత్పత్తి, నిల్వ, పంపిణీల గురించి చదువుకునే ఎనర్జీ ఇంజినీర్ల అవసరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బొగ్గు, నీరు, నూనెలు, సహజవాయువుల నుంచి శక్తిని సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోలార్‌ ఎనర్జీ ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ మనుగడ ఎనర్జీతో ముడిపడి ఉంది. ఈ విభాగంలో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇందులో చాలామంది కీలకమైన రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా, కొత్త మార్గాల్లో శక్తిని ఉత్పత్తి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెడుతున్నారు. దీంతోపాటు ఇప్పుడు ఉపయోగిస్తున్న శక్తిని మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేలా చూస్తున్నారు.

ప్రసిద్ధ సంస్థలు: దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఐఐటీ- బాంబే, దిల్లీ, ఖరగ్‌పూర్‌; యూపీఈఎస్‌ - డెహ్రాడూన్‌, విట్‌ వంటి సంస్థలు ఈ కోర్సు అందిస్తున్నాయి.

నియామకాలు: ఓఎన్‌జీసీ, స్లంబర్గర్‌, టోటల్‌ అండ్‌ కెర్న్‌ ఎనర్జీ, ఇతర విద్యుత్తు తయారీ, పంపిణీ సంస్థలు, చమురు కంపెనీలు ఎనర్జీ ఇంజినీర్లను నియమించుకుంటాయి.


 

ఫుడ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌

సైన్స్‌, ఇంజినీరింగ్‌ రెండింటి కలయికే ఫుడ్‌ టెక్నాలజీ. ఆహారాన్ని శుద్ధిచేసి, భద్రంగా ప్యాకెట్‌లో ఉంచడానికి ఇటు సైన్స్‌ అటు ఇంజినీరింగ్‌ రెండు అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. ప్రిజర్వేషన్‌, ప్రాసెసింగ్‌, ప్రిపరేషన్‌, ప్యాకేజింగ్‌, స్టోరేజ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఫుడ్‌ టెక్నాలజీలో కీలక దశలు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణాలతోసహా గ్రామాల్లోనూ ప్యాకెట్‌ పుడ్‌ తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం నెలకు సగటున ఒక వ్యక్తి గ్రామాల్లో రూ.113, పట్టణాల్లో రూ.236 బెవరేజెస్‌, రిఫ్రెష్‌మెంట్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కోసం వెచ్చిస్తున్నారు. శీతల పానీయాలు, చాక్‌లెట్లు, పాల ప్యాకెట్లు, పాల ఉత్పత్తులు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు ఫుడ్‌ టెక్నాలజీ కిందకే వస్తాయి. ఆహార పదార్థాలను శుభ్రపరచి, రుచిగా తయారుచేసి సాంకేతికత జోడించి వాటిని ప్యాక్‌ల్లో భద్రపర్చడమే ఫుడ్‌ టెక్నాలజీ. భారత ఆహార మార్కెట్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వాటా 30 శాతానికి చేరుకున్నట్లు ఇండియన్‌ బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) చెబుతోంది. దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆవిర్భవిస్తోంది. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు, వృద్ధి ఈ అన్ని విభాగాల్లో కలిపి చూసుకుంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ దేశంలో అయిదో స్థానంలో ఉంది. దీంతో ఈ పరిశ్రమకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌), నాణ్యత మదింపు (క్వాలిటీ కంట్రోల్‌), న్యూట్రిషన్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్‌ కోర్సులతోనే ఈ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ- ముంబయి, కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ- పర్భనీ, సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - మైసూర్‌, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

నియామకాలు: ఐటీసీ, పార్లే, నెస్లే, అమూల్‌, బ్రిటానియా, ఇతర అగ్రోటెక్‌, ఫుడ్‌ కంపెనీలు నియమకాలు జరుపుతాయి.


 

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌..

సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తదితరాలతోపాటు రోగ నిర్ధారణ, వైద్యంలో ఉపయోగించే పలు పరికరాలను బయో మెడికల్‌ ఇంజినీర్లు తయారు చేస్తారు. వీటిని రూపొందిచడానికి ఒక్క ఇంజినీరింగ్‌ ప్రావీణ్యం సరిపోదు. మెడిసిన్‌, బయాలజీ కూడా తెలియాలి. అందుకే బయాలజీ, ఇంజినీరింగ్‌లను కలిపి బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ సృష్టించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, బయాలజీ, మెడిసిన్‌ విభాగాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ సూత్రాలను బయాలజీ, మెడిసిన్‌కు అన్వయించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పరికరాలను సృష్టించడమే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌. తక్కువ ఖరీదుతో, నాణ్యమైన, మరింత మెరుగైన పరికరాలను తయారుచేయడం బయోమెడికల్‌ ఇంజినీర్ల విధి. భారత ఆరోగ్య పరిశ్రమ 2020 నాటికి 280 బిలియన్‌ డాలర్లు చేరుతుందని అంచనా. ఇందులో వైద్యులు, ఆసుపత్రులతోపాటు బయో మెడికల్‌ ఇంజినీర్ల పాత్ర కూడా కీలకమే.

ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ - బాంబే, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, వారణాసి (బీహెచ్‌యూ); ఎంఎన్‌ఎన్‌ఐటీ - అలహాబాద్‌, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీవీఆర్‌ఐటీ-హైదరాబాద్‌.

నియామకాలు: సీమెన్స్‌ హెల్దీనీర్స్‌, ఎల్‌అండ్‌టీ, ఫిలిప్‌ హెల్త్‌ కేర్‌, వైద్య పరికరాల తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


 

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌

కొన్ని రంగాల్లో అభివృద్ధి కాలుష్యానికి కూడా కారణమవుతోంది. దీంతో పర్యావరణ హితమైన అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయి. ఆ బాధ్యత ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్లదే. పరిశ్రమల నుంచి తక్కువ వ్యర్థాలు, కాలుష్యం వెలువడేలా పలు పరిష్కారాలను వీరు చూపాలి. వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన ఉత్పత్తులను సృష్టించే దిశగా ఆలోచించాలి. కొత్తగా ఏ ప్రాజెక్టు, పరిశ్రమ మొదలుపెట్టాలన్నా పర్యావరణ అనుమతులు తప్పనిసరి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఆడిటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ మొదలైన ఉద్యోగాలు పబ్లిక్‌, ప్రైవేటు రంగాల్లో ఉన్నాయి. ప్రాసెస్‌ డిజైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌ హ్యాండ్లింగ్‌, ఆపరేషన్స్‌ మెయింటెనెన్స్‌ ఇవన్నీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి ముఖ్యమైన దశలు.

ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ - బాంబే, మద్రాస్‌, రూర్కీ, ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌; ధన్‌బాద్‌ (ఐఎస్‌ఎం), వారణాసి (బీహెచ్‌యూ), నిట్‌ - సూరత్కల్‌, తిరుచిరాపల్లి, నాగ్‌పూర్‌, వరంగల్‌, అలహాబాద్‌, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలు ఈ కోర్సు అందిస్తున్న వాటిలో ప్రధానమైనవి

నియామకాలు: ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాలుష్య నియంత్రణ మండళ్లు, నీటి పంపిణీ, నిర్వహణ సంఘాలు, మున్సిపాల్టీలు, కన్సల్టింగ్‌, అడ్వైజరీ సంస్థలు, పర్యావరణ అనుమతులతో ముడిపడి ఉన్న కంపెనీలు అంటే గనులు, రహదారులు, మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్టులు, పర్యావరణంలో సేవలందించే ఎన్జీవోలు ఇలా పలు చోట్ల ఉద్యోగాలు ఉంటాయి

Posted Date: 16-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌