• facebook
  • whatsapp
  • telegram

బైపీసీతో భద్రమైన భవిష్యత్తు!

ఇంటర్మీడియట్‌ తర్వాత కోర్సులు

ఎంబీబీఎస్‌ లక్ష్యంగా ఎక్కువమంది ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే ఆశయం గొప్పదే అయినప్పటికీ సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే వైద్యవిద్యలో ప్రవేశించే అవకాశం దక్కుతుంది. మరి మిగిలినవారి పరిస్థితి? బైపీసీ అంటే మెడిసిన్‌ ఒక్కటే కాదు. ఇంకా ఎన్నో కోర్సులున్నాయి. ఇవన్నీ ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయం కానప్పటికీ, ఉన్నత భవిష్యత్తునే అందిస్తాయి! 


వైద్యరంగంలో ప్రవేశానికి నీట్‌ స్కోరు పాస్‌పోర్టు లాంటిది. ఎంబీబీఎస్‌లో అవకాశం రానివాళ్లు బీఏఎంస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్, వెటర్నరీ కోర్సుల్లో చేరుతున్నారు. కొంతమంది విదేశాల్లోనూ వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్తున్నారు. ఎంబీబీఎస్‌ లక్ష్యంగా ఏడాది, రెండు మూడేళ్లు లాంగ్‌ టర్మ్‌లో కొనసాగేవాళ్లూ తక్కువ కాదు. అయితే ఎవరికి వారు తమ శక్తిసామర్థ్యాలను విశ్లేషించుకుని విదేశాల్లో వైద్యవిద్య, లాంగ్‌టర్మ్‌లపై నిర్ణయం తీసుకోవాలి. మిగిలినవాళ్లు అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.  


స్పెషల్‌ బీఎస్సీ 


అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, సెరీకల్చర్‌..తదితర విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధి ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా 70కిపైగా విద్యా సంస్థల్లో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) తరఫున ఎన్‌టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాలి. ఏపీ, తెలంగాణల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తారు. ఈ కోర్సులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. యూజీ తర్వాత పీజీ, పీహెచ్‌డీ కోర్సులను సంబంధిత విభాగాల్లో పూర్తిచేసుకోవచ్చు. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మేటి ఉద్యోగాలు పొందవచ్చు. పీహెచ్‌డీతో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. 

బీఫార్మసీ


ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎంసెట్‌ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ వారికోసమే కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. ఎంఫార్మసీ అనంతరం ఫార్మసీలో పీహెచ్‌డీ పూర్తిచేసుకుని ఔషధాల తయారీలో పాలుపంచుకోవచ్చు.  

రెగ్యులర్‌ బీఎస్సీ 


ఎక్కువమంది బైపీసీ విద్యార్థులు సాధారణ బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్నారు. వీటిలో నచ్చిన మూడు కోర్‌ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు వైవిధ్యమైన కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత విద్యకూ, బోధన, పరిశోధనల్లో రాణించడానికీ బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ...తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. అనంతరం ఈ సబ్జెక్టుల్లోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ రెగ్యులర్‌ బీఎస్సీ కోర్సులను జాతీయ స్థాయిలో పలు సంస్థలు అందిస్తున్నాయి. సీయూసెట్‌ యూజీతో వాటిలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో రాష్ట్రస్థాయి సంస్థల్లో అవకాశం లభిస్తుంది.   


ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ


ఇంటర్‌ బైపీసీ తర్వాత నేరుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరే అవకాశాన్ని చాలా సంస్థలు కల్పిస్తున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. సీయూసెట్‌తో వీటిలో అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌...తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరవచ్చు. 


బీఎస్‌-ఎంఎస్‌ 


ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా పుట్టుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ నీట్‌ స్కోర్‌తో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీవైపు దృష్టి సారించవచ్చు. 


ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌


బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు వైపు అడుగులేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తిచేసుకుని ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించనివారు రెండేళ్ల డీఎడ్‌ కోర్సుల్లో చేరవచ్చు.


పారామెడికల్‌ 


కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారా మెడికల్‌ కోర్సులు ఉపయోగపడతాయి. వీటిని పూర్తిచేసినవారు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో సేవలు అందించవచ్చు. అనస్తీషియా టెక్నాలజీ, మెడికల్‌ టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, స్లీప్‌ లేబొరేటరీ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్‌ టెక్నాలజీ, ఆర్థోపెడిక్స్‌ టెక్నాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ తదితర బ్యాచిలర్‌ కోర్సులు బైపీసీ విద్యార్థులు చదువుకోవచ్చు. కోర్సులను బట్టి వీటి వ్యవధి... మూడేళ్లు, మూడున్నర, నాలుగేళ్లు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ వివిధ కేంద్రాలతోపాటు ఇతర సంస్థల్లో ఈ కోర్సులు ఉన్నాయి. ఏపీలో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలోని సంస్థల్లోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం పారామెడికల్‌ శిక్షణ అందిస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ పారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. రాష్ట్రాల పారా మెడికల్‌ బోర్డుల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో సీట్లు కేటాయిస్తారు.   

నర్సింగ్‌ 


ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కోర్సుగా బీఎస్సీ నర్సింగ్‌ గుర్తింపు పొందింది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఎంసెట్‌/ నీట్‌ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఆ తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. నర్సింగ్‌ విద్యపై ఆసక్తి ఉండి, బీఎస్సీ నర్సింగ్‌లో సీటు రానివాళ్లు జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సుల్లో చేరవచ్చు. 


ఫిజియోథెరపీ

బైపీసీ విద్యార్థులు ప్రాధాన్యమివ్వదగ్గ కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. ఇది పూర్తిచేసుకున్నవారికి ఉపాధికి ఢోకా ఉండదు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 50 కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందుబాటులో ఉంది. జాతీయ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేక సంస్థలు వెలిశాయి. అలాగే ఎయిమ్స్‌తోపాటు పేరున్న సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. గీతం, విశాఖపట్నం గత ఏడాది నుంచి ఫిజియో కోర్సు అందిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఫిజియో అభ్యసించవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌/ ఎంసెట్‌/నీట్‌ స్కోరు లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటారు. బీపీటీ పూర్తిచేసుకున్నవారు ఎంపీటీ కోర్సులో చేరవచ్చు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్‌ దిశగా అడుగులేయవచ్చు.


ఇతర కోర్సులు


బైపీసీ నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతర కోర్సుల్లో చేరాలనుకునేవారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు పలు సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్‌తో ప్రముఖ న్యాయవిశ్వవిద్యాలయాల్లో న్యాయవిద్య అభ్యసించవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్, లిబరల్‌ స్టడీస్, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు..ఇలా ఎవరికి వారు తమకి నచ్చిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ ఆసక్తితో చదవటం ముఖ్యం. అప్పుడే అందులో రాణించడం తేలికవుతుంది!  

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

Posted Date: 25-08-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌