‣ మ్యాట్ డిసెంబరు -2021 ప్రకటన విడుదల
మేనేజ్ మెంట్ విద్యార్థులకు దాదాపు అన్ని రంగాల్లోనూ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రారంభంలోనే మంచి వేతనం అందే వీలుంది. అందుకే పలు రకాల ప్రఖ్యాత సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కోర్సులను రూపొందించి నిర్వహిస్తుంటాయి. వాటిల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాంటి ప్రసిద్ధ పరీక్షల్లో మేనేజ్ మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-మ్యాట్ ఒకటి. ఆల్ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ప్రముఖ బిజినెస్స్కూళ్లలోని మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు మ్యాట్ ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తుంది. ఈ మేరకు 2021 డిసెంబర్ సెషన్ కు ప్రకటన విడుదలైంది. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది.
మ్యాట్ను ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. అందులో రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ), డబుల్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ (ఐబీటీ), పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ), పేపర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(పీబీటీ+ఐబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ+ఐబీటీ) పద్ధతులు ఉన్నాయి. వాటి వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి.. కావాల్సిన విధానాన్ని అభ్యర్థులు ఎంచుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, చైతన్య, ఐఐఆర్ఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), ఐటీఎం-వరంగల్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, విశ్వవిశ్వాణి తదితర సంస్థలు మ్యాట్ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హత ఏమిటి?
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఐబీటీ/ పీబీటీ/ సీబీటీ విధానంలో పరీక్ష రాయాలనుకునే వారు పరీక్ష ఫీజు కింద రూ.1650 చెల్లించాలి. డబుల్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ)/ పీబీటీ+ఐబీటీ/ సీబీటీ+ఐబీటీ విధానంలో పరీక్షకు హాజరు కావాలనుకునే వారు రూ.2750 ఫీజు కట్టాలి.
చివరి తేదీలు
పీబీటీ: పేపర్బేస్డ్ టెస్ట్ (పీబీటీ) ఫార్మాట్లో పరీక్ష రాసే అభ్యర్థులు నవంబర్ 30, 2021లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్కార్డులను డిసెంబర్ 01న డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 05 ఉంటుంది.
సీబీటీ: కంప్యూటర్ బేస్డ్టెస్ట్ (సీబీటీ)లో వివిధ ఫార్మాట్లో దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత విధానాన్ని అనుసరించి నవంబర్ 14, డిసెంబర్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను నవంబర్ 16, డిసెంబర్ 14న డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 21, డిసెంబర్ 19న పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేపర్ బేస్డ్ టెస్ట్ విధానాన్ని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. హైదరాబాద్, విజయవాడలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
పరీక్ష విధానం
మ్యాట్ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. సమయం రెండున్నర గంటలు. ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ (40 ప్రశ్నలు-30 నిమిషాలు), ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు-30 నిమిషాలు), మ్యాథమెటికల్ స్కిల్స్(40 ప్రశ్నలు-40 నిమిషాలు), డేటా అనాలిసిస్ & సఫిషియన్సీ(40 ప్రశ్నలు-35 నిమిషాలు), ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్మెంట్(40 ప్రశ్నలు-15 నిమిషాలు). పది, ఇంటర్, డిగ్రీ స్థాయిలో అడిగే ఈ ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు రుణాత్మక మార్కులు ఉన్నాయి.
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్. వెర్బ్, నౌన్, ప్రొనౌన్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, పారాజంబుల్, సెంటెన్స్ కరెక్షన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్: ఈ విభాగంలో ఫ్యామిలీ ట్రీ, యాక్షన్ కోర్సు, అరేంజ్మెంట్, పై చార్ట్, క్యాలెండర్లు, సిరీస్, కోడింగ్ డీకోడింగ్, విజువల్ రీజనింగ్, గ్రాఫ్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
డేటా అనాలిసిస్ & సఫిషియన్సీ: లైన్గ్రాఫ్స్, బార్గ్రాఫ్స్, కేస్లెట్, డేటా కంపారిజన్ వంటి అంశాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.
మ్యాథమెటికల్ స్కిల్స్: ఆల్జీబ్రా, జియోమెట్రీ, త్రికోణమితి, కొలతలు వంటి అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్మెంట్: ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే నుంచి ప్రశ్నలు ఉంటాయి.
సన్నద్ధత ఇలా..
ముందుగా పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. కనిపించిన ప్రతి సమాచారాన్ని చదివేయకూడదు. సిలబస్ ప్రకారం నాణ్యమైన స్టడీమెటీరియల్ను సేకరించుకోవాలి. ఇందుకోసం నిపుణులు, సీనియర్ల సలహాలను తీసుకోవడం మంచిది. మాక్ టెస్ట్ లు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో పరీక్షలో సమయ నిర్వహణపై పట్టు పెంచుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే అభ్యర్థి విజయం కొంత వరకు ఆధారపడి ఉంటుంది. నిత్యం సాధన చేస్తూ తప్పులను సరిదిద్దుకోవాలి.
వెబ్సైట్: https://mat.aima.in/dec21/