‣ నోటిఫికేషన్ విడుదల
మనదేశ ఫార్మసీ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఫార్మసిస్టుల సేవలెంతో కీలకం. స్పెషలైజేషన్లో పట్టున్నవారు ఔషధరంగంలో రాణించగలరు. ఇందుకోసం మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ఉపయోగపడుతుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) దీనికి దారి చూపుతుంది. ఇందులో మంచి ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో తమకు నచ్చిన స్పెషలైజేషన్లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ) చదువుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జీప్యాట్-2023 పూర్తి వివరాలు..
భారత్ ఫార్మా హబ్గా రూపొందుతోంది. శరవేగంగా విస్తరిస్తోన్న ఈ పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. నాణ్యమైన ఔషధాలు, కొత్త ఫార్ములాల రూపకల్పనలో మేటి ఫార్మసిస్టుల సేవలెంతో అనివార్యం. అందువల్ల ఉన్నత విద్య అభ్యసించినవారు ఆకర్షణీయ వేతనంతో అవకాశాలు సొంతం చేసుకోవడం తేలికవుతోంది. మందుల పరిశ్రమలతోపాటు ఆసుపత్రులు, గొలుసుకట్టు ఔషధాల విక్రయ సంస్థల్లోనూ ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఉన్నత విద్యతో బోధన రంగంలోనూ రాణించవచ్చు.
దేశంలో దాదాపు 870 ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీలో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్ ఉపయోగపడుతుంది. జామియా హమ్దార్డ్, పంజాబ్, బాంబే ఫార్మసీ కాలేజీ, బిట్స్ పిలానీ లాంటి ఉత్తమ విద్యా సంస్థల్లో ఎం.ఫార్మసీ కోర్సులో చేరడానికి జీప్యాట్ కీలకం. దేశంలో ఫార్మా విద్యారంగంలో మేటి సంస్థగా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ (నైపర్)ల్లో ఎం.ఎస్. సీటు పొందాలంటే అవి నిర్వహించే పరీక్ష రాయాలి. జీప్యాట్లో అర్హత సాధించినవారికే ఆ అవకాశం ఉంటుంది.
జీప్యాట్లో అర్హత సాధించినవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కాలేజీలో ఎం.ఫార్మసీలో చేరితే రెండేళ్లపాటు ప్రతి నెల రూ.12,400 ఉపకార వేతనం అందుకోవచ్చు. ఎం.ఫార్మసీ తర్వాత పీహెచ్డీలో చేరడానికీ జీప్యాట్ స్కోరు ఉపయోగపడుతుంది. అందువల్ల వీరు పీహెచ్డీ ప్రవేశపరీక్షకు ప్రత్యేకంగా హాజరు కానవసరం లేదు. ప్రభుత్వరంగ పరిశోధన సంస్థలు జీప్యాట్ స్కోరుతోనే అభ్యర్థులను ఎంపిక చేసి ఉపకారవేతనం అందిస్తున్నాయి. అనేక బహుళజాతి ఫార్మా సంస్థలు, ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థలు ఉద్యోగాలివ్వడానికీ జీప్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ప్రశ్నపత్రం ఇలా...
ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక (మల్టిపుల్ చాయిస్) తరహాలో అడుగుతారు.
మొత్తం 125 ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నపత్రం 500 మార్కులకు ఉంటుంది. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ఆయా విభాగాలవారీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ- 38, ఫార్మాస్యూటిక్స్- 38, ఫార్మకాగ్నసీ- 10, ఫార్మకాలజీ- 28, ఇతర సబ్జెక్టులు- 11 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
స్పెషలైజేషన్లు...
రెండేళ్ల వ్యవధితో పూర్తయ్యే ఎంఫార్మసీలో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎక్కువ సంస్థల్లో ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాకాగ్నొసీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ ఎఫైర్స్...తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఫార్మసీ తర్వాత, పరిశోధన, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారు పీహెచ్డీ దిశగా అడుగులేయవచ్చు.
దేశంలో టాప్-10 ఫార్మసీ కళాశాలలు
(ఎన్ఐఆర్ఎఫ్-2022 ర్యాంకింగ్ ప్రకారం)
1. జామియా హమ్దార్డ్, న్యూదిల్లీ
2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్
3. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్
4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, మొహాలీ
5. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ
6. జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ
7. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై
8. జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూరు
9. మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఉడిపి
10. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, గాంధీనగర్
తెలుగు రాష్ట్రాల్లో (టాప్-100లో ఉన్నవి)
‣ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్ 2
‣ కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ 44
‣ గీతం, విశాఖపట్నం 49
‣ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు 51
‣ శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, భీమవరం 54
‣ అనురాగ్ యూనివర్సిటీ, హైదరాబాద్ 58
‣ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 66
‣ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, నర్సాపూర్ 67
‣ శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చిత్తూరు 68
‣ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, అనంతపురం 71
‣ సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రంగారెడ్డి 72
‣ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్, గుంటూరు 77
‣ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి 89
‣ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ,
హైదరాబాద్ 93
‣ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మంగళగిరి 100
101-125 మధ్యలో నిలిచినవి...
‣ మల్లారెడ్డి సికింద్రాబాద్,
‣ సెవెన్ హిల్స్ తిరుపతి,
‣ శ్రీ విద్యా నికేతన్ రంగంపేట్,
‣ సెయింట్ పీటర్స్ వరంగల్
సన్నద్ధత ఎలా?
జీప్యాట్లో మెరుగైన స్కోరు సాధించడానికి బీఫార్మసీ పాఠ్యపుస్తకాలే ప్రామాణికం. పాఠ్యాంశాలపై గట్టి పట్టున్నవారు ఎక్కువ మార్కులు పొంది, అత్యుత్తమ సంస్థలో సంస్థలో సీటు పొందవచ్చు. పాఠ్యాంశాల్లో...ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోఫార్మాస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
‣ ఫార్మాస్యూటిక్స్లోని ఇతర అంశాలతోపాటు ఫిజికల్ ఫార్మసీ, డిస్పెన్సింగ్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీలకు సంబంధించిన పాఠ్యాంశాలు క్షుణ్నంగా చదవాలి.
‣ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, మెడిసినల్, బయో, ఫిజికల్ కెమిస్ట్రీల్లోని ముఖ్యాంశాలపై శ్రద్ధ చూపించాలి.
‣ ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్లో వెట్ కెమిస్ట్రీలోని వివిధ అంశాలతోపాటు ఆధునిక ఎనలిటికల్ విధానాలు, పరికరాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి.
‣ ఫార్మకాలజీలో జనరల్ ఫార్మకాలజీతోపాటు, పాథో ఫిజియాలజీ, టాక్సికాలజీ, సెంట్రల్ నర్వస్ సిస్టంలపై దృష్టి కేంద్రీకరించాలి.
‣ ఫార్మకాగ్నసీకి సంబంధించి క్రూడ్ డ్రగ్స్, వాటి నాణ్యత విశ్లేషణ, పిండి పదార్థాలు, వాలటైల్ ఆయిల్స్, లిపిడ్స్లపై ప్రత్యేక శ్రద్ధ పెడితే విజయానికి మార్గం సుగమం అవుతుంది.
పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. అందులో వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల తీరును గమనించి పరీక్ష కోణంలో అధ్యయనం కొనసాగించాలి. అలాగే సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. నైపర్ పాత ప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి. జీప్యాట్ సన్నద్ధతతోనే నైపర్లు నిర్వహించే పరీక్షనూ ఎదుర్కోవచ్చు.
ముఖ్య వివరాలు
అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ పురుషులకు రూ.2200, మిగిలిన అందరికీ రూ.1100.
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 6 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
వెబ్సైట్: https://gpat.nta.nic.in
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!