‣ అజీంప్రేమ్జీ వర్సిటీ ప్రకటన విడుదల
‣ పేద విద్యార్థులకు ఉచితంగా విద్య
దేశంలోని మేటి ప్రైవేటు విద్యాసంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఒకటి. సామాజిక స్పృహ పెంచాలనే లక్ష్యంతో ఇక్కడి కోర్సులను రూపొందించారు. ఈ సంస్థలో నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులతోపాటు బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్ఎల్ఎం చదువులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిలో ముందస్తు ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా తీసుకుంటారు. పేదలకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు!
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అత్యున్నత వాతావరణంలో అందించి, వారిలో సామాజిక స్పృహ పెంచడానికి అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. నిష్ణాతులైన బోధన సిబ్బంది, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటి మేళవింపుతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. సామాజిక అవసరాలు నెరవేరేలా, సమాజానికి నాణ్యమైన మానవ వనరులు అందించే లక్ష్యంతో కోర్సులు రూపొందించారు. సైన్సెస్, ఆర్ట్స్ హ్యుమానిటీస్, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఉమ్మడి కరిక్యులమ్తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్ (కంపల్సరీ), ఎలెక్టివ్లు ఉంటాయి. జులై నుంచి తరగతులు మొదలవుతాయి. కోర్సులన్నీ ఫుల్ టైం రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు.
ఫీజు
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్ ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే. రూ.4-8 లక్షల లోపు ఉంటే 75 శాతం, 8-10 మధ్య 50 శాతం, 10-15 మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది. పీజీ అన్ని కోర్సులకూ రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు చెందినవారికి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2 నుంచి 4 లక్షల లోపు ఉంటే 75 శాతం, 4-6 మధ్య ఉన్నవారికి 50 శాతం, 6-7 మధ్య ఉంటే 25 శాతం ఫీజు తగ్గిస్తారు. రుణ సౌకర్యం ఉంది. మూడేళ్ల యూజీ కోర్సులకు ట్యూషన్, వసతి మొత్తం ఫీజు సుమారు రూ.9 లక్షలు, అదే నాలుగేళ్ల కోర్సులకైతే రూ.12 లక్షలు. రెండేళ్ల పీజీ కోర్సులకు ఫీజు, వసతి నిమిత్తం మొత్తం రూ.3.68 లక్షలు చెల్లించాలి. ఎల్ఎల్ఎంకు రూ.1.84 లక్షలు. అన్ని కోర్సులకు ఆహారానికి నెలకు రూ. 5000 నుంచి 6000 వరకు వెచ్చించాలి.
ప్లేస్మెంట్లు
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఎన్జీవోలు, పరిశోధన సంస్థలు, సీఎస్ఆర్ విభాగాలు, ఆంత్రప్రెన్యూర్, విద్యా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. చాలా కంపెనీలు కోర్సు చివర్లో నియామకాలు చేపడుతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సులు చదివినవారికి రూ.30 నుంచి 35 వేల నెల వేతనంతో పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తమే వెచ్చిస్తున్నాయి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 18 (పీజీ రెగ్యులర్ రౌండ్లో ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఉంది)
పరీక్ష తేది: యూజీ, పీజీ రెండు కోర్సులకూ జనవరి 2.
వెబ్సైట్: https://azimpremjiuniversity.edu.in
ఇవీ కోర్సులు
యూజీలో...
బీఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిస్టరీ (మూడేళ్లు)
బీఎస్సీ: ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ (మూడేళ్లు)
బీఎస్సీ బీఎడ్: బయాలజీ, ఫిజిక్స్, మేథమ్యాటిక్స్ (నాలుగేళ్లు)
అర్హత: సంబంధిత గ్రూప్లో 50 శాతం మార్కులతో 2021లో ఇంటర్ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు: 19 ఏళ్లలోపు ఉండాలి.
పీజీలో..
ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్ (రెండేళ్లు)
ఎల్ఎల్ఎం: లా అండ్ డెవలప్మెంట్ (ఏడాది వ్యవధి కోర్సు)
అర్హత: ఎకనామిక్స్ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్టును చదివుండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నా అర్హులే. ఎల్ఎల్ఎం: లా అండ్ డెవలప్మెంట్ కోర్సులోకి ఎల్ఎల్బీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం విద్యార్థులు అర్హులు.
యూజీ ప్రవేశపరీక్ష
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్ విభాగంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు. తప్పుగా గుర్తించినదానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. మరో విభాగంలో ఎస్సే రైటింగ్/ డేటా ఎనాలిసిస్/ ప్రాబ్లమ్ సాల్వింగ్ల్లో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఏదో ఒక విభాగం ప్రశ్నకు సమాధానం రాయాలి. వ్యవధి 45 నిమిషాలు.
పీజీ ప్రవేశపరీక్ష
ఎకనామిక్స్ మినహా మిగిలిన ఎంఏ, ఎల్ఎల్ఎం కోర్సులు అన్నింటికీ ప్రవేశపరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్-1లో బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్ కాంప్రహెన్షన్ 15, జనరల్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎబిలిటీ 15, సోషల్ అవేర్నెస్ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్ -2లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఈ విభాగం వ్యవధి ఒక గంట. ఎంఏ ఎడ్యుకేషన్ ఎంచుకున్నవారికి పార్ట్ 2 ప్రత్యేకంగా ఉంటుంది. దీని వ్యవధి 45 నిమిషాలు. ఎంఏ ఎకనామిక్స్ అభ్యర్థులకు పార్ట్ ఎలో ఆ సబ్జెక్టుకు చెందిన 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. రెండో పార్ట్లో గంట వ్యవధిలో వ్యాసం రాయాలి.