• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ తర్వాత ఐఐఎంలో ఎంబీఏ

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి

ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు. ఇప్పుడివి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో మేనేజ్‌మెంట్‌ చదువులు అందిస్తున్నాయి. తాజాగా ఐఐఎం రోహ్‌తక్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి బీబీఏ, ఎంబీఏ డిగ్రీలను ప్రదానం చేస్తారు. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు ప్రారంభించిన మొదటి ఐఐఎంగా ఇండోర్‌ గుర్తింపు పొందింది. ఆ తర్వాత నుంచి మరికొన్ని ఐఐఎంలు ఈ విధానంలో చదువులు అందిస్తున్నాయి. 2019 నుంచి ఐఐఎం రోహ్‌తక్‌ ఈ విధానంలోకి అడుగుపెట్టింది. ఇంటర్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ విద్య చదవాలనుకున్నవారికి ఈ కోర్సులు ఎంతో ప్రయోజనం. ఏడాదికి మూడు చొప్పున ఐదేళ్ల కోర్సులో 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి 3 నెలలు. మొత్తం కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో ప్రాథమికాంశాలపై దృష్టి సారిస్తారు. రెండో భాగంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో మెలకువలు అందిస్తారు. ప్రతి అకడమిక్‌ సంవత్సరం చివరలోనూ ఇంటర్న్‌షిప్‌లు పూర్తిచేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీని ప్రదానం చేస్తుంది. మూడేళ్ల తర్వాత వైదొలిగినవారికి బీబీఎ డిగ్రీ అందిస్తారు. మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఐదేళ్లకూ కోర్సు ఫీజు రూ.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందవచ్చు. 

పరీక్ష ఇలా...

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్నీ 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. 

పర్సనల్‌ ఇంటర్వ్యూ

ఆప్టిట్యూడ్‌ టెస్టులో అర్హత సాధించినవారికి ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ జూన్‌ నాలుగో వారంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్స్, జనరల్‌ అవేర్‌నెస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. 

తుది నియామకాలు

ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోర్‌కు 45 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ 15 శాతం, పాస్ట్‌ అకడమిక్స్‌ 40 (పదో తరగతికి 20, ఇంటర్మీడియట్‌కు 20) శాతం వెయిటేజీ ఉంటాయి. ఫలితాలు జూన్‌ రెండో వారంలో వెలువడతాయి. జులైలో ప్రవేశాలు చేపట్టి, ఆగస్టులో తరగతులు మొదలుపెడతారు. 

అర్హత: పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం తప్పనిసరి. వయసు జూన్‌ 30, 2022 నాటికి 20 ఏళ్లలోపు ఉండాలి. 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మే 2

దరఖాస్తు ఫీజు: రూ.3890

పరీక్ష తేదీ: మే 21

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం 

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

‣ ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

‣ ఎస్‌ఓపీ ఎలా రాయాలి?

‣ ఆధునిక వసతులు అత్యుత్తమ బోధన!

‣ విద్యార్థినులకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత

‣ ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌