‣ క్లాట్ - 2025
మేటి జాతీయ సంస్థల్లో న్యాయవిద్య చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైంది.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). దేశవ్యాప్తంగా 24 జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఏడాది ఎల్ఎల్ఎం కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపే ప్రతిభతో అవకాశం దక్కుతుంది. ఈ సంస్థల్లో కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనంతో బహుళజాతి, దేశీయ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు!
న్యాయవిద్యపై ఆసక్తి ఉన్నవారు ఆ కోర్సులో చేరే అవకాశం రెండుసార్లు వస్తుంది. మొదటిది ఇంటర్మీడియట్ తర్వాత, రెండోది డిగ్రీ అనంతరం. అయితే ముందే నిర్ణయానికి వచ్చినవాళ్లు ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ వ్యవధిలో ఒకవైపు డిగ్రీ, మరోవైపు న్యాయవిద్య రెండూ పూర్తవుతాయి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఎం, బీఎస్డబ్ల్యు.. వీటిలో నచ్చిన కోర్సుతో కలిపి లా చదువుకోవచ్చు. డిగ్రీ అనంతరం లా కోర్సుల్లో చేరడంతో పోలిస్తే ఈ విధానంలో ఏడాది సమయం ఆదాతో పాటు, న్యాయవిద్యపై గట్టి పట్టూ దక్కుతుంది. అలాగే జాతీయ స్థాయిలో దాదాపు మేటి సంస్థలన్నీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులనే అందిస్తున్నాయి. క్లాట్ స్కోరుతో నల్సార్- హైదరాబాద్, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం- విశాఖపట్నం, ఎన్ఎల్ఎస్యూ-బెంగళూరు.. ఇలా 24 ప్రఖ్యాత సంస్థల్లో న్యాయవిద్య కోర్సుల్లో చేరవచ్చు. అలాగే ఈ స్కోరుతో ఎన్నో ప్రైవేటు సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి.
పరీక్ష ఇలా
యూజీ క్లాట్లో 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. వ్యవధి 2 గంటలు. పరీక్ష ఆఫ్లైన్లోనే నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి. అయితే ప్రతి విభాగంలోనూ ప్యాసేజ్లు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్లో 20-26 (20 శాతం వెయిటేజీ), కరెంట్్ అఫైర్స్, జీకే 28-32 (25 శాతం వెయిటేజీ), లీగల్ రీజనింగ్ 28-32 (25 శాతం వెయిటేజీ), లాజికల్ రీజనింగ్ 22-26 (20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 10-14 (10 శాతం వెయిటేజీ) ప్రశ్నలు వస్తాయి. వీటిని గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను తెలుసుకునేలా రూపొందిస్తారు. న్యాయవిద్య చదవడానికి అవసరమైన ఆప్టిట్యూడ్, స్కిల్స్ అభ్యర్థిలో ఉన్నాయా? లేవా? గమనిస్తారు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
వర్తమాన అంశాలు, చరిత్రాత్మక ఫిక్షన్, నాన్ ఫిక్షన్ల్లో పాసేజ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్యాసేజ్ 450 పదాలతో, ఇంటర్ విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిలో, ఒక్కోటి 5 నుంచి 7 నిమిషాల్లో చదవగలిగేలా ఉంటుంది. వీటిద్వారా అభ్యర్థిలోని గ్రహణ, భాషా నైపుణ్యాలను గమనిస్తారు. సరైన జవాబు కోసం.. ప్యాసేజ్లోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అందులోని భిన్న అభిప్రాయాలు, వాదనలు.. అన్నీ బేరీజు వేసుకుని స్పష్టమైన నిర్ణయానికి రావాలి. పద సంపదపై పట్టు పెంచుకుని, వేగంగా చదవగలిగే నైపుణ్యం అలవర్చుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని కాంప్రహెన్షన్ ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే.. ఆంగ్ల దినపత్రికల్లోని వ్యాసాలు అందులోనూ ముఖ్యంగా సమకాలీన చర్చనీయ అంశాలకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలు బాగా చదవాలి.
కరెంట్ అఫైర్స్, జీకే
ఈ విభాగంలోనూ 450 పదాలతో ఒక్కో పాసేజ్, దానికి అనుబంధంగా ప్రశ్నలు వస్తాయి. వార్తలు, కథనాలు, నాన్ ఫిక్షన్ రచనల నుంచి పాసేజ్లు ఉంటాయి. వీటిలో లీగల్ సంబంధిత అంశాలూ ఉండొచ్చు. వీటికి సమాధానాలు గుర్తించడానికి న్యాయవిద్యలో ప్రావీణ్యం అవసరం లేదు. వర్తమానాంశాలు, జనరల్ నాలెడ్జ్ల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్, ప్రపంచంలో చర్చనీయమవుతోన్న పరిణామాలు, సంఘటనలు; కళలు, సంస్కృతి; అంతర్జాతీయ అంశాలు, వర్తమానంతో ముడిపడిన చారిత్రక అంశాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించడానికి.. తాజా సంఘటనలను అనుసరిస్తూ, ఆంగ్ల పత్రికల్లో నిపుణుల వ్యాసాలను చదవాలి.
లీగల్ రీజనింగ్
ఇందులోనూ 450 పదాల పాసేజ్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. లీగల్తో ముడిపడిన ఉన్న వాస్తవ సంఘటనలు, పరిణామాలు, పబ్లిక్ పాలసీ, నీతి, తాత్వికాంశాలకు చెందిన ప్రశ్నలు వస్తాయి. వీటికి జవాబులు గుర్తించడానికి న్యాయవిద్యతో పరిచయం అవసరం లేదు. వర్తమానాంశాలపై అవగాహన, సమకాలీన న్యాయ, మానవత్వ సంఘటనలపై దృష్టి సారించాలి. ఇచ్చిన పాసేజ్లోని నిబంధనలు, సూత్రాలు (నియమాలు) గుర్తించాలి. వాటిని వివిధ సందర్భాలకు అనువర్తించాలి. వాస్తవికతకు తర్కాన్ని జోడించి ఆలోచిస్తే ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించవచ్చు.
పీజీ క్లాట్
ఈ పరీక్ష ౧౨౦ మార్కులకే ఉంటుంది. ఇందులో ౧౨౦ మల్టిపుల్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. కాన్స్టిట్యూషన్, ఫ్యామిలీ, క్రిమినల్, ప్రాపర్టీ, కంపెనీ, ట్యాక్స్, లేబర్, ఇండస్ట్రియల్, ఎన్విరాన్మెంటల్ లా అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎల్ఎల్బీ పాఠ్యపుస్తకాలతో పాటు సంబంధిత విభాగాల్లో ఒకటి రెండు రిఫరెన్స్ బుక్స్ చదివినవారు మేటి స్కోరు సాధించగలరు. సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
అర్హతః ఎల్ఎల్బీలో ౫౦ శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలైతే ౪౫ శాతం సరిపోతాయి. చివరి ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులూ అర్హులే.
క్లాట్ ఎల్ఎల్ఎం స్కోరుతో ఉద్యోగాలూ లభిస్తున్నాయి. బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, నేషనల్ థర్మల్ పవర్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మొదలైనవి..లా ఆఫీసర్/ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్/ ట్రెయినీ లీగల్ అడ్వయిజర్ హోదాతో తీసుకుంటున్నాయి. నియామకాల్లో క్లాట్ స్కోరుకు దాదాపు 75 శాతం, 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి.
లాజికల్ రీజనింగ్
ప్రతి పాసేజ్లోనూ 450 పదాల సమాచారం ఉంటుంది. దీని కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు రావచ్చు. సమాధానం కోసం పాసేజ్లో ఆర్గ్యుమెంట్లు, కన్క్లూజన్లు గమనించాలి. వాటిని తార్కికంగా విశ్లేషించుకోవాలి.
క్వాంటిటేటివ్ టెక్నిక్స్
ఈ విభాగంలో.. కొంత సమాచారం లేదా గ్రాఫ్లు లేదా అంకెలతో కూడిన చిత్రాలు లేదా కొన్ని వాస్తవికాంశాలు...వీటిలో ఏవైనా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. జవాబు దానిపైన ఉన్న వివరణతో ముడిపడే ఉంటుంది. గణితంపై పట్టు ఉంటే ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్చు. పదో తరగతిలోని రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, బేసిక్ ఆల్జీబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అంశాలను బాగా చదువుకోవాలి.
అవకాశాలకు ఢోకా లేదు
క్లాట్తో మేటి సంస్థల్లో న్యాయవిద్య చదివినవారు అవకాశాల్లో ముందుంటున్నారు. ఎక్కువమంది ప్రాంగణ నియామకాల్లో పెద్ద మొత్తంలో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, ప్రైవేటు ఈక్విటీలు, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలూ, లీగల్ ఫర్మ్లు వీరికి ప్రాధాన్యమిస్తున్నాయి. పెద్ద కోర్టుల్లో జ్యుడీషియల్ క్లర్క్లుగానూ తీసుకుంటున్నారు. లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, బోధనలోనూ అవకాశాలు ఉంటాయి. ఎన్జీవోలు, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, కార్పొరేట్ లీగల్ సెల్స్.. ఇవన్నీ వీరికి ఉపాధి మార్గాలే. కార్పొరేట్ లీగల్ ఫర్మ్ల్లో గరిష్ఠ వేతనంతో ఉద్యోగాలు పొందవచ్చు. పెరుగుతోన్న సాంకేతిక మోసాలు, కాపీ రైట్, పేటెంట్ కేసులతో అవకాశాలకు ఢోకా లేదు.
సన్నద్ధత ఎలా?
‣ యూజీ క్లాట్ దరఖాస్తు చేసుకున్నవారికి.. మాదిరి ప్రశ్నలు, మోడల్ క్వశ్చన్ పేపర్లు, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, ప్రతి సబ్జెక్టులోనూ ఎక్సర్సైజులు ఎన్ఎల్యూ కన్సార్షియం అందిస్తుంది. ఎలా సన్నద్ధం కావాలి, పరీక్షలో విజయానికి సూచనలు.. సబ్జెక్టు నిపుణులతో అందిస్తారు. వీటిని అనుసరించాలి.
‣ పరీక్షలో సుదీర్ఘ వ్యాసాలు క్లిష్టంగా వస్తున్నాయి. ఆంగ్లంపై గట్టి పట్టు ఉంటేనే అర్థం చేసుకోగలరు. అలాగే మెరుగైన సంగ్రహణ నైపుణ్యం కావాలి. ఇందుకోసం ఆంగ్లంలోని.. నవలలు, వార్తాపత్రిక కథనాలు, సంపాదకీయాలు, విమర్శనాత్మక సమీక్షలు, వార్తాంశాలను బాగా చదవాలి. సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోగలగాలి.
‣ పత్రికల్లో లీగల్ వార్తలు/వ్యాసాలు రోజూ చదవాలి. అందులోని ఒకాబ్యులరీపై పట్టు పెంచుకోవాలి.
‣ క్వాంటిటేటివ్ విభాగంలో వేగంగా సమాధానం గుర్తించడానికి పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
‣ ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై స్పష్టత కోసం క్లాట్ ౨౦౨౦, ౨౦౨౧, ౨౦౨౨, ౨౦౨౩, ౨౦౨౪ ప్రశ్నపత్రాలు బాగా అధ్యయనం చేయాలి.
‣ వర్తమాన అంశాల కోసం జనవరి ౨౦౨౪ నుంచి ముఖ్య సంఘటనలపై అవగాహన ఉండాలి. ఆంగ్ల పత్రికలు చదువుతున్నప్పుడే ఈ విభాగంలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నవి నోట్సు రాసుకోవాలి.
‣ ఇంగ్లిష్ సెక్షన్లో రాణించడానికి వ్యాకరణం అందులోనూ ముఖ్యంగా పదసంపదలో ప్రావీణ్యం పొందాలి. జాతీయాలు, సామెతలపై అవగాహన ఉండాలి. దీంతో వ్యాసాలు సులువుగా అర్థం చేసుకోవచ్చు.
చదవాల్సినవి..
‣ యూనివర్సల్ క్లాట్ గైడ్
‣ లీగల్ అవేర్నెస్ అండ్ లీగల్ ఆప్టిట్యూడ్ః ఏపీ భరద్వాజ్
‣ లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్
‣ వర్డ్ పవర్ మేడ్ ఈజీః నార్మన్ లూయీ
‣ అనలిటికల్ రీజనింగ్ః ఎంకే పాండే
‣ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆర్ఎస్ అగర్వాల్
ముఖ్య వివరాలు..
అర్హతః ఇంటర్లో ౪౫ శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు ౪౦ శాతం చాలు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులూ అర్హులే.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీః అక్టోబరు ౧౫, ౨౦౨౪
దరఖాస్తు ఫీజుః జనరల్, ఓబీసీలకు రూ.౪౦౦౦; ఎస్సీ, ఎస్టీలకు రూ.౩౫౦౦.
పరీక్ష తేదీః డిసెంబరు ౦౧, ౨౦౨౪
వెబ్సైట్: https://consortiumofnlus.ac.in/clat-2025/
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!