• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్' 

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష



ఐఐటీలంటే ఇంజినీరింగ్‌ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులను పలు సబ్జెక్టుల్లో అందిస్తున్నాయి. సాధారణ డిగ్రీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) రాయాలి. ఇటీవలే ప్రకటన వెలువడింది. ఐఐటీల్లోనే కాకుండా ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో చదవడానికి జామ్‌ స్కోరు దారి చూపుతుంది. అన్ని సంస్థల్లోనూ 5000కు పైగా సీట్లు ఉన్నాయి. 


బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ల్లో.. ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్‌), ఎం.ఎస్‌.(రిసెర్చ్‌), ఎమ్మెస్సీ-ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ, జాయింట్‌ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ పేర్లతో పలు కోర్సులను 21 ఐఐటీలు అందిస్తున్నాయి. వీటిలో 3000 సీట్లు ఉన్నాయి. జామ్‌ - 2024ను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది. 


అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్‌-1లో ఒకటి, సెషన్‌-2లో మరొక సబ్జెక్టు ఎంచుకోవచ్చు. సెషన్‌-1లో బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో.. కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లోని 2000 సీట్లకూ జామ్‌ స్కోరే ప్రామాణికం. జామ్‌లో 60 శాతం మార్కులు పొందినవారికి సీటు దక్కడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. జామ్‌తో ప్రవేశం కల్పిస్తోన్న పలు సంస్థలు ప్రతి నెలా స్టైపెండ్‌నూ అందిస్తున్నాయి. మేటి అవకాశాలు ఆశించేవారు, పరిశోధనల దిశగా అడుగులు వేయాలి అనుకున్నవారు జామ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.  


చేరటానికి ఏ అర్హత? 

ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సరిపోతుంది. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులను ఎమ్మెస్సీలో భాగంగా అందిస్తున్నాయి. పలు ఐఐటీలు, ఐఐఎస్సీలో కెమిస్ట్రీ కోర్సులకు డిగ్రీలో కెమిస్ట్రీ సరిపోతుంది. కొన్నింటికి డిగ్రీ కెమిస్ట్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదివుండాలి. ఐఐటీ గాంధీనగర్‌కు ఎలాంటి నిబంధనలూ లేవు. మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీని ఐఐటీ- బాంబే, ఇందౌర్‌ అందిస్తున్నాయి. వీటికోసం గ్రాడ్యుయేట్లు ఎవరైనా పోటీ పడవచ్చు. ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు ఐఐటీ దిల్లీ, రవుర్కెలాలో ఉంది. దిల్లీలో ఈ కోర్సులో చేరడానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. రవుర్కెలాలో అయితే బీఈ/ బీటెక్‌ లేదా డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్‌/ మ్యాథ్స్‌ చదివుండాలి. 


పరీక్ష తీరిలా..

ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌ 60 ప్రశ్నలు ఉంటాయి. వీటికి వంద మార్కులు. మూడు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్, మల్టిపుల్‌ సెలెక్ట్, న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలు. వీటిని ఎ,బి,సి సెక్షన్లుగా విభజించారు. 

సెక్షన్‌-ఎ: ఇందులో మొత్తం 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు. 

సెక్షన్‌-బి: ఇందులో పది మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉండవచ్చు. సరైన ఆప్షన్‌/ ఆప్షన్లను గుర్తిస్తేనే పూర్తి మార్కులు వస్తాయి. పాక్షిక సమాధానానికి మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు.

సెక్షన్‌-సి: ఇందులో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.


సన్నద్ధత ఎలా?

సాధారణంగా ఐఐటీల్లో సీటు పొందడమంటే కష్టమనే భావన ఉంటుంది. ఇంజినీరింగ్‌ విషయంలో ఈ అభిప్రాయం చాలావరకు వాస్తవమే కావచ్చు. కానీ ఎమ్మెస్సీ కోర్సులకు మాత్రం సాధారణ విద్యార్థికీ అవకాశం దక్కుతుంది. అందువల్ల బాగా సన్నద్ధమయ్యేవారు విజయవంతం కావచ్చు. 

విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు, జామ్‌కు మధ్య వ్యత్సాసం ఉంటుంది. దీన్ని గ్రహించి, సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా అమలు చేయడం ప్రధానం. 

జామ్‌లో.. ప్రాథమికాంశాలకు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల పరీక్ష రాసే సబ్జెక్టులో అధ్యయనం వీటితోనే ప్రారంభించాలి. ముందుగా కింది తరగతుల పాఠ్యపుస్తకాలు బాగా చదివి, ఆ తర్వాత యూజీ(డిగ్రీ) స్థాయి పుస్తకాలపై దృష్టి పెట్టాలి.

అభ్యర్థికి సబ్జెక్టులో ఉన్న విస్తృత అవగాహనను పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. అయితే ఇవి నేరుగా ఉండవు. పలు అంశాలు జోడించి ప్రశ్నగా రూపొందిస్తారు. సబ్జెక్టుల్లో అవగాహన, అనువర్తన, విశ్లేషణ, పరిజ్ఞానం పరీక్షించేలా ఇవి వస్తాయి. అందువల్ల సమగ్ర అధ్యయనం తప్పనిసరి. పూర్తిగా అవగాహన ఉంటేనే సరైన సమాధానం రాయగలరు.  

సబ్జెక్టు/ పేపర్లవారీ సిలబస్‌ వివరాలను జామ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటిని పరిశీలించి..ఆ ప్రాధాన్యం ప్రకారం పాఠ్యపుస్తకాల్లోని అంశాలు అధ్యయనం చేయాలి. సిలబస్‌లో ప్రస్తావించిన అంశాలు పాఠ్యపుస్తకంలో లేకపోతే రిఫరెన్స్‌ పుస్తకాలను ఆశ్రయించాలి. 

సన్నద్ధతలో పాతప్రశ్నపత్రాలు దిక్సూచిలా ఉపయోగపడతాయి. వీటి నుంచి.. ప్రశ్నల తీరు, సంబంధిత సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలవారీ పరీక్షలో లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల స్థాయి తెలుసుకోవచ్చు. వేటిని చదవాలి, ఎలా సన్నద్ధం కావాలో స్పష్టత వస్తుంది. పరీక్షపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. జామ్‌ వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు పొందుపరిచారు. వాటన్నింటినీ బాగా చదువుకున్నవారు విజయానికి దగ్గర్లో ఉన్నట్లే.

అధ్యయనం పూర్తయిన తర్వాత పరీక్షకు నెల ముందు నుంచీ వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటి ఫలితాలు సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. 

జామ్‌ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు అందుబాటులో ఉంచుతారు. దాన్ని తప్పకుండా రాయాలి.  

సీయూ సెట్‌ పీజీ ప్రశ్నపత్రాలు, గతంలో వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ సాధన చేయడం మంచిదే. 


ముఖ్య వివరాలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 13 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కి రూ.900 రెండు పేపర్లకు రూ.1250. మిగిలిన అభ్యర్థులు అందరికీ ఒక పేపర్‌కు రూ.1800. రెండు పేపర్లకు రూ.2500

పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11

ప్రవేశపత్రాలు: జనవరి 8 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, గుంటూరు, ఒంగోలు, కరీంనగర్, ఖమ్మం.

ఫలితాలు: మార్చి 22న ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://jam.iitm.ac.in/Test_Paper.php


చదవాల్సినవి..

కెమిస్ట్రీ: ఫిజికల్, ఆర్గానిక్‌ విభాగాలకు ప్రాధాన్యమివ్వాలి. ఆర్గానిక్‌ విభాగంలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్పెక్ట్రోస్కోపీ, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్, రియేజెంట్స్‌ తదితర పాఠ్యాంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్‌ కైనటిక్స్, ఎల్రక్టో కెమిస్ట్రీ, సాలిడ్‌ స్టేట్‌ అంశాలను బాగా చదవాలి. ఇనార్గానిక్‌లో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, రసాయన బంధం అంశాలపై దృష్టి సారించాలి. 

ఫిజిక్స్‌: ఫిజికల్‌ ఆప్టిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, వేవ్స్‌ అండ్‌ ఆసిలేషన్స్, హీట్, ఆప్టిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, అటామిక్‌ ఫిజిక్స్, క్వాంటమ్‌ థియరీ, స్పెక్ట్రోస్కోపీ అంశాలను బాగా చదవాలి.  

మ్యాథ్స్‌: మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీలపై అధిక దృష్టి సారించాలి. 

బయోటెక్నాలజీ: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ అంశాలను ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదవాలి. బయాలజీ, కెమిస్ట్రీ అంశాలను డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేయాలి. 

జియాలజీ: ప్లానెట్‌ ఎర్త్, జియోమార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, పాలియాంథాలజీ, స్ట్రాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్‌ జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీ అంశాలు అధిక ప్రాధాన్యంతో చదవాలి.

స్టాటిస్టిక్స్‌: మ్యాథ్స్‌ అంశాలతోపాటు ప్రాబబిలిటీ, వివిధ డిస్ట్రిబ్యూషన్లు, లిమిట్‌ థీరమ్, ఎస్టిమేషన్, హైపోథీసిస్‌ అంశాలపై దృష్టి సారించాలి. 

ఎకనామిక్స్‌: మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్‌ ఎకానమీ, స్టాటిస్టిక్‌ ఎకానమీ, మ్యాథమెటికల్‌ ఎకానమీ అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date: 22-08-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌