* పలురకాల కోర్సులు, ప్రవేశ పరీక్షలు
విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న చదువుల్లో న్యాయవిద్య ఒకటి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తైన తర్వాత లా కోర్సుల్లో చేరిపోవచ్చు. జాతీయ స్థాయిలో పలు సంస్థలు న్యాయవిద్యకు పేరొందాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మేటి సంస్థలెన్నో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఏపీ లాసెట్, తెలంగాణ లాసెట్ ప్రకటనలు వెలువడ్డాయి.
ప్రస్తుత పరిణామాలు న్యాయవిద్య పరిధిని విస్తరిస్తున్నాయి. సమస్యలు ఏవైనప్పటికీ పరిష్కారం చూపేది న్యాయవిద్య అభ్యసించినవాళ్లే. ప్రశ్నించే తత్వం, న్యాయం చేయాలనే తపన, సమాజంలో మార్పు దిశగా ప్రయత్నం చేయాలనుకున్నవారు లా బాట పట్టవచ్చు. ఇంటర్ తర్వాత నేరుగా ఇంటిగ్రేటెడ్ విధానంలో డిగ్రీ, ఎల్ఎల్బీ రెండూ ఒకేసారి చదువుకోవచ్చు. అలా వద్దనుకుంటే ఏదైనా డిగ్రీ పూర్తిచేసి, ఆ తర్వాత ఎల్ఎల్బీలో చేరవచ్చు. అయితే న్యాయవిద్యలో ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థులు డిగ్రీతో కలిపి ఎల్ఎల్బీలో చేరడమే మంచిది. ఇలా చేస్తే ఐదేళ్లకే కోర్సు పూర్తవుతుంది. అదే డిగ్రీ తర్వాత మొత్తం ఆరేళ్లు (విడిగా డిగ్రీకి మూడేళ్లు, ఎల్ఎల్బీకి మరో మూడేళ్లు) పడుతుంది. ఇంటర్ తర్వాత చేరడం వల్ల ఏడాది సమయం ఆదాతోపాటు సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు. జాతీయ, ప్రాంతీయ సంస్థలు డిగ్రీతో ఎల్ఎల్బీ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కోరుకున్న డిగ్రీతో...
బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీఎస్డబ్ల్యు...వీటిలో కోరుకున్న కాంబినేషన్తో ఎల్ఎల్బీ చదువుకోవచ్చు. ఎక్కువ సంస్థల్లో బీఏ ఎల్ఎల్బీ కోర్సు అందుబాటులో ఉంటోంది. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ వీటిలో లా సిలబస్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. బీబీఏలో మేనేజ్మెంట్, బీఏలో సోషల్ సైన్సెస్, బీఎస్సీలో సైన్స్ అంశాలు, బీఎస్డబ్ల్యూలో సోషల్ వర్కుకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఐదేళ్లలో పది సెమిస్టర్లతో డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య (ఎల్ఎల్ఎం) దిశగా అడుగులేయవచ్చు. ఆరేళ్ల వ్యవధితో బీటెక్ తోపాటు ఎల్ఎల్బీ చదువుకునే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎల్ఎల్బీ సంయుక్తంగా అందిస్తోంది. సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా- ఈ రెండింటిలో ఏదో ఒకటి స్పెషలైజేష న్గా ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఇంటర్ ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఆకర్షణీయ వేతనాలతో...
జాతీయ స్థాయి సంస్థల్లో న్యాయవిద్య కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్వేర్, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్ సంస్థలూ, అకౌంటింగ్ కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్ క్లర్క్లుగానూ తీసుకుంటున్నారు. లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యతో బోధన రంగంలోనూ రాణించవచ్చు. ఎన్జీవోలు, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, కార్పొరేట్ లీగల్ సెల్స్ ..ఇవన్నీ కొలువుల వేదికలే. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్ లీగల్ ఫర్మ్లు సైతం ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ స్థాయుల్లో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, కాపీ రైట్ కేసులు పెరుగుతున్నాయి. సాంకేతిక వృద్ధి లీగల్ పట్టభద్రులకు అవకాశాలు కల్పిస్తోంది. సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్), లేబర్ ఆఫీసర్ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుల్లో సేవలు అందించవచ్చు. ఆర్మీలో జడ్జ్ అడ్వొకేట్ జనరల్ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేటు ప్రాక్టీస్ కొనసాగించవచ్చు. లీగల్ రిపోర్టర్, లీగల్ ఎనలిస్ట్గానూ సేవలందించవచ్చు.
ఐఐఎం రోహ్తక్లో..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), రోహ్తక్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు 2021 - 2022 విద్యా సంవత్సరం నుంచి అందిస్తోంది. పదో తరగతి, ఇంటర్లో 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ప్రవేశానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో అవకాశం కల్పిస్తారు. పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, లీగల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10లోగా నమోదు చేసుకోవాలి. క్లాట్ స్కోరుతోనూ అవకాశం ఉంది. ఏప్రిల్ 20లోగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఐపీఎం/క్లాట్లో సాధించిన స్కోరుకు 45 శాతం, ఇంటర్వ్యూకి 15, పదోతరగతి, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.iimrohtak.ac.in/ చూడవచ్చు.
ఉన్నత విద్య
జాతీయ, ప్రముఖ సంస్థల్లో పీజీ కోర్సు (ఎల్ఎల్ఎం) ఏడాదికే పూర్తవుతుంది. రాష్ట్రస్థాయి సంస్థల్లో మాత్రం పీజీ వ్యవధి రెండేళ్లు. ఇందులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. బిజినెస్, హ్యూమన్ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ అండ్ క్రిమినల్, కార్పొరేట్, ఎన్విరాన్మెంటల్, ఫ్యామిలీ, పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్...మొదలైనవి ముఖ్యమైనవి.స్పెషలిస్ట్ సేవలు అందించాలనుకునేవారు ఎల్ఎల్ఎంలో చేరాలి. అనంతరం ఆసక్తి ఉంటే పీహెచ్డీలో చేరవచ్చు. బోధన రంగంలో రాణించడానికి పరిశోధన పట్టా ఉపయోగపడుతుంది.
ఇవీ పరీక్షలు...
న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో ముఖ్యమైంది కామన్ లా ఎంట్రన్స్ టెస్టు (క్లాట్). ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి నల్సార్, హైదరాబాద్; దామోదరం సంజీవయ్య జాతీయ లా కళాశాల, విశాఖపట్నం ఉన్నాయి. పేరొందిన ప్రైవేటు సంస్థల్లో ప్రవేశానికీ క్లాట్ స్కోరు ఉపయోగపడుతుంది. భారత్లో కొన్ని సంస్థలతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి ఎల్శాట్ స్కోరు ఉపయోగపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాసెట్ నిర్వహిస్తున్నారు. ఈ స్కోరుతో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరవచ్చు. లా ప్రవేశ పరీక్షల్లో ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, లీగల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలో గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు. న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్, స్కిల్స్ ఉన్నాయా? లేవా? అనేది ప్రవేశ పరీక్షల ద్వారా గమనిస్తారు.
కావాల్సిన నైపుణ్యాలు
క్లిష్టమైన, విస్తృతంగా ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకునే నైపుణ్యం లా గ్రాడ్యుయేట్లకు ఉండాలి. అలాగే తార్కిక పరిజ్ఞానం తప్పనిసరి. విశ్లేషణ, రాత నైపుణ్యాలు బాగుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివిగా మాట్లాడ టం తప్పనిసరి. అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం.
పేరున్న సంస్థలు..
దేశంలో న్యాయవిద్యకు నేషనల్ లా యూనివర్సిటీలతోపాటు మరికొన్ని సంస్థలు పేరొందాయి. వాటిలో ముఖ్యమైనవి... దిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ లా; బెనారస్ యూనివర్సిటీ, వారణాసి; గవర్నమెంట్ లా కాలేజ్, ముంబై; ఐఎల్ఎస్ లా కాలేజ్, పుణె; సింబయాసిస్, పుణె; ఐఐటీ ఖరగ్పూర్. వీటిలో ప్రవేశాల కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఇలా
టీఎస్/ఏపీ లాసెట్ 120 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పార్ట్-ఎ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు, పార్ట్-బి కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, పార్ట్-సి లా ఆప్టిట్యూడ్లో 60 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 10 ప్రశ్నలు లీగల్ ఆప్టిట్యూడ్పై ప్యాసేజ్ రూపంలో ఉంటాయి. పార్ట్-సి ప్రశ్నలు లా, భారత రాజ్యాంగంలో ప్రాథమికాంశాలపై ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. కొన్ని జతచేసేవీ ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాద్యమాల్లో అడుడుతారు. మాక్ టెస్టు అందుబాటులో ఉంచారు.
ఐదేళ్ల లా పరీక్షలో ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో, మూడేళ్ల లాకు యూజీ స్థాయిలో ఉంటాయి. టీఎస్ లాసెట్ను ఉస్మానియా, ఏపీ లాసెట్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నాయి.
దరఖాస్తులు..
టీఎస్ లాసెట్: దరఖాస్తులు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 6 వరకు స్వీకరిస్తారు. పరీక్ష మే 25న.
ఏపీ లాసెట్: దరఖాస్తులు ఏప్రిల్ 22 వరకు. పరీక్ష మే 20న.
అర్హత: టీఎస్, ఏపీ ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులకు ఇంటర్మీడియట్లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీలు 42, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం ఉన్నా సరిపోతుంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ అర్హులే. పాలిటెక్నిక్ డిప్లొమాతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్లో అర్హతకు 35 శాతం మార్కులు తప్పనిసరి. మూడేళ్ల లా కోర్సులకు డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ
https://cets.apsche.ap.gov.in/
తెలంగాణ
మరింత సమాచారం... మీ కోసం!
‣ పాత ప్రశ్నపత్రాలు... ఎందుకు ముఖ్యం?
‣ భారతీయ కోర్సులకు టాప్ ర్యాంకులు