‣ ఇంటర్ తర్వాత కోర్సుల వివరాలు
బైపీసీ గ్రూపు విద్యార్థులు పరిగణించాల్సిన కోర్సుల్లో ఫిజియో థెరపీ ఒకటి. ఎన్నో రుగ్మతలకు మందులతోపాటు ఇది తప్పనిసరైంది. వైకల్యంతో బాధపడేవారు, ప్రమాదాల బారిన పడినవారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారు, నొప్పులతో ఇబ్బందులు పడుతున్నవారు త్వరగా ఉపశమనం పొందడంలో ఫిజియోథెరపీ అస్త్రమైంది. అందువల్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు పూర్తి చేసుకున్నవారి ఉపాధికి ఢోకా లేదు. జాతీయ స్థాయిలో, ఏపీ, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు కార్పొరేట్ ఆసుపత్రులూ ఈ కోర్సును అందిస్తున్నాయి.
వైద్య మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి పదివేల మందికీ ఒక పిజియోథెరపిస్టు ఉండాలి. ప్రస్తుతం అంతమంది నిపుణులు లేరు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సు పూర్తిచేసి, నిలదొక్కుకోవచ్చు. దేశంలో సుమారు 2 శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారని అంచనా. వృత్తి నేపథ్యం కారణంగా వస్తోన్న నొప్పులు, ఆటలు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు, పుట్టుకతో వచ్చే వైకల్యం, జీవనశైలి తెచ్చే సమస్యలు.. వీటి నుంచి వీలైనంత ఉపశమనం కలిగించడమే ఫిజియోథెరపిస్టుల కర్తవ్యం. ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల అనంతరం బయాలజీ బ్రిడ్జికోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరవచ్చు. దీని తర్వాత ఆసక్తి ఉన్నవారు కోరుకున్న స్పెషలైజేషన్తో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పీహెచ్డీ దిశగానూ అడుగులేయవచ్చు.
కోర్సు ఇలా..
ఫిజియోథెరపీ కోర్సు పదో తరగతి తర్వాత ఇంటర్ ఒకేషనల్ విద్యలో భాగంగా పూర్తిచేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (డీపీటీ)నీ కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. అయితే వీటి ప్రాధాన్యం, పరిధి తక్కువ. ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించాలని ఆశించేవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)తో మేటి స్థాయిని అందుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్షిప్ తప్పనిసరి. బోధన అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. కోర్సులో భాగంగా.. మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్ కండిషన్లు, బయోమెకానిక్స్, కైనిసియాలజీ, డిజేబిలిటీ ప్రివెన్షన్, రిహాబిలిటేషన్.. మొదలైనవాటి గురించి నేర్చుకుంటారు.
ఈ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో రాణించడానికి.. ముఖ్యంగా శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లో భాగంగా సమస్యలు ఉన్నవారికి పరికరాల సాయంతో ఉష్ణం, విద్యుత్తు, యాంత్రిక ఒత్తిడి, యాంత్రిక శక్తి ఉపయోగించడం, కొన్ని రకాల వ్యాయామాలు చేయించి ఉపశమనం కలిగిస్తారు.

ఏ నైపుణ్యాలుండాలి?
శారీరక దృఢత్వం ఉండాలి. కొన్నిసార్లు గంటలపాటు, పలు పద్ధతుల్లో, విడతలవారీ వ్యాయామాలు (థెరపీ) చేయించాలి. ఇందుకోసం శక్తి, ఓపిక, శారీరక సన్నద్ధత అవసరం. వైద్యులతో అనుసంధానమవుతూ, వాళ్ల సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు తగ్గ సేవలు అందించాలి. నొప్పి కారణంగా రోగులు ఫిజియోను ఇష్టపడకపోవచ్చు లేదా చికిత్స మధ్యలోనే ఆపేయమని కోరవచ్చు. అందువల్ల థెరపీ ప్రాధాన్యాన్ని వివరించి, వారిని ఒప్పించగలిగే నైపుణ్యం పెంపొందించుకోవాలి. మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగేలా చూడాలి. సహనం, సేవాభావం ఉన్నప్పుడే సమర్థ ఫిజియోథెరపిస్టుగా రాణించడానికి వీలవుతుంది. ఈ వృత్తిలో పేరు సంపాదించడానికి కొన్నేళ్లు పడుతుంది. నైపుణ్యాల వృద్థితో రాణించగలరు.
ఉన్నత విద్య
బీపీటీ పూర్తిచేసుకున్నవారు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ) చదువుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో నచ్చిన స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. మస్కులోస్కెలిటల్ సైన్సెస్, కార్డియో వాస్కులర్ అండ్ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, జెరియాట్రిక్స్, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ ఫిజియో థెరపీ.. మొదలైన వాటిలో ఏదైనా తీసుకోవచ్చు. వీటిని పూర్తిచేసుకున్నవారు సంబంధిత విభాగాల్లో స్పెషలిస్టుగా సేవలు అందించవచ్చు. ఎంపీటీ అనంతరం ఆసక్తి ఉన్నవారు పీహెచ్డీలో చేరవచ్చు. మేటి అవకాశాలకు పీజీ, బోధనలో రాణించడానికి పీహెచ్డీ ఉపయోగపడతాయి. ఫిజియో థెరపీ కోర్సులన్నింటికీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ (ఐఏపీ) అపెక్స్ బాడీగా వ్యవహరిస్తోంది.
అర్హతలు
ఇంటర్ బైపీసీ లేదా ఒకేషనల్ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్ ఒకేషనల్తో పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్ల్లో బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్ సైన్స్ కోర్సులు చదువుకున్నవారు అర్హులు. డిసెంబరు 31, 2023 నాటికి 17 ఏళ్లు నిండాలి.
తాజా ప్రకటనలు
‣ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) తిరుపతి బీపీటీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 50 సీట్లు ఉన్నాయి. ఈఏపీసెట్-2023 ర్యాంకుతో ప్రవేశం లభిస్తుంది. దరఖాస్తుకు గడువు తేదీ ఆగస్టు 5.
‣ ఏపీ, తెలంగాణలోని సంస్థల్లో ప్రవేశాలకు త్వరలో ప్రకటనలు వెలువడతాయి.
‣ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందిస్తున్నాయి. ఏపీలో ఆంధ్రా యూనివర్సిటీ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 41 కళాశాలల్లో ఈ కోర్సు చదువుకోవచ్చు. తెలంగాణలో 22 ప్రైవేటు సంస్థల్లో బీపీటీ ఉంది. ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ల ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. ఇంటర్మీడియట్ బైపీసీ మార్కుల మెరిట్/ ఎంసెట్/ ఈఏపీసెట్/ నీట్ ర్యాంకుతో ప్రవేశం లభిస్తుంది.
మేటి సంస్థలు
‣ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలి టేషన్, ముంబయి
‣ పండిట్ దీన్దయాళ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్, న్యూదిల్లీ
‣ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, చండీగఢ్
‣ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు
‣ మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
‣ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, హైదరాబాద్
‣ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్
‣ శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), తిరుపతి
‣ క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్), సికింద్రాబాద్
‣ యశోదా.. అకాడెమీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్
‣ గీతం, విశాఖపట్నం
(ఈ సంస్థలన్నీ ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ లేదా ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఎంసెట్/ ఈఏపీసెట్/ నీట్ ర్యాంకుతో కోర్సులోకి తీసుకుంటున్నాయి)
కేంద్రం ఆధ్వర్యంలో..
కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవరమెంట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటివ్ డిజేబిలిటీస్ - కోల్కతా, స్వామీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ - కటక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ - చెన్నై ఉమ్మడి పరీక్ష ద్వారా ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ మూడూ జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి.
ఉద్యోగాలు
బీపీటీ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఎంపీటీ విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో సేవలందించవచ్చు. న్యూరాలజీ, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. రిహాబిలిటేషన్ కేంద్రాలు, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లు, ప్రత్యేక పాఠశాలలు, విమెన్ వెల్నెస్ సెంటర్లు, పాలీ క్లినిక్లు, ఓల్డేజ్ హోంలు, హోం కేరింగ్, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్ హోంలు/ ప్రైవేటు కేర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థలు, స్పోర్ట్స్ అకాడెమీలు, ఫిట్నెస్ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి.
కెరియర్ ప్రారంభంలో వేతనం తక్కువగానే ఉంటుంది. అనుభవం, నైపుణ్యాలతో ఆకర్షణీయ ప్రోత్సాహాలు పొందవచ్చు. సొంత ప్రాక్టీస్తోనూ ఆదాయం పెంచుకోవచ్చు. సేవలందిస్తోన్న ప్రాంతం, థెరపీ విధానం బట్టి ఒక్కో సిట్టింగ్కూ రూ.500 వరకు పొందవచ్చు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవలకోసమే ఏర్పాటయ్యాయి. నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్చు. విషయపరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియో థెరపిస్టులు విదేశాల్లోనూ రాణించగలరు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోపాటు పలు దేశాల్లో వీరికి గిరాకీ ఉంది. ఈ దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలూ ఆశించవచ్చు. అమెరికాలో వీరిని ఫిజికల్ థెరపిస్టులుగా పిలుస్తారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ న్యూ ఇండియా ఎస్యూరెన్స్లో 450 ‘ఏవో’ కొలువులు
‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్వో కొలువులు
‣ కేంద్ర బలగాల్లో 1,876 ఎస్ఐ కొలువులు
‣ మేటి మేనేజ్మెంట్ సంస్థల్లోకి ‘మ్యాట్’