• facebook
  • whatsapp
  • telegram

వేల కొలువుల‌కు ప‌ది చాలు

ఏ కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ విద్యార్థుల అంతిమ లక్ష్యం ఉద్యోగమే. పలు కొలువులకు పెద్ద డిగ్రీలతో పనిలేదు. పదో తరగతి అర్హతతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వీటిలో చేరిన తర్వాత అనుభవం, అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థాయిని చేరుకునే మార్గాలూ ఎక్కువే. టెన్త్‌ అర్హతతో ఉన్న పోస్టుల్లో యూనిఫారం ఉద్యోగాలే ఎక్కువ. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, కోస్టుగార్డు, రైల్వే, పోస్టల్, ఆర్‌బీఐ, ఆర్టీసీ...తదితర సంస్థల్లో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులు పోటీ పడవచ్చు. పది అర్హతతో ఉన్న ఉద్యోగాల వివరాలు...

ఆర్థిక పరిస్థితులు సహకరించనివాళ్లు, ఉన్నత చదువులపై ఆసక్తి లేనివారు, తక్కువ వ్యవధిలోనే కెరీర్‌లో స్థిరపడాలని ఆశించేవారు పదో తరగతి విద్యార్హతతో ఉన్న పలు పోస్టులకు ప్రయత్నించవచ్చు. అయితే యూనిఫారం ఉద్యోగాలకు కనీసం 17 ఏళ్లయినా ఉండాలి. అదే సివిల్‌ పోస్టులకైతే పద్దెనిమిదేళ్లు నిండాలి. పది పూర్తయినవారికి అంత వయసు ఉండదు కాబట్టి చదువు ఆపేయకుండా ఇంటర్, ఐటీఐ, డిప్లొమా...ఇలా ఏదో ఒక కోర్సులో చేరడమే మంచిది. ఒకవేళ రెగ్యులర్‌ విధానంలో చదవడం వీలు కాకపోతే ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పది తర్వాత ఉన్న ఉద్యోగాలకు నిర్వహిస్తోన్న పరీక్షల్లో ఉమ్మడి అంశాల నుంచే ప్రశ్నలు ఉంటాయి. గణితంలో ప్రాథమికాంశాలు, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు.

ఎస్సెస్సీతో...

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టుల భర్తీకి దాదాపు ఏటా ప్రకటన విడుదలచేస్తోంది. ఒక్కో విడతలోనూ యాభై వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ పరీక్షతోనే లభిస్తున్నాయి. ఇందులో ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇంè్ర[స్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ల్లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. ఈ పోస్టులకు వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు తప్పనిసరి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ...మొదలైనవి కలుపుకుని సుమారు రూ.40 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. వీరు ఉన్నత చదువులు, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై హోదాలను సొంతం చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌

కేంద్రంలో వివిధ విభాగాలకు అవసరమైన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులను ఎస్సెస్సీ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులు ఉంటాయి.

ఆర్‌బీఐలో
 

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులకు పది ఉత్తీర్ణులు అర్హులు. ఇందులో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్‌ అనే మూడు రకాల పోస్టులు ఉంటాయి. వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా అసిస్టెంట్‌ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి.

ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌... కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్, వాషర్‌మన్, బార్బర్, వాటర్‌ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టుల భర్తీకి విడిగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. పురుషులు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు పదో తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తారు. అలాగే బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు.

రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఎత్తు ఉండాలి.

కండక్టర్‌: ఏపీఎస్‌ / టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తున్నారు.
 

డ్రైవర్‌: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ ... మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికీ ఈ లైసెన్స్‌ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు పోటీ పడవచ్చు.

గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌): బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టు మెన్, మెయిల్‌ గార్డు, క్లర్క్‌...మొదలైన పదోన్నతులు పొందవచ్చు.

రైల్వేల్లో...

పదో తరగతి విద్యార్హతతో రైల్వేల్లో పలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటికోసం మహిళలు, పురుషులు పోటీ పడవచ్చు. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయింటైనర్‌తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం వీటిని లెవెల్‌-1 (ప్రారంభ స్థాయి) ఉద్యోగాలగా పరిగణిస్తున్నారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. కరవు భత్యం, ఇంటిఅద్దె..మొదలైనవాటితో సుమారు రూ.ముప్సై వేల వరకు మొదటి నెల నుంచే వేతనం అందుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోస్టులను రాతపరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు.

పోస్టల్‌

పోస్టల్‌ శాఖలో పోస్టు మ్యాన్, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులు ఉంటాయి. ఎంపికైనవారు సుమారు రూ.30 వేలు వేతనం అందుకోవచ్చు.

ఆర్మీ

సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హులు. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తుతోపాటు 50 కి.గ్రా. బరువు అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. తప్పనిసరి.

సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌: చెఫ్, వాషర్‌ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్‌ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన పోస్టులను సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో భర్తీ చేస్తారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, కనీసం 50 కి.గ్రా. బరువు తప్పనిసరి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి.

ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ఏటా నియామకాలు (రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు) జరుగుతాయి. ఈ ఉద్యోగంలోకి చేరినవారు తదనంతరం సిపాయ్, నాయక్, హవల్దార్‌ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, దేహదార్ఢ్య పరీక్షలు, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో హౌస్‌ కీపర్, మెస్‌ కీపర్, గుర్రాల పర్యవేక్షణ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. (వీటికి ఎనిమిదో తరగతి విద్యార్హత). ఏ పోస్టుకి ఎంపికైనప్పటికీ శిక్షణ తర్వాత రూ.40 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

నేవీ

చెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలను మెట్రిక్‌ రిక్రూట్‌మెంట్‌ (ఎంఆర్‌) ద్వారా నేవీలో భర్తీ చేస్తున్నారు. పదో తరగతి విద్యార్హతతో 17 -21 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. రాత పరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) అందుతుంది. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు.

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: పదో తరగతి విద్యార్హతతో ఈ విభాగంలో చేరవచ్చు. ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.

ఎయిర్‌ ఫోర్స్‌

గ్రూప్‌ వై మ్యుజీషియన్‌: ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/ వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 17-25 ఏళ్లలోపువాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు ఎయిర్‌ ఫోర్స్‌ బ్యాండ్‌లో పనిచేస్తారు. మొదట రాత పరీక్ష తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షల అనంతరం ఎంపిక చేస్తారు.

కోస్ట్‌ గార్డ్‌

ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టులకు ఎంపికైనవారిని డొమస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. పురుషులే అర్హులు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. ఈ విధానంలో ఎంపికైనవారు పదోన్నతులతో లెవెల్‌ 8 స్థాయికి చేరుకోవచ్చు.

Posted Date: 11-03-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌