• facebook
  • whatsapp
  • telegram

అత్యున్నత సైన్స్‌ కోర్సుల వేదిక.. ఐసర్‌

ఐఏటీ - 2023 నోటిఫికేషన్‌ విడుదల

సైన్స్, మ్యాథ్స్‌ కోర్సుల్లో పరిశోధనల దిశగా విద్యార్థులను సంసిద్ధులను చేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక సంస్థలను నెలకొల్పారు. ఇలా ఏర్పాటైన ప్రసిద్ధ సంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు ముఖ్యమైనవి. ఉన్నత విద్య, పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ సంస్థలు అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభావంతులు, కేవీపీవైకి ఎంపికైనవారినీ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఇలా అవకాశం  వచ్చినవారు చదువుకుంటూ ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, బరంపురం, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్‌లు నెలకొల్పారు. నాణ్యమైన బోధన, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి సౌకర్యాలు ఈ సంస్థల్లో పొందవచ్చు. ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉండే బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్‌ అండ్‌ డీ.. సంస్థలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్‌ కోర్సులు, ఎర్త్‌సైన్స్‌లు అభ్యసిస్తారు.ఆరు నెలలకు ఒకటి చొప్పున కోర్సు మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి. 

కోర్సులివీ..

బీఎస్‌ - ఎంఎస్‌: బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌ / ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, జియలాజికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌. 

బీఎస్‌ కోర్సులు (భోపాల్‌లోనే): ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), ఎకనామిక్స్‌ సైన్సెస్‌. వ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. ఎకనామిక్స్‌ కోర్సులో చేరినవారు బీఎస్‌ తర్వాత మరో ఏడాది చదువు పూర్తిచేసుకుంటే ఎంఎస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. 

బీఎస్‌-ఎంఎస్‌ సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం - 200, భోపాల్‌ - 240, కోల్‌కతా - 250, మొహాలీ - 250, పుణె - 288, తిరువనంతపురం - 320, తిరుపతి - 200. ఏడు సంస్థల్లోనూ కలిపి 1748 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు భోపాల్‌లో బీఎస్‌: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో 60, ఎకనామిక్‌ సైన్సెస్‌లో 30 సీట్లు ఉన్నాయి. 

ప్రవేశ మార్గాలు 

మొత్తం 3 మార్గాల్లో ప్రవేశాలు ఉంటాయి. అవి.. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఆప్టిట్యూడ్‌ టెస్టు. 

జేఈఈ ఛానెల్‌లో ప్రవేశం ఆశించేవారు 2023 అడ్వాన్స్‌డ్‌లో కామన్‌ లేదా సంబంధిత కేటగిరీలో 15,000లోపు ర్యాంకు పొందాలి. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపినవారితో, కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజనకు ఎంపికైనవారితో 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. 

మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్‌ టెస్టు ద్వారా నింపుతారు.

ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే ఆప్టిట్యూడ్‌లో ప్రతిభ చూపినవారితో వాటినీ భర్తీ చేస్తారు. కోరుకున్న విధానంలో ప్రవేశం పొందడానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష సన్నద్ధత 

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. 

1. దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. అందువల్ల వాటిని శ్రద్ధగా చదవాలి. 

2. ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవాలి. 

3. సిలబస్‌ ప్రకారం పాఠ్యాంశాలు బాగా చదివిన తర్వాత ఐఐఎస్‌ఈఆర్‌ పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. వీటిని వెబ్‌సైట్‌లో ఉంచారు. 

4. ఎక్కువ ప్రశ్నలు వస్తున్న చాప్టర్లకు అధిక ప్రాధాన్యమివ్వాలి. అలాగే ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనించి సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.

5. ఎంసెట్‌/ ఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్, బిట్‌శాట్‌.. తదితర ప్రశ్నపత్రాల అధ్యయనమూ ఉపయోగపడతుంది. 

6. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై శ్రద్ధ పెట్టాలి. 

7. రుణాత్మక మార్కులున్నందున అసలు ఏ మాత్రమూ అవగాహన లేని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.

8. ఐఐఎస్‌ఈఆర్‌ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు అందుబాటులో ఉంటుంది. సన్నద్ధత పూర్తయిన తర్వాత దాన్ని రాసి, జవాబులు సమీక్షించుకోవాలి.

ముఖ్య సమాచారం..

అర్హత: ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుతో 2022 లేదా 2023లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55) శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఆప్టిట్యూడ్‌ టెస్టు, కేవీపీవై ఛానెళ్లలో మే 25 వరకు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో జూన్‌ 25 నుంచి జూన్‌ 30 వరకు.  

దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000 

ఆప్టిట్యూడ్‌ పరీక్ష: జూన్‌ 17న. 

వెబ్‌సైట్‌: https://iiseradmission.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌లో సందేహాలను నివృత్తి చేసుకుందాం..

‣ ఐసెట్‌ ర్యాంకుకు మెరుగైన మార్గం

‣ అటామిక్‌ ఎనర్జీలో ఉద్యోగాలు

‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు

‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..

Posted Date: 21-04-2023


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌