‣ ఆర్ఐఈల్లో కోర్సుల ప్రవేశాలకు ప్రకటన విడుదల
వృత్తిపరమైన సంతృప్తి, సంఘంలో గౌరవం, చెప్పుకోదగ్గ వేతనాలు... ఇవి బోధనరంగంపై ఎక్కువమందికి ఆసక్తి కలిగిస్తున్నాయి. వీరంతా డీఎడ్ లేదా బీఎడ్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థుల కోసం వివిధ సంస్థలు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ)లు ముఖ్యమైనవి. వీటిలో ఇంటిగ్రేటెడ్ బీఏ/బీఎస్సీ ఎడ్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్, బీఎడ్, ఎంఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ముందు రెండు దారులుంటాయి. 1) రెండేళ్ల వ్యవధితో ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2) నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోన్న ఇంటిగ్రేటెడ్ బీఏ/ బీఎస్సీ-ఎడ్ కోర్సుల్లో చేరడం. వీటిలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో చదువుకోవడం వల్ల నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసుకోవచ్చు. సాధారణ పద్ధతుల్లో ముందు డిగ్రీ అనంతరం బీఎడ్ పూర్తిచేయడానికి మొత్తం అయిదేళ్లు అవసరమవుతుంది. ఇంటిగ్రేటెడ్ చదువుల కారణంగా ఏడాది సమయం ఆదాతోపాటు నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అభ్యసించడానికి వీలవుతుంది. అదికూడా జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సంస్థలో విద్య అభ్యసించవచ్చు.
ఇంటర్ ఎంపీసీ విద్యార్థులైతే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్ కోర్సులోకి చేరి ఆరేళ్లకే ఎమ్మెస్సీతోపాటు బీఎడ్ పూర్తి చేసుకుని ఏడాది వ్యవధిని ఆదా చేసుకోవచ్చు. డిగ్రీ విద్యార్థులైతే నేరుగా ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సును మూడేళ్లలో పూర్తి చేసుకోవచ్చు. విడిగా ఈ రెండు కోర్సులూ చదవడానికి నాలుగేళ్లు అవసరమవుతాయి.
ఏ అంశాల్లో ప్రశ్నలు?
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో.. కాంప్రహెన్షన్, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, ఖాళీలను సరైన పదంతో పూరించడం, వాక్యంలో ఉన్న తప్పుని గుర్తించడం, ఇచ్చిన ఫ్రేజ్కు సరైన అర్థం ఇచ్చే ఆప్షన్ గుర్తించడం, అసంపూర్ణంగా ఉన్న వాక్యానికి సరైన పదం చేర్చి పూర్తిచేయడం, సీక్వెన్సింగ్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ప్రిపొజిషన్స్, టెన్సస్, ఆర్టికల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
టీచింగ్ ఆప్టిట్యూడ్లో భాగంగా.. ఎడ్యుకేషన్ ఆటిట్యూడ్, విద్యార్థులు, ఉపాధ్యాయవృత్తి, వృత్తిపరమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ, ఎమోషనల్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పాఠశాల విద్యకు సంబంధించి వర్తమాన సంఘటనలపైన అవగాహనను పరిశీలిస్తారు.
రీజనింగ్ ఎబిలిటీ ద్వారా...వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, మిస్సింగ్ నంబర్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, థీమ్ ఫైండింగ్, జంబ్లింగ్, ఎనాలజీ, భిన్నమైనది గుర్తించడం, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, స్టేట్మెంట్ కన్క్లూజన్లు, సిలాజిజం, లాజికల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్మెంట్ల్లో ప్రశ్నలు సంధిస్తారు.
ఎంపిక విధానం
రాత పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్స్ల్లో సాధించిన మార్కులతో కోర్సులోకి తీసుకుంటారు. ఆర్ఐఈల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తోంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్/డిగ్రీ/బీఎడ్ మార్కులకు 40 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. ఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలో.. భాషా నైపుణ్యాలు, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, టీచింగ్ ఆప్టిట్యూడ్ 30, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాలవారీ సిలబస్, పాత ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో పొందుపరిచారు.
(ఎమ్మెస్సీ ఎడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఒక్కో సబ్జెక్టులో 18 చొప్పున మొత్తం 54 సీట్లు ఉన్నాయి. వీటికి రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆర్ఐఈ, భోపాల్లో ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఎడ్ కోర్సును మూడేళ్ల వ్యవధిలో అందిస్తున్నారు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. వీటికోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు)
ఏమిటి ప్రత్యేకత?
ఇంటిగ్రేటెడ్ బీఎడ్, బీఎడ్, ఎంఎడ్ కోర్సులను పేరున్న సంస్థల్లో చదివినవారు బోధనలో మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. వీరికి తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ సులువుగానే వీరు పోటీ పడగలరు. నాణ్యమైన శిక్షణ కారణంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పే సమర్థతా దక్కుతుంది. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే సమున్నత లక్ష్యంతో ప్రాంతీయ విద్యా శిక్షణ సంస్థ (ఆర్ఐఈ) లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఆర్ఐఈల్లో ఇంటిగ్రేటెడ్ టీచింగ్ కోర్సులు చదివినవారికి జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి.
ఆర్ఐఈలు.. సీట్లు
ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ల్లో ఆర్ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఆర్ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు.

మైసూర్లో బీఎస్సీ బీఎడ్ (ఫిజికల్ సైన్స్)లో 44, బీఎస్సీ బీఎడ్ (బయలాజికల్ సైన్స్)లో 44, బీఏ బీఎడ్ 44 చొప్పున సీట్లు ఉన్నాయి. విడిగా బీఎడ్ కోర్సుకు సంబంధించి సైన్స్ అండ్ మ్యాథ్స్ గ్రూపులో 28, సోషల్ సైన్స్ అండ్ లాంగ్వేజ్ గ్రూపులో 27 సీట్లు ఉన్నాయి. అలాగే ఈ సంస్థలో ఎంఎడ్లో 35 సీట్లు లభిస్తున్నాయి. వీటితోపాటు ఎమ్మెస్సీ ఎడ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 18 చొప్పున సీట్లు ఒక్క మైసూరులోనే ఉన్నాయి. ఈ ఎమ్మెస్సీ ఎడ్ కోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
ఆర్ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ స్కాలర్షిప్పులు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. ఇక్కడి విద్యార్థులకు ఏటా ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారు. బీఎ/ బీఎస్సీ ఎడ్, బీఎడ్ చదువుకున్నవారికి నెలకు కనీసం రూ.25 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీ ఎడ్, ఎంఎడ్ కోర్సుల వారికి కనీసం రూ.35 వేల చొప్పున అవకాశాలు లభిస్తున్నాయి.
అర్హత: బీఎస్సీ బీఎడ్ కోర్సులో చేరడానికి ఇంటర్ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సుకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్ కోర్సుకు సైన్స్ / ఆర్ట్స్/ కామర్స్ ఏదైనా స్ట్రీమ్తో ఇంటర్ చదివినవాళ్లు అర్హులు. ఈ కోర్సులన్నింటికీ ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎంఎడ్ కోర్సుకు 50 శాతం మార్కులతో బీఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉత్తీర్ణత అవసరం. అన్ని కోర్సులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం మార్కులు సరిపోతాయి. అలాగే ఏ కోర్సులో చేరాలన్నా 2020, 2021లో ఇంటర్/డిగ్రీ/బీఎడ్ పూర్తిచేసినవారు, ఈ సంవత్సరం సంబంధిత పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మాత్రమే అర్హులు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. మిగిలిన అందరికీ రూ.వెయ్యి.
పరీక్ష తేదీ: జులై 24
వెబ్సైట్: https://cee.ncert.gov.in//
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఐఐఎఫ్టీలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ
‣ ఒత్తిడి నివారణకు ఇన్స్టా గైడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.