బిజినెస్ స్కూళ్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్నవారితోపాటు ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా 600కుపైగా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.
మ్యాట్ను ఏటా నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ల్లో కోరుకున్న విధానంలో పరీక్ష రాసుకోవచ్చు. ఆసక్తి ఉంటే రెండు విధాలుగానూ రాసుకునే సౌలభ్యం ఉంది. రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ), డబుల్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ), పేపర్ బేస్డ్ టెస్టు (పీబీటీ), పేపర్ బేస్డ్ టెస్టు అండ్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (పీబీటీ+ఐబీటీ)... వీటిలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ (ఐపీఈ), ఆస్కీ, గీతం, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ధ్రువ, అరోరా, ఐఐఆర్ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం... సంస్థలు మ్యాట్ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్షలో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది. దేశవ్యాప్తంగా 50కు పైగా కేంద్రాల్లో పేపర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఇంటి నుంచే...
కరోనా నేపథ్యంలో రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్ కెమెరా ఉంటే సరిపోతుంది. ఈ విధానంలో పరీక్షలు నవంబరు 21న మొదలై డిసెంబరు 15 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ రెండు స్లాట్లలో ఉదయం, మధ్యాహ్నం వీటిని నిర్వహిస్తారు. నచ్చిన తేదీ, సమయం ఎంచుకునే వెసులుబాటు అభ్యర్థులకు ఉంటుంది. రాయాలనుకున్న తేదీకి కనీసం 4 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. నవంబరు 21న రాయడానికి నవంబరు 17లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 15న పరీక్ష రాయడానికి డిసెంబరు 11లోగా వివరాలు నమోదు చేసుకోవాలి.
పరీక్ష ఇలా
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమేటికల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కు 30, ఇంటలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్కు 30, మ్యాథ్స్ స్కిల్స్కు 40, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీకి 35, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. మాదిరి ప్రశ్నలు, మాక్ టెస్టు వెబ్సైట్లో పొందుపరిచారు.
ముఖ్యమైన అంశాలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
పరీక్ష ఫీజు: రిమోట్ ప్రోక్టర్డ్ రూ. 1650, డబుల్ రిమోట్ ప్రోక్టర్డ్ రూ.2750, పేపర్ బేస్డ్ రూ.1650, పీబీటీ+ఐబీటీ రూ. 2750.
పీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది: నవంబరు 29
పేపర్ ఆధారిత రాత పరీక్ష తేది: డిసెంబరు 6
తెలుగు రాష్ట్రాల్లో పేపర్ బేస్డ్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
వెబ్సైట్: https://mat.aima.in/dec20/