• facebook
  • whatsapp
  • telegram

బిర్లా సంస్థల్లో అడ్మిషన్లకు ప్రకటన

* కోర్సులు, పరీక్ష సరళి వివరాలు

* బిట్‌శాట్‌తో బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ



 

శ్రేష్ఠ విద్యాసంస్థ (ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌) హోదా దక్కిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో బిట్స్‌ పిలానీ ఒకటి. ఇంజినీరింగ్‌ విద్యలో పాతతరం ఐఐటీల తర్వాత భారత్‌లో పేరున్న సంస్థ.. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌). 


దీనికి పిలానీ, గోవా, హైదరాబాద్‌ల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులను ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో అందిస్తున్నారు. బిట్స్‌ నిర్వహించే ప్రవేశ పరీక్షతో అవకాశం కల్పిస్తారు. ఇటీవలే ఆ ప్రకటన వెలువడింది!


ఎక్కువమంది పోటీపడే ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఐఐటీ-జేఈఈ తర్వాత బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌) ముఖ్యమైంది. ఏటా సుమారు మూడు లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. మిగిలిన పరీక్షలతో పోలిస్తే ఇది భిన్నమైందిగానూ చెప్పుకోవచ్చు. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలడగడం బిట్స్‌ ప్రత్యేకత. 


ఇవీ కోర్సులు


బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌. 


 బీఫార్మసీ


 ఎమ్మెస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్, జనరల్‌ స్టడీస్‌


అర్హత: ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపు తప్పనిసరి. బీఫార్మసీకి బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సంబంధిత గ్రూపులో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60 శాతం మార్కులు ఉండాలి. 2024లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తున్నవారూ, 2023లో ఉత్తీర్ణులైనవారే అర్హులు.


ఏ విభాగంలో ఏ ప్రశ్నలు?


ఆంగ్లం:
భాషపై ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. గ్రామర్, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కంపోజిషన్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా వాటిని అడుగుతారు.


లాజికల్‌ రీజనింగ్‌: తర్కం, కచ్చితత్వం తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. వెర్బల్‌ విభాగం నుంచి.. ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్‌ కంప్లీషన్, లాజికల్‌ డిడక్షన్, చార్ట్‌ లాజిక్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ వెర్బల్‌ విభాగంలో.. ప్యాటర్న్‌ పర్సెప్షన్, ఫిగర్‌ ఫార్మేషన్‌ అండ్‌ అనాలిసిస్, పేపర్‌ కటింగ్, ఫిగర్‌ మ్యాటిక్స్, రూల్‌ డిటెక్షన్‌ల్లో ప్రశ్నలు సంధిస్తారు. 


గణితం: ఆల్జీబ్రా, త్రికోణమితి, టూ డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, త్రీ డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, లీనియర్‌ ప్రోగ్రామింగ్, మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 


బయాలజీ: డైవర్సిటీ ఇన్‌ లివింగ్‌ వరల్డ్, సెల్‌: లైఫ్, స్ట్రక్చర్, ఫంక్షన్‌. జెనెటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, ప్లాంట్స్, యానిమల్స్, రీప్రొడక్షన్, గ్రోత్‌ అండ్‌ మూమెంట్‌ ఇన్‌ ప్లాంట్స్, రీ ప్రొడక్షన్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ హ్యూమన్స్, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, బయాలజీ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్‌ అప్లికేషన్స్‌ విభాగాల్లో ప్రశ్నలు సంధిస్తారు.


ఫిజిక్స్‌: యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, కైనమాటిక్స్, న్యూటన్‌ లాస్‌ ఆఫ్‌ మోషన్, ఇంపల్స్‌ అండ్‌ మొమెంటమ్, వర్క్‌ అండ్‌ ఎనర్జీ, రొటేషనల్‌ మోషన్, గ్రావిటేషన్, సోలిడ్స్, ఫ్లూయిడ్స్‌ మెకానిక్స్, ఆసిలేషన్స్, వేవ్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఇండక్షన్, ఆప్టిక్స్, మోడర్న్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 


కెమిస్ట్రీ: స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్, అటామిక్‌ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్‌ అండ్‌ కెమికల్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, హైడ్రోజన్‌ అండ్‌ ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, పీ, డీ అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ హైడ్రో కార్బన్స్‌ ప్రిన్సిపుల్స్, స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కాంపౌండ్స్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఎక్స్‌పరిమెంటల్‌ కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 



నాలుగు విభాగాలు 

ప్రవేశ పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. 

పార్ట్‌-1లో- ఫిజిక్స్‌ నుంచి 30 ప్రశ్నలు, పార్ట్‌-2లో కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు 

పార్ట్‌-3లో ఎ.ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ నుంచి 10, బి.లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్‌-4లో మ్యాథ్స్‌ / బయాలజీ (బీఫార్మసీ కోసం) 40 ప్రశ్నలు 


 మొత్తం 130 ప్రశ్నలకు 3 గంటల వ్యవధి కేటాయించారు. సెక్షన్ల వారీ సమయ నిబంధనలు లేవు. ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినవారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజికల్‌ రీజనింగ్‌ ఒక్కో విభాగం నుంచి 3 చొప్పున ఇవి ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే అదనపు మార్కులు పొందవచ్చు. 


  అయితే ఈ విధానం ఎంచుకున్నవారు ముందు గుర్తించిన 130 ప్రశ్నలకూ జవాబులు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలోనే అడుగుతారు. 



ప్రోత్సాహకాలు


బిట్‌శాట్‌లో మెరుగైన స్కోరుతో మెరిసినవారికి స్కాలర్‌షిప్పు లభిస్తుంది. ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి వంద శాతం ట్యూషన్‌ ఫీజులో రాయితీ ఇస్తున్నారు. ఏటా సుమారు 30 శాతం మంది విద్యార్థులకు ఈ తరహా ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. మెరిట్‌ అవార్డు స్కీమ్‌లో భాగంగా.. పరీక్షలో టాప్‌ ఒక శాతంలో నిలిచినవారు ఫీజులో వంద శాతం, టాప్‌ 2 శాతం విద్యార్థులు ఫీజులో 40 శాతం స్కాలర్‌షిప్పు పొందవచ్చు. మెరిట్‌ కమ్‌ నీడ్‌ అవార్డుల్లో భాగంగా టాప్‌ 3 శాతం విద్యార్థులు ఫీజులో 80 శాతం స్కాలర్‌షిప్పు అందుకోవచ్చు. బిట్స్‌లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా మేటి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.   



కటాఫ్‌ అంచనా 

ఈ సంస్థల్లో బీటెక్‌ కెమికల్, సివిల్‌ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో చేరడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ఎమ్మెస్సీ కటాఫ్‌ స్కోర్‌ వాటికంటే ఎక్కువగా ఉంది. మొత్తం 390కి 220 మార్కులు పొందినవారు ఏదైనా క్యాంపస్‌లో ఏదో ఒక ఇంజినీరింగ్‌ విభాగంలో సీటు ఆశించవచ్చు. ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సు ఒక్క పిలానీ క్యాంపస్‌లోనే అందుబాటులో ఉంది. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారు ఏడాది అనంతరం డ్యూయల్‌ డిగ్రీ చదువుకోవచ్చు. మొదటి ఏడాది కోర్సులో చూపిన ప్రతిభతో ఈ సీట్లు కేటాయిస్తారు. ఈ విధానం ఎంచుకున్నవారు ఐదేళ్ల వ్యవధితో నచ్చిన బ్రాంచీలో ఇంజినీరింగ్‌తోపాటు ఎమ్మెస్సీ పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు నాలుగేళ్లకే పూర్తవుతాయి. మిగతా వాటిలో ఈ వ్యవధి ఐదేళ్లు. ఈ పరీక్షలో పొందిన స్కోరుతో ఎన్నో ఇతర సంస్థలూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 



ఇదీ షెడ్యూల్‌


ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెషన్‌-1 లేదా రెండింటికీ కలిపి ఏప్రిల్‌ 11 వరకు స్వీకరిస్తారు. ఒక్క సెషన్‌-2లోనే పరీక్ష రాయాలనుకున్నవారు మే 22 నుంచి జూన్‌ 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆన్‌లైన్‌ పరీక్షలు: సెషన్‌-1 మే 21 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. సెషన్‌-2 జూన్‌ 22 నుంచి 26 వరకు. రోజూ రెండు విడతల్లో ఇవి ఉంటాయి. 


ఫీజు: ఏదో ఒక సెషన్‌ కోసమే అయితే పురుషులకు రూ.3400, మహిళలకు రూ.2900. రెండు సెషన్లలోనూ రాయడానికి పురుషులకు రూ.5400, మహిళలకు రూ.4400.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం


వెబ్‌సైట్: https://www.bitsadmission.com/


బిట్‌శాట్‌కు ముందు కనీసం పది మాక్‌ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు దొర్లుతున్న విభాగాల కోసం అదనపు సమయం కేటాయించుకుని సన్నద్ధం కావాలి. తర్వాతి పరీక్షలో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సమయపాలననూ అసలు పరీక్షకు అనుగుణంగానే పాటించాలి. జేఈఈ మెయిన్స్‌ సన్నద్ధతతో బిట్‌శాట్‌ను ఎదుర్కోవచ్చు



మేటి స్కోరు కోసం 

 సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. 

 ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు రూపొందిస్తారు.

 ముందుగా సబ్జెక్టులవారీ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలు, భావనలు బాగా అధ్యయనం చేయాలి. ముఖ్యమైనవాటిని రివిజన్‌కు వీలుగా నోట్సు రాసుకోవాలి.

 పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. వీటిద్వారా సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలవారీ దక్కుతోన్న ప్రాధాన్యం, ప్రశ్నలడిగే తీరు, వాటిస్థాయి గ్రహించాలి. సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.  

 పరిమిత సంఖ్యలో రిఫరెన్స్‌ పుస్తకాలను ఎంపికచేసుకుని, వాటినే ఎక్కువ సార్లు చదవాలి. 

 వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

 ఈ పరీక్షలో.. ఆంగ్లం, లాజికల్‌ రీజనింగ్‌లకూ ప్రాధాన్యం ఉంది కాబట్టి వాటిపైనా దృష్టి పెట్టాలి. ఈ విభాగాల్లో మెరుగైన స్కోరు సాధించినవాళ్లు ముందుంటారు. 

 పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు దొర్లుతున్న విభాగాల కోసం అదనపు సమయం కేటాయించుకుని సన్నద్ధం కావాలి. తర్వాతి పరీక్షలో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. సమయపాలననూ అసలు పరీక్షకు అనుగుణంగానే పాటించాలి.

 జేఈఈ మెయిన్స్‌ సన్నద్ధతతో బిట్‌శాట్‌ను ఎదుర్కోవచ్చు. మెయిన్స్‌ మాదిరి, పాత ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయడం ఉపయోగపడుతుంది. ఏపీ, టీఎస్‌ ఎంసెట్, డీమ్డ్‌ సంస్థల ప్రశ్నపత్రాల అధ్యయనమూ ప్రయోజనమే. 

 గణితంతోపాటు ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కొన్ని ప్రశ్నలకు షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ ద్వారా తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించవచ్చు. వీటిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన సూత్రాలు ఉపయోగించే విధానంపై పట్టుండాలి. 

 పరీక్షలో రుణాత్మక మార్కులున్నాయి. అందువల్ల ఏమాత్రం తెలియనివాటిని వదిలేస్తేనే మేలు. అలాగే జవాబు కోసం ఎక్కువ సమయం తీసుకునేవాటినీ చివరిలోనే ప్రయత్నించాలి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Posted Date: 25-01-2024


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌