• facebook
  • whatsapp
  • telegram

ప్రేమ్‌జీ సంస్థల్లో ప్రతిష్ఠాత్మక కోర్సులు!

ఉచిత విద్య, వసతి, భోజనం

నాణ్యమైన విద్యను సామాజిక దృక్పథంతో, లాభాపేక్ష లేకుండా అందిస్తోన్న సంస్థల్లో అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విశిష్టమైనది. ఈ సంస్థ.. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అందిస్తోంది. వాటిలో రెగ్యులర్‌ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు. ప్రతిభావంతులైన పేదలు ఉచితంగా విద్యతోపాటు వసతి, భోజనం పొందవచ్చు.  

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారిలో సామాజిక స్పృహ పెంచడానికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఎన్నో ఏళ్ల నుంచీ కృషి చేస్తోంది. నిష్ణాతులైన బోధన సిబ్బంది, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటి మేళవింపుతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. భోపాల్‌లోనూ మరో క్యాంపస్‌ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవసరాలు నెరవేరేలా, సమాజానికి నాణ్యమైన మానవ వనరులు అందించే విధంగా ఈ సంస్థ కోర్సులు రూపొందించింది. సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఉమ్మడి కరిక్యులమ్‌తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్‌ (కంపల్సరీ), ఎలెక్టివ్‌లు ఉంటాయి. కోర్సులన్నీ ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు.   

ఇవీ కోర్సులు

యూజీ

‣ బీఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిస్టరీ, సోషల్‌ సైన్స్‌.  

బీఎస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ సస్టెయినబిలిటీ.  

బీఎస్సీ బీఎడ్‌: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌.

అర్హత: సంబంధిత గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు 21 ఏళ్లలోపు ఉండాలి.   

పీజీ 

ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్, ఎకనామిక్స్‌ (రెండేళ్లు)

ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌ మెంట్‌ (ఏడాది వ్యవధి కోర్సు)

అర్హత: ఎకనామిక్స్‌ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్టును చదివుండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులోకి ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం కోర్సు విద్యార్థులు అర్హులు. 

కొత్తగా ప్రారంభమవుతోన్న భోపాల్‌ క్యాంపస్‌లో.. బీఏ హిస్టరీ, బీఎస్సీ బయాలజీ, ఎంఏ ఎడ్యుకేషన్, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులు ఉన్నాయి. 

యూజీ పరీక్షలో..

బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్‌ విభాగంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మరో విభాగంలో ఎనలిటికల్‌ రైటింగ్‌/ కాంటెక్స్టువల్‌ రైటింగ్‌ల్లో 2వ్యాసాలు రాయాలి. వ్యవధి గంట. 

పీజీ పరీక్షలో..

ఎకనామిక్స్‌ మినహా మిగిలిన ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అన్నింటికీ పరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో 2 విభాగాలు. పార్ట్‌-1లో బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 15, జనరల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 15, సోషల్‌ అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-2లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఈ విభాగం వ్యవధి ఒక గంట. ఎంఏ ఎడ్యుకేషన్‌ ఎంచుకున్నవారికి పార్ట్‌-2 ప్రత్యేకంగా ఉంటుంది. దీని వ్యవధి 45 నిమిషాలు. ఎకనామిక్స్‌ ఎంచుకున్నవారికి మైక్రో, మ్యాక్రో, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ల నుంచి 10 చొప్పున 30 ప్రశ్నలు వస్తాయి. అలాగే వీరు 2 వ్యాసాలు రాయాలి. మొత్తం వ్యవధి 2:30 గంటలు.

రాయితీ ఇలా..

బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే. వార్షికాదాయం రూ.4-8 లక్షల లోపు ఉంటే 75 శాతం, రూ.8-10 లక్షల మధ్య 50 శాతం, రూ.10-15 లక్షల మధ్య ఉంటే 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ.

పీజీ అన్ని కోర్సులకూ రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉంటే పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2 నుంచి 4 లక్షల లోపు ఉంటే 75 శాతం, 4-6 లక్షల మధ్య ఉన్నవారికి 50 శాతం, 6-7 లక్షల మధ్య ఉంటే 25 శాతం ఫీజు తగ్గిస్తారు. రుణ సౌకర్యం ఉంది. 

యూజీ కోర్సులకు ట్యూషన్, వసతి మొత్తం ఫీజు సుమారు రూ.12 లక్షలు. రెండేళ్ల పీజీ కోర్సులకు.. ఫీజు, వసతి నిమిత్తం మొత్తం రూ.4 లక్షలు చెల్లించాలి. ఎల్‌ఎల్‌ఎంకు రూ.2 లక్షలు. అన్ని కోర్సులకు ఆహారానికి నెలకు రూ.5000 నుంచి రూ.6000 వరకు వెచ్చించాలి.  

ప్లేస్‌మెంట్లు: 

ఎన్‌జీవోలు, పరిశోధన సంస్థలు, సీఎస్‌ఆర్‌ విభాగాలు, ఆంత్రప్రెన్యూర్, విద్యా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. పలు కంపెనీలు కోర్సు చివర్లో నియామకాలు చేపడతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సులు చదివినవారికి రూ.4.5 లక్షల వార్షిక వేతనంతో పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తమే వెచ్చిస్తున్నాయి. 

దరఖాస్తుకు చివరి తేదీ: పీజీ కోర్సులకు ఫిబ్రవరి 12, యూజీలకు మార్చి 9.

పరీక్ష తేదీ: పీజీకి మార్చి 12, యూజీకి ఏప్రిల్‌ 9 

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in/

ఆన్‌లైన్‌లో..

ఈ సంస్థ ఆన్‌లైన్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు వీటిలోనూ చేరవచ్చు. దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

డిప్లొమా: ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్, లెర్నింగ్‌ డిజేబిలిటీ.

పీజీ డిప్లొమా: రిసెర్చ్‌ ఫర్‌ సోషల్‌ యాక్షన్, డెవలప్‌మెంట్‌ లీడర్‌షిప్‌.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ విద్యార్థులకు ఏఐ ఎలా ఎందుకు?

‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్‌!

‣ చివరివరకూ అంతే ఉత్సాహంగా..

‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ‘మ్యాట్‌’!

‣ డెక‌రేష‌న్ల‌కు కొన్ని కోర్సులు!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

Posted Date: 08-02-2023


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌